Share News

Kamal Haasan: తప్పు చేసి భద్రత కోరుతున్నారా? కమల్‌పై కర్ణాటక హైకోర్టు ఫైర్..

ABN , Publish Date - Jun 03 , 2025 | 02:11 PM

Kamal Haasan Court News: సినీనటుడు కమల్ హాసన్‌ 'థగ్ లైఫ్' విడుదల పిటిషన్‌పై విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తప్పు చేసి పోలీసుల భద్రత కోరుతున్నారా? అని ఫైర్ అయింది.

Kamal Haasan: తప్పు చేసి భద్రత కోరుతున్నారా? కమల్‌పై కర్ణాటక హైకోర్టు ఫైర్..
Karnataka High Court Kamal Haasan

Karnataka High Court Kamal Haasan: కన్నడ భాష తమిళం నుంచే పుట్టిందంటూ ఇటీవల ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్‌ (Kamal Haasan) చేసిన ప్రకటనపై కన్నడిగులు భగ్గుమంటున్నారు. దీంతో ఈరోజు (జూన్ 3) కర్ణాటకలో 'థగ్ లైఫ్' సినిమా విడుదలకు ఆటంకం ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కమల్. అయితే, విచారణ సందర్భంగా కర్ణాటక అత్యున్నత న్యాయస్థానం నటుడి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది. తప్పు చేసి పోలీసుల రక్షణ కావాలని కోరడం సరికాదని ఫైర్ అయింది. కన్నడ గురించి తాను చేసిన ప్రకటనపై క్షమాపణ చెప్పబోనని కమల్ హాసన్ వాదించడమే దీనికి కారణం.


కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన ప్రకటనను కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. పైగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనని చెప్పడంతో ఆ రాష్ట్ర ప్రజలు మండిపడుతున్నారు. ఈ రోజు (జూన్ 3) విడుదల కావాల్సిన 'థగ్ లైఫ్'పై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించడంతో కోర్టు మెట్లెక్కారు కమల్. 'థగ్ లైఫ్' విడుదలకు భద్రత కల్పించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు కమల్ హాసన్‌ను తీవ్రంగా మందలించింది.


మీరేమైనా చరిత్రకారులా? హైకోర్టు

మీరు కమల్ హాసన్ అయినంత మాత్రాన ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తారా? అని హైకోర్టు తీవ్రంగా విమర్శించింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఏ పౌరుడికీ లేదని సీరియస్ అయింది. 'మీరేమైనా చరిత్రకారులా? ఏ ఆధారాలతో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో సి. రాజగోపాలాచారి కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. కానీ కమల్ హాసన్ క్షమాపణలు చెప్పలేదు. ఆయన ఈ సినిమాను వాణిజ్య ప్రయోజనాల కోసం తీశారు. ఇప్పుడు తప్పు చేశారు. ఆయన చేసిన తప్పుకు పోలీసులు భద్రత కల్పించాలా? ' అని జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం కమల్ న్యాయవాదిని ప్రశ్నించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కారులో మంటలు.. ప్రయాణీకులు సురక్షితం..

2కె రన్‌లో పాల్గొన్న ‘భైరవం’ చిత్రం యూనిట్

For More AP News and Telugu News

Updated Date - Jun 03 , 2025 | 04:15 PM