IndiGo Flight: మానవత్వం మరిచిన పాక్.. 220 మంది ప్రాణాలతో చెలగాటం..
ABN , Publish Date - May 24 , 2025 | 07:35 AM
Pakistan Aispace Denial IndiGo Flight: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణిగినా కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. భారత్ సింధూ జలాల ఒప్పందం, ఎయిర్స్పేస్ బ్యాన్ తదితర విషయాల్లో కఠిన వైఖరితో ముందుకెళ్తోంది. ఇది మనసులో పెట్టుకున్న పొరుగు దేశం అమానవీయ చర్యకు పాల్పడింది. మీ గగనతలంలోకి అనుమతించకపోతే 220 మంది ప్రాణాలకు గాల్లో కలిసే ప్రమాదముందని ఇండిగో పైలట్ అభ్యర్థించినా కనికరించలేదు. చివరకి ఏమైందంటే..

DGCA Probe IndiGo Flight: భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాకిస్థాన్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని పదే పదే గొంతు చించుకుంటోంది పొరుగు దేశం. సింధూ నది నీళ్లు ఆపేయవద్దని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. ఉగ్రవాదల నిర్మూలనకు సహకరించే వరకూ నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసేసింది భారత్. తాజాగా ఎయిర్స్పేస్ బ్యాన్ నూ పొడిగించింది. అయితే, ఇదే సమయంలో ఓ అనూహ్య ఘటన జరిగింది. దేశరాజధాని ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం వడగళ్ల వర్షం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మరో మార్గం లేక గగనతలంలోకి అనుమతించమని ఇండిగో అధికారులు పాకిస్థాన్ను అభ్యర్థించారు. లేకపోతే 220 మంది ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదముందని వేడుకున్నారు. అయినా, దాయాది దేశం కనికరించలేదు.
227 మంది ప్రాణాలు గాల్లో.. కనికరించని పాక్..
బుధవారం నాడు 227 మందికిపైగా ప్రయాణీకులతో ఇండిగో 6ఇ 2142 విమానం రాజధాని ఢిల్లీ నుంచి శ్రీనగర్కు బయల్దేరింది. అమృత్సర్ మీదుగా వెళ్లే సమయంలో విమానం అకస్మాత్తుగా కుదుపుకు లోనయినట్లు పైలట్ గుర్తించారు. చూస్తే వాతావరణ పరిస్థితులు చకచకా మారిపోతున్నాయి. దట్టంగా కమ్ముకున్న మబ్బుల మధ్య గమ్యం చేరుకోవడం కష్టంగా మారింది. దీనికి తోడు విమానం తలకిందులు అవుతుందేమో అనేంతలా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన. వాతావరణ గండం నుంచి బయటపడాలంటే ల్యాండ్ చేయక తప్పని పరిస్థితి. మరో ప్రాంతానికి వెళ్లే దారి లేక తప్పనిపరిస్థితుల్లో పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించడానికి లాహోర్ ATCని సాయమందించమని కోరారు ఇండిగో అధికారులు. కానీ, లాహోర్ ATC కాస్త కూడా కనికరం లేకుండా వారి అభ్యర్థనను తిరస్కరించారు.
విమానంలో 5 మంది ఎంపీలు..
దీంతో అల్లకల్లోల వాతావరణ పరిస్థితుల్లోనే పైలట్లు ఇండిగో విమానాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఉరుములు, మెరపులు, వడగళ్ల వాన మధ్యే నడిపారు. ఆ సమయంలో విమానం ఒకేసారి వేల అడుగుల ఎత్తులో నుంచి వేగంగా పడిపోవడం ప్రారంభమైంది. ఒక పక్క ప్రయాణీకులు ప్రాణాలు పోతాయనే భయంతో గట్టిగా కేకలు వేస్తున్నా పైలట్లు ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ప్రమాదకర పరిస్థితుల్లో చాకచక్యంగా విమానాన్ని నడపి సురక్షితంగా ల్యాండ్ చేశారు. 227 మంది ప్రయాణీకులను రక్షించారు. ఈ ప్రయాణీకుల్లో 5 మంది టీఎంసీ (తృణమూల్ కాంగ్రెస్) ఎంపీలు కూడా ఉన్నారు.
227 మంది సేఫ్..
పాకిస్థాన్ అమానవీయ వైఖరే ఈ భీతావహ ఘటనకు కారణం కావడంతో వాచ్డాగ్ DGCA స్పందించింది. విమానంలోని సిబ్బంది పరిస్థితిని వివరించినా పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించడానికి అనుమతించలేదని స్పష్టం చేసింది. ఈ సంఘటన గురించి ఒక వివరణాత్మక ప్రకటనలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానంలో ఉన్న ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాలేదని, కేవలం విమానం "నోస్ రాడోమ్" దెబ్బతిన్నదని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ
పాక్ చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. తుర్కియేకు అసదుద్దీన్ ఒవైసీ సూచన..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి