AP Teacher Transfer: వెబ్ కౌన్సెలింగ్ పారదర్శకం
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:40 AM
సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ) బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విధానం పారదర్శకంగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మాన్యువల్తో పోలిస్తే వెబ్ విధానంలో టీచర్లు సులభంగా పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చని, దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది.

క్లస్టర్ల వారీగా పోస్టుల ఖాళీలు
సులభంగా ఎంపికకు అవకాశం
పాఠశాల విద్యాశాఖ వివరణ
అమరావతి, జూన్ 7(ఆంధ్రజ్యోతి): సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ) బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విధానం పారదర్శకంగా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. మాన్యువల్తో పోలిస్తే వెబ్ విధానంలో టీచర్లు సులభంగా పాఠశాలలను ఎంపిక చేసుకోవచ్చని, దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొంది. వెబ్ కౌన్సెలింగ్లో ప్రయోజనాలపై శనివారం వివరణ ఇచ్చింది. 2021లో 38వేల మంది, 2023లో 44వేల మంది టీచర్ల బదిలీలు వెబ్ కౌన్సెలింగ్ ఆధారంగానే ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాతంగా పూర్తయ్యాయని వివరించింది. ఈ విధానంలో పారదర్శకతతో పాటు ఎక్కువమంది సిబ్బంది అవసరం ఉండదని వివరించింది. మాన్యువల్ కౌన్సెలింగ్లో వ్యక్తుల జోక్యానికి ఆస్కారం ఉంటుందని, వెబ్లో ఎవరూ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఈ ఏడాది 1,494 మంది గ్రేడ్-2 హెచ్ఎంలు, 5,653 మంది మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు, 28,088 మంది స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు ఎలాంటి వివాదాలు లేకుండా పూర్తయ్యాయని తెలిపింది. అలాగే 4,853 మంది టీచర్ల బదిలీలు కూడా ఆన్లైన్ విధానంలోనే చేపట్టామని విద్యాశాఖ వెల్లడించింది.
వెబ్తో ప్రయోజనాలివీ..
ప్రతి మండల కేంద్రం నుంచి పాఠశాల ఎంత దూరంలో ఉందో కిలోమీటర్లతో సహా చూపిస్తారు. దీనివల్ల టీచర్లు తక్కువ దూరంలో ఉన్న పాఠశాలలను సులభంగా చూసుకోవచ్చు. క్లస్టర్ వారీగా ఖాళీలు చూసుకోవచ్చు. ఒక్కో క్లస్టర్లో 150-200 పాఠశాలలు ఉంటాయి. దీనివల్ల వేల సంఖ్య లో ఉన్న బడుల జాబితాల్లో వెతుక్కునే భారం ఉండదు. టీచర్లు ఎంపిక చేసుకున్న పాఠశాలలను ఎన్నిసార్లయినా సేవ్ చేసుకోవచ్చు. తప్పనిసరి బదిలీల్లో ఉన్న టీచర్లు తుది నిర్ధారణ చేయాలి. రిక్వెస్ట్ బదిలీ కోరుకునేవారు ఆప్షన్లు ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. అన్ని స్థాయిల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఇంటర్నెట్ కేంద్రాలు, ఇతర టీచర్లపై ఆధారపడే పరిస్థితి ఉండదు.
మాన్యువల్ కౌన్సెలింగ్తో నష్టాలు
మాన్యువల్ విధానంలో అన్ని ఖాళీలు కనిపించకపోవచ్చు. దీనివల్ల అర్హులైన సీనియర్ టీచర్లకు అన్యాయం జరుగుతుంది. ప్రస్తుత బదిలీల్లో 16,029 మంది ఎస్జీటీలు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. మాన్యువల్ కౌన్సెలింగ్లో దాదాపు 38శాతం కొత్తగా ఏర్పడే ఖాళీలు వెంటనే కనిపించవు. దీనివల్ల ఎక్కువ పాయింట్లు ఉన్న టీచర్లు కూడా కొంతమేర అవకాశం కోల్పోతారు. ఇప్పుడు మాన్యువల్ కౌన్సెలింగ్ చేపడితే బడులు పునఃప్రారంభమయ్యే నాటికి బదిలీలు పూర్తికావు. రోజుకు 400 నుంచి 500 మంది టీచర్లకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించగలరు. టీచర్లు తమ వంతు వచ్చే వరకు కౌన్సెలింగ్ కేంద్రాల్లో గంటల తరబడి వేచిచూడాలి.
నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ఎస్జీటీల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ విధానంపై నిరసనలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా డీఈవో కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపింది. మాన్యువల్ విధానంలోనే ఎస్జీటీలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. కాగా, ఎస్జీటీల బదిలీలు మాన్యువల్ కౌన్సెలింగే నిర్వహించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ కోరారు.