Share News

PM Modi: సిద్ధమా

ABN , Publish Date - May 09 , 2025 | 03:56 AM

భారతదేశంలో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రధాని మోదీ సైనిక స్థావరాల భద్రత, సమాచార సమన్వయంపై కీలక ఆదేశాలు ఇచ్చారు.

PM Modi: సిద్ధమా

  • నిరంతరం అప్రమత్తంగా ఉండండి: మోదీ

  • ఎప్పుడు ఎక్కడ ఏమి జరిగినా సమాచారం క్షణాల్లో తెలిసిపోవాలి

  • ప్రజల భద్రత ముఖ్యం.. జాగ్రత్త

  • తప్పుడు సమాచారాన్ని అడ్డుకోండి

  • సైనిక స్థావరాల భద్రతకు చర్యలు తీసుకోండి

  • కీలక శాఖల కార్యదర్శులకు మోదీ నిర్దేశం

న్యూఢిల్లీ, మే 8: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. బుధవారం కశ్మీరులో సరిహద్దు వెంట జనావాసాలపై గుళ్ల వర్షం కురిపించిన పాకిస్థాన్‌.. గురువారం ఇరు దేశాల సరిహద్దుల్లో అటు చివరి నుంచి ఇటు చివరికి భారతసైనిక స్థావరాలపై దాడులకు విఫలయత్నం చేసింది. ఫలితంగా రాబోయే రోజుల్లో కశ్మీరు నుంచి కచ్‌ వరకూ సరిహద్దుల వెంట ఉండే ప్రజల ప్రాణాలను కాపాడడం తక్షణ కర్తవ్యంగా మారింది. ఇప్పటికే జమ్మూకశ్మీరు సరిహద్దు గ్రామాల్లో వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్‌, గుజరాత్‌ సహా సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలను తరలించాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తుతాయా!? అనే సందేహాలూ వెలువడుతున్నాయి. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు రాకుండానే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇక, ఇరు దేశాల దాడుల నేపథ్యంలో బుధవారం నుంచి సోషల్‌ మీడియాలో రకరకాల విశ్లేషణలూ వెలువడుతున్నా యి. వీటిలో నిజాలూ అర్ధ నిజాలూ అసత్యాలూ ఉంటున్నాయి. వీటిని ఆదిలోనే అడ్డుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రతి దాడి చేస్తే ముందుగా సైనిక స్థావరాలపైనే గురిపెట్టే అవకాశం ఉంది. గురువారం పాక్‌ గురి పెట్టిందీ వీటిపైనే! వాటిని కాపాడుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ కేంద్రంలోని వివిధ శాఖల కార్యదర్శులతో గురువారం సమావేశమయ్యారు.


జాతీయ స్థాయిలో సన్నద్ధత, వాటి ప్లానింగ్‌, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంపై ఈ ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. యుద్ధ సన్నద్ధత.. దేశ భద్రత.. ప్రథమ ప్రాధాన్యాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఎప్పుడు ఏమి జరిగినా క్షణాల్లో సమాచారం చేరిపోవాలని, ఇందుకు శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా రంగం సిద్ధం చేయాలని నిర్దేశించారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు తక్కువ సమయంలోనే కోలుకుని తిరిగి యథా ప్రకారం కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా మంత్రిత్వ శాఖలు తమ కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించుకోవాలని, అత్యవసర వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేసేలా చూసుకోవాలని నిర్దేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు, అంతర్గత కమ్యూనికేషన్‌ ప్రొటోకాల్స్‌పై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. దేశవ్యాప్తంగా పౌర రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఫేక్‌న్యూస్‌, తప్పు డు సమాచార వ్యాప్తిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని నిర్దేశించారు. సైనిక స్థావరాలు వంటి కీలక వ్యవస్థల భద్రతకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రాల్లోని అధికార యంత్రాంగంతోపాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న క్షేత్రస్థాయి సంస్థలతో ఎప్పటికప్పుడు సమన్వయం కీలకమని కార్యదర్శులకు ప్రధానిసూచించారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయా మంత్రిత్వ శాఖలు ప్రధాని మోదీకి వివరించాయి. సమావేశంలో క్యాబినెట్‌ సెక్రటరీ, పీఎంవో సీనియర్‌ అధికారులు, రక్షణ, హోం, విదేశాంగ, విద్యుత్తు, ఆరోగ్యం, టెలి కమ్యూనికేషన్లు, సమాచార ప్రసార శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - May 09 , 2025 | 03:56 AM