Digital Voting App: బిహార్లో మొబైల్ ఈ-ఓటింగ్
ABN , Publish Date - Jun 29 , 2025 | 05:15 AM
దేశంలో ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. అందులో నూతనంగా తీసుకొచ్చిన మొబైల్ ఈ-ఓటింగ్ ఒకటి. దీనిని దేశంలోనే తొలిసారి బిహార్లో ప్రారంభించారు. దీంతో మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం బిహార్ ఓటర్లకు దక్కింది.

యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం.. దేశంలోనే తొలిసారి ప్రారంభం
మునిసిపల్ ఎన్నికల్లో అందుబాటులోకి
వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల కోసమే
రిజిస్టర్ చేసుకున్న 10వేల మంది
పాట్నా, జూన్ 28: దేశంలో ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల కమిషన్ ఎన్నో సదుపాయాలు కల్పిస్తోంది. అందులో నూతనంగా తీసుకొచ్చిన మొబైల్ ఈ-ఓటింగ్ ఒకటి. దీనిని దేశంలోనే తొలిసారి బిహార్లో ప్రారంభించారు. దీంతో మొబైల్ యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం బిహార్ ఓటర్లకు దక్కింది. ఈ పైలట్ ప్రాజెక్టును స్థానిక మునిసిపల్ ఎన్నికల్లో ఆరు కౌన్సిల్స్ పరిధిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మొబైల్ యాప్ను వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, వలస కార్మికులతో పాటు పోలింగ్ స్టేషన్కు రాలేని విధంగా జబ్బు పడ్డ వ్యక్తుల కోసం అభివృద్ధి చేశారు. ఈ యాప్ ద్వారా ఓటు వేసే ప్రక్రియను పాట్నాలో మూడు, రోహతాస్లో రెండు, తూర్పు చంపారన్లోని ఓ కౌన్సిల్లో ప్రారంభించామని బిహార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ తెలిపారు. పోలింగ్ స్టేషన్కు రాకుండానే 50 వేల మంది ఈ ఓటింగ్ యాప్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉందని, అయితే 10 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించారు.
ఎలా పనిచేస్తుంది..?
ట్యాంపర్ చేయడానికి వీలులేని టెక్నాలజీతో అత్యంత రక్షణ ప్రమాణాలతో ఈ మొబైల్ యాప్ను రూపొందించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రికార్డు అయిన ఓట్లు అత్యంత భద్రతతో, మార్పుచేయడానికి వీల్లేకుండా స్టోర్ అవుతాయి.
ఫేస్ రికగ్నిషన్, మ్యాచింగ్ టెక్నాలజీ యాప్ లాగిన్, ఓటింగ్ సమయంలో ఓటర్ల గుర్తింపును ధ్రువీకరిస్తుంది. డిజిటల్ స్కానింగ్, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (ఓసీఆర్).. ఓట్లను కచ్చితంగా లెక్కించడానికి సహాయ పడుతుంది.
ఆడిట్ ట్రెయిల్స్తో.. ఈవీఎంలో వీవీప్యాట్ లాగానే ఓట్లను సరిపోల్చే అవకాశం ఉంటుంది.
ఒక మొబైల్ నంబర్ నుంచి ఇద్దరు ఓటర్లు మాత్రమే రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటర్ ఐడీతో ప్రతి ఓటు నిర్ధారణ చేసుకున్నాకే ఓటు రికార్డు అవుతుంది.
బిహార్లో ఇలా మొదలైంది..
మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్, ఓటింగ్ పక్రియ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని, మొదటిసారి డిజిటల్ ఓటర్లయినా ఏవిధమైన గందరగోళం లేకుండా ఓటు వేయవచ్చని ఎన్నికల అధికారులు చెప్పారు. ఈ-ఓటు ఎలా వేయాలంటే..
మొదట ఈ-ఎస్ఈసీబీహెచ్ఆర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. (ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది). ఎలక్టోరల్ రోల్లో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్తో యాప్ను లింక్ చేయాలి. ధ్రువీకరణ పూర్తయిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా లేదా ఈ-ఎస్ఈసీబీహెచ్ఆర్ యాప్ ద్వారా ఎలక్షన్ రోజు ఓటు వేయవచ్చు.
ఓటర్ల జాబితా పునఃపరిశీలన
బిహార్లో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పునఃపరిశీలించే ప్రత్యేక పక్రియ ప్రారంభమైందని ఎన్నికల కమిషన్ తెలిసింది. కేవలం భారతీయులు మాత్రమే ఓటు వేసేందుకు రాజ్యాంగం హక్కు కల్పించిందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఓటర్లను తొలిగిస్తున్నారన్న ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో ఈసీ ఈ ప్రకటన జారీ చేసింది. ఈఏడాది బిహార్తో మొదలుపెట్టి ఆరు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియను ఈసీ చేపట్టింది. పుట్టిన ప్రాంతాన్ని పరిశీలించడం ద్వారా అక్రమంగా వలస వచ్చిన విదేశీయులను జాబితా నుంచి తొలిగించేందుకు కసరత్తు చేస్తోంది.