Amit Shah: 20 ఏళ్లు మీరు అక్కడే కూర్చోండి.. విపక్షాలపై షా ఫైర్
ABN , Publish Date - Jul 28 , 2025 | 08:50 PM
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో జైశంకర్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు పలుమార్లు అంతరాయం కలిగించారు. దీంతో అమిత్షా జోక్యం చేసుకుంటూ.. మీ సొంత విదేశాంగ మంత్రినే మీరు నమ్మరా' అంటూ విపక్షాలపై మండిపడ్డారు.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై లోక్సభలో సోమవారం నాడు వాడివేడి చర్చ జరుగుతుండగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చర్చ సందర్భంగా భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదని కేంద్రమంత్రి ఎస్.జైశంకర్ చెప్పడంతో విపక్ష సభ్యులు ఆయనపై ప్రశ్నలు కురిపించారు. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్షా (Amit Shah) ఫైర్ అయ్యారు. 'మరో 20 ఏళ్లు మీరు అక్కడే కూర్చుండిపోతారు' అంటూ విపక్షాలపై మండిపడ్డారు.
'విపక్షాల తీరుపై నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. వాళ్లకు భారత విదేశాంగ మంత్రిపై నమ్మకం లేదు. కానీ కొన్ని ఇతర దేశాలపై విశ్వాసం కనబరుస్తుంటారు. విదేశం (ఫారెన్) అంటే ఆ పార్టీకి ఉన్న మక్కువ ఏమిటో నేను అర్థం చేసుకోగలను. దాని అర్థం ఆ పార్టీ వ్యవహారాలను ఇక్కడ రుద్దమని కాదు. ఆ కారణంగానే వాళ్లు అక్కడ (విపక్ష బెంచీల్లో) ఉండిపోయారు. మరో 20 ఏళ్లు కూడా అక్కడే ఉండిపోతారు' అంటూ అమిత్షా నిప్పులు చెరిగారు.
ప్రసంగానికి అడుగడుగునా అడ్డు..
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై జరిగిన చర్చలో జైశంకర్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు పలుమార్లు అంతరాయం కలిగించారు. దీంతో అమిత్షా జోక్యం చేసుకుంటూ 'మీ సొంత విదేశాంగ మంత్రినే మీరు నమ్మరా?' అంటూ విపక్షాలపై మండిపడ్డారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం లేదని, ఏప్రిల్ 22 (పహల్గాం ఘటన జరిగిన రోజు) నుంచి జూన్ 27 వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలూ జరగలేదని జైశంకర్ చర్చ సందర్భంగా సభకు వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్నాథ్
For More National News and Telugu News..