Traffic Challan: బాబోయ్.. ఈ బైక్పై 311 కేసులు.. రూ. 1.61 లక్షల ఫైన్..
ABN , Publish Date - Feb 06 , 2025 | 02:07 PM
Traffic Challan: ఓ స్కూటర్పై బెంగళూరు పోలీసులు భారీగా చలాన్లు వేశారు. ఆయన నడిపే స్కూటర్పై ఏకంగా 311 కేసులను ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు.

బెంగళూరు: ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు తరచూగా సూచిస్తుంటారు. ఇందుకోసం వారు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయితే కొంతమంది మాత్రం యథేచ్ఛగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు భారీగా చలాన్లు విధిస్తున్నారు.
అయితే బెంగళూరులో కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహారిస్తున్నారు. ఓ ద్విచక్రవాహనదారుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. ఆ వ్యక్తి రికార్డు స్థాయిల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. ఆయన నడిపే స్కూటర్పై ఏకంగా 311 కేసులను ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు. రూ.1.60 లక్షల జరిమానా విధించారు. మరోసారి అతను ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా సీజ్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో చలానా చెల్లించాలంటే మాటలా. కాని సదరు వ్యక్తి మాత్రం భారీగా నమోదైన చలానాలను చెల్లించి తన వాహనాన్ని తీసుకెళ్లాడు. ఈ వార్త తెలిసిన వారు అవాక్కవుతున్నారు.
బెంగళూరులోని కలాసిపాల్య ప్రాంతంలో పెరియాస్వామి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయనకు ఓ ట్రావెల్ ఏజెన్సీ ఉంది. అయితే ఆ వ్యక్తి మాత్రం యథేచ్ఛగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. పెరియాస్వామి నడిపే స్కూటర్పై రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పోలీసులు నమోదు చేశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం, ప్రయాణంలో మొబైల్ వినియోగం, సిగ్నల్ జంపింగ్ తదితర కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులు మాత్రం చూసీ చూడనట్లుగా వదిలేశారు. అయితే స్థానికంగా ఉండే యువకుడు మాత్రం పెరియాస్వామి తరచూగా ఉల్లంఘనలకు పాల్పడటం గమనించాడు.
ఇలా ఏడాది కాలంగా గమనిస్తున్న యువకుడు పెరియాస్వామి నడిపే స్కూటర్ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ స్కూటర్ను ఇంకా ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను ప్రశ్నించాడు. స్కూటర్పై ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలు, జరిమానాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలోని అతని పోస్టుకు జత చేశాడు. సోషల్ మీడియాలో యువకుడు పెట్టిన పోస్టు నిమిషాల వ్యవధిలో బాగా వైరల్ అయింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఆగమేఘాల మీద చర్యలు చేపట్టారు. పెరియాస్వామి స్కూటర్పై 311 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు రూ.1,61,500 చలాన్లను బెంగళూరు సిటీ మార్కెట్ ట్రాఫిక్ పోలీసులు విధించి వాహనాన్ని సీజ్ చేశారు. ఇదిలా ఉంటే మరుసటి రోజే పెరియాస్వామి తన స్కూటర్ను తీసుకెళ్లడానికి పోలీసు స్టేషన్కు వెళ్లాడు. అయితే ఆయనకు ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఇక మీదట ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు.