Health: వ్యాధులు సంక్రమించే కాలం.. జర జాగ్రత్త
ABN , Publish Date - Jun 05 , 2025 | 10:57 AM
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆయా వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తాగునీరు కలుషితం కావడం, తడి వాతావరణంతో వివిధ అంటురోగాలు వస్తుంటాచి. ఈ సీజన్లో వచ్చే వ్యాధులు, అవి ఎలా వస్తాయి, వాటి వివరాలు ఓసారి పరిశీలిస్తే...

- ముందు జాగ్రత్త అవసరం
వర్షా కాలంలో పరిసరాల అపరిశుభ్రత కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాక శుభ్రమైన నీటిని, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. వర్షాకాలంలో ప్రధానంగా కలుషిత నీటిని తాగడం వల్ల, పారిశుధ్య సమస్యలతో ఈగలు, దోమలు వృద్ధి చెంది వ్యాధులు వచ్చేందుకు కారణమవుతాయి. ఈ సీజన్లో మలేరియా, డెంగీ, టైఫాయిడ్, డయేరియా, హెపటైటిస్ ఏ, ఈ వంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. (హైదరాబాద్)
టైఫాయిడ్
సాల్మోనెల్లా అనే జాతి బ్యాక్టీరియా ద్వారా టైఫాయిడ్ జ్వరం వ్యాపిచెందుతుంది. తీవ్రమైన జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, టైఫాయిడ్ ప్రాథమిక లక్షణాలు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కునే వారికి బ్యాక్టీరియా ప్రబలే ప్రమాదం చాలా తక్కువ. కలుషిత నీటిని సేవిస్తే టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో నీటిని వేడి చేసి చల్లార్చిన అనంతరం తాగితే మంచిది. బాగా ఉడికిన పదార్థాలను తినాలి. అపరిశుభ్రమైన పచ్చి కూరగాయలను, పండ్లను తినడం మంచిది కాదు.
డయేరియా, అమీబియాసిస్
వాంతులు, విరోచనల ద్వారా శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోవడాన్ని డయేరియా అంటారు. ఆహారనాళంలో ఈకోలి బ్యాక్టిరియా చేరడంతో ఇన్ఫెక్షన్తో డయేరియా వస్తుంది. అపరిశుభ్రమైన నీరు, సరిగ్గా ఉడకని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా వచ్చే అవకాశం ఉంది. కడుపు నొప్పితో పాటు నీళ్ల విరేచనాలు, వాంతులు, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. ఎంటమిబా ఇస్టోలిటికా అనే సూక్ష్మ పరాన్న జీవి వల్ల పేగు వ్యాధి సంక్రమిస్తుంది. విరోచనాలవడం, కడుపులో వికారంగా ఉండడం, బరువు తగ్గడం వంటివి దీని లక్షణాలు. అపరిశుభ్ర ఆహార పదార్థాలు, నీటిని తీసుకోవడం ద్వారా వ్యాధి సోకే అవకాశాలున్నాయి. క్లోరిన్ నీళ్లతో అమీబాసి్స్టలు అంతరించవు. ఉప్పు నీటిని వియోగించడం మంచిది.
మలేరియా
వర్షాకాలంలో దోమల వల్ల వ్యాపించే వ్యాధుల్లో ప్రధానమైనది మలేరియా. నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో ఆడ ఎనాఫిలస్ దోమలు బాగా వృద్ధి చెంది అవి కుట్టినప్పుడు మలేరియా వ్యాధి సంక్రమిస్తుంది. దోమలను నియంత్రిస్తే ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. ఇళ్లలో దోమ తెరలు, మస్కిటో కాయిల్స్ ఉపయోగించాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
డెంగీ
ప్రాణాల మీదకు వచ్చే దాక డెంగీ జ్వరం తెలియదు. ఇది టైగర్ దోమకాటుతో సంక్రమిస్తుంది. తీవ్రమైన జ్వరం, ఒంటిపై దద్దులు, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి లక్షణాలు వస్తే డెంగీ వ్యాధిగా నిర్ధారణ చేసుకోవాలి. దోమలను నియంత్రిస్తే ఈ వ్యాధిని కూడా అరికట్టవచ్చు. దోమలు వ్యాప్తి చెందకుండా ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్త, మురుగునీరు ఉండకుండా జాగ్రత్త వహించాలి.
కలరా
లైబ్రియోకలరే అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉన్న ఆహార పదార్థాలను తిన్నా, నీటిని తాగినా, వ్యాధి సోకిన వ్యక్తుల మల పదార్థాల ద్వారా బ్యాక్టీరియా విస్తరించినా ఈ వ్యాధి వస్తుంది. చేపలు, రొయ్యలు, సీ ఫుడ్స్ తీసుకున్న వారిలో కూడా ఈ వ్యాధిసోకే అవకాశాలు ఉన్నాయి. వాంతులు, విరోచనలు, జ్వరం, నీరసం వంటివి ఈ వ్యాధి లక్షణాలు. పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకుంటే ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. పరిసరాలలో నీరు నిలువ ఉండకుండా చెత్తలేకుండా జాగ్రత్త వహించాలి. కాచి చల్లార్చిన వాడబోసిన నీటిని తాగాలి. దోమలు దరిచేరకుండా పరిశుభ్రతను పాటించాలి. ఇండ్లల్లో నీటిని ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోకూడదు. దోమలు వ్యాపించకుండా డీడీటీ పౌడర్ను వాడాలి. చేతులను శుభ్రం చేసిన అనంతరమే ఆహారాన్ని భుజించాలి. కొబ్బరి బొండాలు, టైర్లు, ట్యూబ్లు ఇంటి పరసర ప్రాంతాల్ల నిలువ ఉండకుండా జాగ్రత్తలు వహించాలి. - డాక్టర్ శ్వేత, అల్వాల్ పీహెచ్సీ సివిల్ అసిస్టెంట్ సర్జన్
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News