Mangoes: మధుర ఫలం.. కెమికల్స్తో విషతుల్యం
ABN , Publish Date - May 02 , 2025 | 10:54 AM
నోరూరించే మామిడి పండ్లు విషతుల్యంగా మారుతున్నాయి. అవి పక్వానికి రాకముందే వివిధ రకాల కెమికల్స్ వాడుతున్నారు. దీంతో మధుర ఫలం కాస్త విషతుల్యమవుతోంది. ఆ పండ్లను తినడం ద్వారా అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది.

- కెమికల్స్తో పండ్ల పక్వం
- తనిఖీలు లేక రెచ్చిపోతున్న వ్యాపారులు
- అనారోగ్యం పాలవుతున్న ప్రజలు
హైదరాబాద్: ఎండాకాలం అనగానే గుర్తొచ్చేవి మామిడి పండ్లు. నోరూరించే మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతారు. అయితే కాయలు త్వరగా పండ్లు కావాలనే ఉద్దేశ్యంతో కొంతమంది వ్యాపారులు కెమికల్స్ ఉపయోగిస్తున్నారు. వ్యాపారుల మధ్య నెలకొన్న పోటీతో మదుర ఫలం విషతుల్యమవుతోంది. పండ్ల తోటల నుంచి పచ్చి మామిపండ్లను తక్కువ ధరల్లో కొనుగోలు చేసి వాటిని గోదాంలకు తరలించి రసాయన పదార్థాలను వినియోగించి మాగపెడుతున్నారు. కాయలు పక్వానికి రాగానే మార్కెట్లో అమ్ముతూ ప్రజల ప్రాణాలతో కొందరు వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. మామిడి పండ్లను తిన్న ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రుల బాట పడుతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ ఏరియాలో.. డ్రోన్ల ఎగరవేతపై నిషేధం..
మార్కెట్లోకి మామిడి పండ్లు..
మార్కెట్లోకి మామిడి పండ్లు వచ్చేశాయి. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జేఎన్టీయూ, బాలానగర్, ఫతేనగర్, ఓల్డుబోయినపల్లి, హైదర్నగర్, వివేకానందనగర్, అల్లాపూర్, ఆల్విన్కాలనీ, తదితర ప్రాంతాల్లో వ్యాపారులు మామిడి పండ్లను విక్రయిస్తున్నారు. ప్రస్తు తం మార్కెట్లో కిలో మామిడి పండ్లు రూ. 100 నుంచి రూ.200 వర కు ధర పలుకుతున్నాయి. రసాలు కిలో రూ.100 నుంచి రూ.150కి విక్రయిస్తున్నారు. మామిడి పండ్లను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు.
రసాయనలతో 24 గంటల్లోనే..
తియ్యని మామిడి పండ్ల వెనుక విషతుల్యం దాగి ఉంది. మామిడి కాయలను చెట్టు పైనే పక్వానికి వచ్చే వరకు ఉంచినట్లైతే సహజ సిద్దమైన తీపిగా ఉంటాయి. కానీ వ్యాపారులు పక్వానికి రాకుండానే పచ్చి కాయలను తోట నుంచి గోదాంకు తీసుకువచ్చి కాల్షియం కార్బైడ్ ఇథలీన్లను వినియోగించి కాయలు 18 నుంచి 24 గంటల్లో పక్వానికి వచ్చే చేస్తున్నారు. మామిడి పండ్లు మాత్రమే కాకుండా అరటి, సపోట, బొప్పాయి వంటి పండ్లను కూడా రసాయనలతో మాగబెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెచ్చిపోతున్న వ్యాపారులు..
నగరంలో ప్రజారోగ్యాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు. ఆహార భద్రతాధికారులు, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో మామిడి పండ్లనే కాకుండా ఇతర పండ్లను కూడా కృత్రిమ పద్ధతుల్లో మాగపెడుతున్నారు. దీనిపై పలువురు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తుండడంతో వ్యాపారుల రెచ్చిపోతున్నారు. అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వ్యాపారులకు అవగాహన కల్పించి ప్రజల ఆరోగ్యానికి భధ్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
రసాయన పండ్లను తినొద్దు
కాల్షియం కార్బైడ్, ఇథలీన్ లాంటి నిషేధిత రసాయనాలతో కొందరు వ్యాపారులు పండ్లను మాగపెడుతు న్నారు. అలాంటి పండ్లను తిన్న వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వీటిని తిన్న వారికి నోటిలో మంట, కడుపునొప్పి, గొంతునొప్పి మొదలవుతుంది. డయేరియా సమస్యకు గురైయ్యే ప్రమాదం ఉంది.
- డా. భానురేఖ, ఆయుర్వేద వైద్య నిపుణులు
మామిడి పండ్లను తినాలంటే భయంగా ఉంది
మామిడి పండంటే అందరికి ఇష్టమే. కానీ కొందరు వ్యాపారులు మామిడి పండ్లకు కెమికల్స్ కలుపుతున్నారు. దీంతో అవి తినాలంటేనే భయమైతుంది. తిని రోగాలు తెచ్చుకోవడం కంటే తినకుండా ఉండడం ఉత్తమమని భావించి తింటలేం. అధికారులు వెంటనే స్పందించి పండ్ల వ్యాపారులపై నిఘా పెంచాలి.
- కుసుమ రాజు, బాలానగర్
సాయనాలతో మగ్గిన పండ్లు తింటే అనారోగ్య సమస్యలు..
రసాయన పదార్థాలతో మాగబెట్టిన పండ్లు తినడం వలన ఆరోగ్య సమస్యలు ఉత్నన్నమవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కార్బయిడ్, ఇథలిన్ వంటి రసాయనాలతో మక్కించిన పండ్లను తినడం వల్ల అల్సర్, కాలేయం, గొంతునొప్పి, రక్తహీనత, కిడ్నీ, నరాల సంబందిత వ్యాధులతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు అంటున్నారు. మాగబెట్టిన పండ్లను కాకుండా సహజ సిద్దమైన పండ్లను మాత్రమే తిని ఆరోగ్యంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.
మాగిన పండ్లను గుర్తించండిలా..
మామిడి, అరటి పండ్లను మాగపెట్టడానికి వ్యాపారులు ఎక్కువగా రసాయనాలు వినియోగిస్తున్నారు. కార్బయిడ్, ఇథలిన్తో మాగబెట్టిన పండ్లను గుర్తించడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
- మాగబెట్టిన పండ్లు ఎక్కువ పసుపు వర్ణంలో ఉంటాయి. వీటిని తినేటప్పుడు నోట్లో కొంచెం మంట, కడుపులో నొప్పి, గొంతు నొప్పి మొదలవుతుంది.
- పండ్లను తిన్న తరువాత డయేరియా సమస్యకు గురైతే కాల్షియం కార్బైడ్, ఇథలీన్ వాడినట్లు గుర్తించాలి.
- సహజ సిద్ధంగా మాగిన పండ్లపై ఆకుపచ్చ మచ్చలు, పసుపు రంగు కనిపంచి కనిపించనట్లుగా ఉంటాయి. పండును కోసినప్పుడు లోప గుజ్జు ఎరుపు, పసుపురంగు కలిసినట్లు ఉంటుంది. ఈ పండ్లలో రసం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉంటే ఈ పండ్లు సహజసిద్ధమైనవి.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..
Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం
Gold Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత
Read Latest Telangana News and National News