Share News

SIT Investigation: లిక్కర్‌ స్కామ్‌లో అసలు విలన్‌ ఎవరు

ABN , Publish Date - May 19 , 2025 | 04:00 AM

లిక్కర్‌ స్కామ్‌లో కీలక నాయకులు అరెస్ట్‌ అయినా, తెర వెనకున్న అసలు సూత్రధారి ఇంకా బయటపడలేదు. సిట్‌ ఆధునిక టెక్నాలజీతో విచారణ జరుపుతోంది.

SIT Investigation: లిక్కర్‌ స్కామ్‌లో అసలు విలన్‌ ఎవరు

  • ఇప్పటిదాకా తేలింది పాత్రధారులే

  • తెరవెనుక ముఖ్య సూత్రధారి ఎవరు?

  • సొమ్ము పొందిన ఆ లబ్ధిదారు ఎవరో?

  • ముడుపుల సొమ్ము ఏమైంది?

  • ఆ దిశగా సిట్‌ అధికారుల విచారణ

  • కస్టడీలో నోరు విప్పని నిందితులు

  • ఆధునిక టెక్నాలజీ సాయంతో దర్యాప్తు

  • నిందితుల ఆస్తులు, లావాదేవీలపై ఆరా

  • కొలిక్కి రావడానికి మరికొంత సమయం?

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో సిట్‌ ఇప్పటికే పెద్ద తలకాయలను అరెస్ట్‌ చేసింది. వారిలో నాటి సీఎం జగన్‌ కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, ఐటీ సలహాదారు రాజ్‌ కసిరెడ్డి, భారతీ సిమెంట్స్‌ డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీ ఉన్నారు. ఈ కేసులో పెద్దలు ఇంకా ఎవరెవరున్నారు? తర్వాత వంతు ఎవరిది? తదుపరి ఏం జరగనున్నది?

మద్యం స్కామ్‌లో ఎంపీ మిఽథున్‌రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్‌ అధికారులు విచారించారు. అరెస్ట్‌ చేసిన వారినీ కస్టడీలోకి తీసుకుని విచారించారు. కానీ అసలు సూత్రధారి ఎవరన్నది వారు నోరు విప్పలేదు. ఈ స్కామ్‌లో తెరవెనుక ఉండి నడిపించింది ఎవరు? అసలైన విలన్‌ ఎవరు? ముడుపులు తీసుకొని అంతిమంగా లబ్ధిపొందినది ఎవరు? ఎవరి అరె్‌స్టతో ఈ కేసు కొలిక్కి వస్తుంది? అన్నది తేలాల్సి ఉంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఢిల్లీ లిక్కర్‌ కేసును తలదన్నేలా ఏపీ మద్యం కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. నాటి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సత్యప్రసాద్‌ ఇచ్చిన కీలక వాంగ్మూలం ఆధారంగా సిట్‌ అధికారులు తీగలాగారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారించిన తర్వాతే పాత్రధారుల డొంక కదిలింది. ఎవరెవరు ఏమేం చేశారో గుట్టు రట్టయింది. ఇక తేలాల్సింది ఈ స్కామ్‌ను వెనక ఉండి నడిపించిన ఆ సూపర్‌ విలన్‌ ఎవరన్నదే. రాజ్‌ కసిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డిల బృంద మే కలిసి 3,200 కోట్ల మద్యం స్కామ్‌కు పాల్పడలేరు. తెరవెనక ఓ బలమైన శక్తి ఉండి నడిపిస్తేనే వీళ్లు పాత్రధారులుగా ముందుండి లిక్కర్‌ దందా నడిపారన్నది సుస్పష్టం. కానీ వాళ్లు నోరు విప్పడానికి ససేమిరా అంటున్నారు.


