Kolkata Gangrape Case: కాలేజీకి వెళ్లకుండా ఉంటే అలా జరిగేది కాదు.. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై షోకాజ్
ABN , Publish Date - Jun 29 , 2025 | 06:22 PM
మదన్ మిత్రా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురికావడంతో టీఎంసీ దీనిపై సామాజిక మాధ్యమంలో స్పందించింది. వ్యక్తిగత హోదాలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు పార్టీ అభిపాయం కాదని వివరణ ఇచ్చింది. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

కోల్కతా: దక్షిణ కోల్కతాలోని లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక హత్యాచార ఘటన సంచలనం సృష్టించిన క్రమంలో టీఎంసీ నేతల వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, కమర్హాటీ ఎమ్మెల్యే మదన్ మిత్రా వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. దీనిపై ఆయనకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు జారీచేసింది.
మదన్ మిత్రా వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురికావడంతో టీఎంసీ దీనిపై సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్పందించింది. వ్యక్తిగత హోదాలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు పార్టీ అభిపాయం కాదని వివరణ ఇచ్చింది. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
ఎమ్మెల్యే ఏమన్నారంటే..
లా కాలేజీ విద్యార్థినిపై హత్యాచార ఘటనను ఎమ్మెల్యే శనివారంనాడు ప్రస్తావిస్తూ, కాలేజీ మూసివేసినప్పుడు అమ్మాయిలు అక్కడకు వెళ్లడం మంచిది కాదనే సందేశం ఇందులో ఉందని, ఆ అమ్మాయి (బాధిత విద్యార్థిని) అక్కడికి వెళ్లకపోయి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదికాదని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర విమర్శలు చేశాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇతరుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని, బాధితురాలిని తప్పుపడుతున్నట్టు వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శలు వ్యక్తమయ్యాయి.
దీనిపై ఎమ్మెల్యే మిత్రాకు టీఎంసీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్రత బక్షి ఆదివారంనాడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. మిత్రా ఏమాత్రం సున్నితత్వంలేని అనవసర వ్యాఖ్యలు చేశారని, పార్టీ ప్రతిష్టను దెబ్బతినేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆ నోటీసులో పేర్కొన్నారు. మహిళలపై నేరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ టీఎంసీ సహించదని, ఇందుకు భిన్నంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలున్నాయని తప్పుపట్టారు. మూడు రోజుల్లోగా తన వ్యాఖ్యలపై సంజాయిషీ ఇవ్వాలని సుబ్రత బక్షి ఆ నోటీసులో మిత్రాను కోరారు.
స్త్రీ ద్వేషం వ్యాఖ్యలపై మళ్లీ టీఎంసీ ఎంపీల మధ్య వార్
విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి