Dalit Tribal Loan Scam: కుబేరా సినిమా తరహాలో ఏపీలో భారీ స్కాం
ABN , Publish Date - Jul 20 , 2025 | 02:08 PM
నెల్లూరు జిల్లాలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని కుబేరా సినిమా తరహాలో ఘరానా మోసానికి కొంతమంది వ్యక్తులు పాల్పడ్డారు.

నెల్లూరు: బిక్షగాళ్లని విదేశాలకు తీసుకెళ్లి పెద్దపెద్ద కంపెనీల యజమానులుగా మార్చేసి, వారి అకౌంట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలని బదిలీ చేయడం.. ఇది కుబేర సినిమా స్టోరీ(Kubera Movie). ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే నెల్లూరు జిల్లాలో కూడా అటు ఇటుగా ఇలాంటి ఘరానా మోసమే జరిగింది. నెల్లూరు జిల్లాలో(Nellore District) భారీ కుంభకోణం (Huge Scam) వెలుగు చూసింది. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని భారీ స్కాంకు పాల్పడ్డారు కొంతమంది మోసగాళ్లు. కుబేరా సినిమా తరహాలో రూ.15కోట్ల నుంచి రూ.20కోట్ల మేర అమాయకులకి టోకరా వేశారు. తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇటీవల ఈ కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. నిరుపేదలని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చూపి రుణాలు తీసుకుంది ఈ మాఫియా.
రుణాలు చెల్లించాల్సిందిగా బ్యాంకుల నుంచి పేదలకి నోటీసులు రావడంతో ఈ భాగోతం బయటపడింది. ఈ మాఫియాలో జాలే వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ కీలకంగా వ్యవహరించారు. ఈ మాఫియా కాజేసిన సొమ్ముతో సినిమాలు చిత్రీకరించారు. గతంలోనూ జర్నలిస్టు యూనియన్ పేరుతోనూ భారీ మొత్తాలు వసూలు చేశాడు జాలే వాసుదేవనాయుడు. ఏడు నెలల క్రితం నెల్లూరు పోలీసులకి ఫిర్యాదులు చేసి గోప్యంగా ఉంచారు బ్యాంకు అధికారులు. 2021 నుంచి 2024 మధ్య భారీఎత్తున మోసాలు జరిగినట్లు తెలుస్తోంది. సీబీఐతో విచారణ జరిపించాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తక్కువ ఖర్చుతోనే గ్రీన్ హైడ్రోజన్
జగన్ మెక్కిన సొమ్మంతా కక్కిస్తాం
Read latest AP News And Telugu News