CM Chandrababu: పొట్టి శ్రీరాములు జయంతి వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 16 , 2025 | 01:02 PM
CM Chandrababu: తెలుగువారి చరిత్ర ఉన్నంతవరకు పొట్టి శ్రీరాములు గుర్తుంటారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లాకు ఆయన పేరును కూడా తమ ప్రభుత్వంలోనే పెట్టామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

అమరావతి: పొట్టి శ్రీరాములు స్వగ్రామాన్ని అభివృద్ది చేస్తాం... ఆయన నివాసం ఉన్న ఇంటిని ప్రభుత్వమే కొని.. మ్యూజియంగా అభివృద్ధి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇవాళ(ఆదివారం) ఉండవల్లిలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం జరిగింది. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాల వేసి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు.పొట్టి శ్రీరాములు 120వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.
పొట్టి శ్రీరాములు త్యాగాలు తెలిసేలా..
మొన్నే ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున చేసుకున్నామని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. కర్నూలుతో ప్రారంభమైన తెలుగు రాష్ట్రం.. పెద్ద మనుషుల ఒప్పందంతో కలిశారని తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ను రాజధానిగా మార్చగా.. 11ఏళ్ల క్రితం జూన్ 2వ తేదీన మళ్లీ ఏపీ విభజన జరిగిందని గుర్తుచేశారు. ఏపీ ఏర్పాటుకు చాలా తేదీలు వచ్చినా.. డిసెంబర్ 15వ తేదీన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేసిన రోజు కాబట్టి.. ఆరోజునే పొట్టి శ్రీరాములను మనం స్మరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగాలను నేటి తరానికి తెలియ చెప్పేలా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జనం కోసం, తెలుగు జాతి కోసం బతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
ALSO READ: AP News: టీడీపీ తరపున ఏజెంట్గా కూర్చుంటే హత్యలు చేస్తారా..: కనపర్తి శ్రీనివాసరావు
నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు..
‘నెల్లూరు జిల్లాకు ