Share News

Airspace Ban: పాక్‌కు షాక్ .. ఎయిర్‌స్పేస్ బ్యాన్ పొడిగించిన భారత్..

ABN , Publish Date - May 23 , 2025 | 08:15 PM

India Airspace Ban Pakistan: భారత ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన చర్యలు కొనసాగిస్తూనే ఉంది. భారత గగనతలంలో దాయాది విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగించింది.

Airspace Ban: పాక్‌కు షాక్ .. ఎయిర్‌స్పేస్ బ్యాన్ పొడిగించిన భారత్..
India Extends Airspace Ban to Pakistan

India Extends Airspace Restrictions: ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ, పాకిస్థాన్ దుష్టబుద్ధిని ప్రపంచానికి తేటతెల్లం పనిలో పూర్తిగా నిమగ్నమైంది భారత ప్రభుత్వం. కశ్మీర్, ఉగ్రవాదం రెండూ వేర్వేరు అంశాలని.. ఈ సమస్యలపై ఎవరి మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదని ఇప్పటికే ప్రధాని మోదీ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద నిర్మూలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం దాయాది దేశంపై కఠిన చర్యలు కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) కీలక నిర్ణయం తీసుకుంది. భారత గగనతలంలోపాకిస్థాన్ విమానాలపై విధించిన నిషేధాన్ని జూన్ 23వ వరకూ పొడిగించింది.


"పాకిస్థాన్ విమానాలకు NOTAMను భారతదేశం ఒక నెల పాటు పొడిగించింది. ఇది 2025 జూన్ 23 వరకు అమలులో ఉంటుంది. పాకిస్థాన్‌లో నమోదైన ACFTలు, సైనిక విమానాలు సహా పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్, ఆ దేశ ఆపరేటర్లు నిర్వహించేవైనా, యాజమాన్యం కింద నడిపేవైనా లేదా లీజుకు తీసుకున్న ACFTలకు భారత గగనతలం ఆమోదించదు" అని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు ఘోరమైన పహల్గాం దాడికి పాల్పడిన అనంతరం.. ఏప్రిల్ 23న పాకిస్థాన్ తన గగనతలంలోకి భారత విమానాలను నిషేధించింది . దీనికి ప్రతిస్పందనగా భారత్ వారం తర్వాత ఒక నోటామ్ జారీ చేసింది. పాకిస్థాన్ కు చెందిన విమానాలను భారత ఎయిర్‌స్పేస్ లో బ్యాన్ చేసింది. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనలకు అనుగుణంగా గగనతల పరిమితులు ఒకేసారి ఒక నెల మించరాదని నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ మూసివేతను ఒక నెల పాటు ప్రవేశపెట్టారు.


మే 7న పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ 'ఆపరేషన్ సిందూర్'గా పేరుతో సైనిక దాడుల నిర్వహించింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన దాడికి ప్రతీకారంగా దాయాది దేశంలో 9 కీలక ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్ధతు ఆపేసినప్పుడు మాత్రమే సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణను పరిశీలిస్తామని ప్రకటించింది. ఇంకా, అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను మూసివేసింది. చెల్లుబాటు అయ్యే పత్రాలతో భారతదేశంలోకి ప్రవేశించిన పాకిస్థానీ పౌరులు దేశం విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఆ దేశ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేశారు. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థానీలకు ప్రయాణాన్ని నిలిపివేశారు.


ఇవీ చదవండి:

మైసూర్ శాండల్ బ్రాండ్ అంబాసిడర్‌‎గా తమన్నా..విమర్శలు

దటీజ్ ఇండియా.. హిందూ జంట కోసం మండపం షేర్ చేసిన ముస్లిం ఫ్యామిలీ..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 23 , 2025 | 08:41 PM