Kamal Haasan Rajya Sabha: రాజ్యసభ సభ్యునిగా కమల్హాసన్ ప్రమాణం
ABN , Publish Date - Jul 26 , 2025 | 03:16 AM
తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికైన మక్కల్ నీదిమయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్హాసన్ సహా..

చెన్నై, జూలై25 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికైన ‘మక్కల్ నీదిమయ్యం’ అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్హాసన్ సహా ఆరుగురు శుక్రవారం పార్లమెంట్లో ప్రమాణస్వీకారం చేశారు. డీఎంకేకు చెందిన రాజ్యసభ సభ్యులు పి.విల్సన్, షణ్ముగం, అబ్దుల్లా, అన్నాడీఎంకేకు చెందిన చంద్రశేఖరన్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే సభ్యుడు అన్బుమణి పదవీకాలం గురువారంతో ముగిసింది. వీరి స్థానంలో తమిళనాడు నుంచి డీఎంకే మద్దతుతో ఎంపికైన కమల్హాసన్, ఆ పార్టీకి చెందిన సీనియర్ న్యాయవాది విల్సన్, కవయిత్రి సల్మా, ఎస్ఆర్ శివలింగం, అన్నాడీఎంకే తరఫున ఎంపికైన ఇన్బదురై, ధనపాల్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. వీరంతా తమిళంలోనే ప్రమాణం చేశారు. 2018లో కమల్ ‘మక్కల్ నీదిమయ్యం’ పార్టీ స్థాపించారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆపార్టీ ఘోరపరాజయం పాలైంది. అయితే 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కమల్ పార్టీ డీఎంకే కూటమికి మద్దతు పలికింది. ఆ ఎన్నికల్లో ఎలాంటి స్థానం కేటాయించని డీఎంకే అధినేత స్టాలిన్.. భవిష్యత్తులో కమల్ను రాజ్యసభకు పంపుతామని హామీనిచ్చారు. ఆ మేరకు ఇప్పుడు కమల్ డీఎంకే మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికై రాజ్యసభలోకి అడుగు పెట్టారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News