తెరవెనుక ఏదో ఓ శక్తికి భయపడి నిజాలు మాట్లాడేందుకు జంకుతున్నారు. తమతో ఇన్ని అక్రమాలు చేయించింది ఎవరో పేరు చెబితే తమకు అదే చివరి రోజు అవుతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. దీంతో ఈ కేసులో అసలు లబ్ధిదారు ఎవరు? లిక్కర్‌ సొమ్మును తెగమింగిన గజదొంగ ఎవరో తెలిసేదెట్టా? అన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసు విచారణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సిట్‌ భావిస్తోంది. ఇప్పటిదాకా అరెస్ట్‌ అయిన వారిని దశలవారీగా కస్టడీలోకి తీసుకొని కీలక సమాచారం రాబట్టాలనుకుంటోంది. లిక్కర్‌ సిండికేట్‌ నుంచి వసూలు చేసిన ముడుపులను ఎటు మళ్లించారు? ఎక్కడ పెట్టుబడులు పెట్టారు? గోల్డ్‌బాండ్స్‌లో పెట్టిన పెట్టుబడులు ఏమయ్యాయి? వంటి వివరాలను తెలుసుకోనున్నట్టు సమాచారం. అలాగే దుబాయి, బెంగళూరు, న్యూఢిల్లీ, గుర్‌గావ్‌, హైదరాబాద్‌, విశాఖ, తదితర ప్రాంతాల్లో రియల్‌ పెట్టుబడుల గురించి ఆరా తీయనున్నారని తెలిసింది. ఇందుకోసం రాజ్‌ కసిరెడ్డి, ధనుంజయ్‌ రెడ్డిల ఆర్థిక లావాదేవీలన్నింటిని దర్యాప్తు అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా పలు కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నట్లు తెలిసింది.


‘ఢిల్లీ’ని మించిన స్కామ్‌

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మధ్యవర్తులు, కాంట్రాక్టర్‌లు, కమిషన్‌ ఏజెంట్లను విచారించిన మీదటే అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత కూడా అనేక అరె్‌స్టలు కొనసాగాయి. పక్కా ఆధారాలు లభించిన తర్వాతే అసలు సూత్రధారి కేజ్రీవాల్‌ అని నిర్ధారణ అయ్యాక అరెస్ట్‌ చేశారు. ఈ కేసుతో పోలిస్తే ఏపీ లిక్కర్‌ స్కామ్‌ అనేక రెట్లు పెద్దది. రూ.3,230 కోట్ల అవినీతి జరిగిందని సిట్‌ చెబుతోంది. హవాలా, మనీలాండరింగ్‌, ముడుపులు.. ఇలా సకల అవినీతితో నిండిన ఈ కేసు దర్యాప్తు ఓ కొలిక్కి రావడానికి మరికొంత సమయం పడుతుందని భావిస్తోంది. ఏపీ మద్యం కేసులో ఎంపీ మిఽథున్‌రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, నాటి సీఎం జగన్‌ ఐటీ సలహాదారుగా ఉన్న రాజ్‌కసిరెడ్డి బయటి నుంచి వ్యవహారాలు నడిపించినవారే. జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి సీఎంఓ కేంద్రంగా స్కామ్‌లో పనిచేశారన్నది అభియోగం. ఆ తర్వాత ఎవరు? స్కామ్‌ చేయడానికి తెర వెనుక నుంచి వీరిని నడిపించిందెవరు? వారు వసూలు చేసిన సొమ్ము తీసుకొని లబ్ధిపొందిన విలన్‌ ఎవరు? ఈ కేసు విచారణ ఎక్కడి వరకు వెళ్తుంది? అన్నవి తేల్చడానికి మరికొంత సమయం పడుతుందని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. రాజ్‌ కసిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, మిఽథున్‌రెడ్డి మాత్రమే కలిసి చేసిన నేరం కాదిది. వీళ్లు పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారి వేరే ఉన్నారని దర్యాప్తు అధికారులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ కేసులో ఇంకా పెద్దలు ఎవరెవరు ఉన్నారు? అసలు విలన్‌ ఎవరు? ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. ఇటు రాజకీయ రంగం, అటు సోషల్‌ మీడియాతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా జరుగుతున్న చర్చ ఇదే.


మాన్యువల్‌తో దోపిడీకి నాంది

లిక్కర్‌ స్కామ్‌లో కీలకమైన అంశాలు రెండు. ఒకటి.. కంప్యూటర్‌ ఆధారిత ఆటో జనరేటెడ్‌ ఆర్డర్‌ ఫర్‌ సప్లై(ఓఎఫ్‌ఎస్‌). రెండోది.. లిక్కర్‌ పాలసీని మార్చడం. 2014-19 కాలంలో ఓఎ్‌ఫఎస్‌ విజయవంతంగా అమలైంది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక కూడా తొలుత కొద్ది నెలలు అమలు చేశారు. కానీ లిక్కర్‌ స్కామ్‌ చేయాలంటే దీన్ని తీసేయాలని, కేవలం మనుషులు నిర్ణయించే ఆర్డర్‌ సప్లై విధానం అమలు చేయాలని బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఇది ఎవరు పడితే వాళ్లు తీసుకొనే నిర్ణయం కాదు. ప్రభుత్వ స్థాయిలో అంటే.. ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇస్తేనే అమలు చేయాల్సిన విధాన పరమైన నిర్ణయం. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేకుండానే రాజ్‌ కసిరెడ్డి చెప్పారని కార్పొరేషన్‌ ఈ నిర్ణయాన్ని అమలు చేసింది. ఈ నిర్ణయాన్ని కార్పొరేషన్‌ ద్వారా అమలు చేయించాలని ఆయనకు ఎవరు చెప్పారు? ఇదే తాజా విచారణలో తేలాల్సిన విషయం. లిక్కర్‌ స్కామ్‌కు బీజం పడింది కూడా ఇక్కడే. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్దిష్ట పద్ధతి ప్రకారం లిక్కర్‌ కంపెనీలకు పంపిణీ ఆర్డర్‌ వెళ్లేది. వాటి అమ్మకాలు, పురోగతిని పరిగణనలోకి తీసుకొని ఇండెంట్‌ ఇచ్చేవారు. కానీ మాన్యువ ల్‌ విధానంతో లిక్కర్‌ సిండికేట్‌ కిందకు వచ్చిన కొత్త బ్రాండ్లకే ఎక్కువ ఆర్డర్‌ ఇచ్చారు. దీనివల్ల పేరున్న, వినియోగదారులు ఆసక్తి చూపే బ్రాండ్ల సరఫరా తగ్గించేశారు. తర్వాత ప్రముఖ బ్రాండ్లేవి కనిపించనంతగా తొక్కేశారు. కసిరెడ్డి సిఫారసుచేసిన బ్రాండ్ల వ్యాపారం భారీగా జరిగింది. వాటినే ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా విక్రయించారు. ఇలా మాన్యువల్‌ విధానం.. దోపిడీకి నాంది పలికింది. మరి రాజ్‌ కసిరెడ్డి చెప్పగానే ఇలాంటి పాలసీని ఎలా అమలు చేశారన్నది అతిపెద్ద ప్రశ్న. ఇంకా ఎవరో తెరవెనక పెద్ద వ్యక్తి, అసలు సిసలైన విలన్‌ చెబితేనే దాన్ని అమలు చేశారు. ఆ విలన్‌ ప్రభుత్వ వ్యవస్థను శాసించే స్థాయిలో ఉండి చెబితేనే దీన్ని అమలు చేయగలరు. ఆ తెరవెనక శక్తి ఎవరో తేల్చే పనిలో సిట్‌ నిమగ్నమైంది.


జగన్‌ ప్రతిపాదనలతోనే..

మద్యం ప్రైవేటు షాపుల ద్వారా అమ్మితేనే ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. ప్రభుత్వ రిటైల్‌ దుకాణాలు(జీఆర్‌ఓ) ద్వారా విక్రయాలు వద్దని నాడు నిపుణులు సైతం సూచించారు. కానీ నాటి సీఎం జగన్‌ వినలేదు. ప్రైవేటు అమ్మకాలు జరిగిన 2014-19లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తూ, ప్రభుత్వమే ఆ వ్యాపారం చేయాలని జగన్‌ ప్రతిపాదించినట్లుగా తాజాగా విచారణలో తేలింది. లిక్కర్‌ పాలసీని ఎందుకు మార్చారు? దీని వెనక అసలేం జరిగింది? అని దర్యాప్తు సంస్థ ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తుండగా ఈ విషయం వెలుగు చూసినట్లు తెలిసింది. జగన్‌ అధ్యక్షతన జరిగిన అధికారుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆ తర్వాత పాలసీ మార్పు ఉత్తర్వులు ఇచ్చారని తెలిసింది. లిక్కర్‌ పాలసీ మార్పు అనేది మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయమని జగన్‌ చెప్పడానికి అవకాశం ఉంది. కానీ అంతకన్నా ముందు జరిగిన సమావేశంలో పాలసీని మార్చాలని జగన్‌ స్వయంగా అధికారులకు సిఫారసు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత పాలసీ మార్పును మంత్రివర్గానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ నేపఽథ్యంలో పాలసీని మార్చడంలో నాటి ముఖ్యమంత్రిదే కీలకపాత్ర అని దర్యాప్తు సంస్థ గుర్తించింది. ఈ విషయంలో కీలకమైన డాక్యుమెంట్లను తమ నియంత్రణలోకి తీసుకొని నిశిత పరిశీలన చేయాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఆరా తీసేందుకు ధనుంజయ్‌రెడ్డి, రాజ్‌ కసిరెడ్డి, మరికొందరిని కస్టడీకి తీసుకోవాలని సన్నాహకాలు చేసుకుంటున్నారు.

Updated Date - May 19 , 2025 | 05:10 AM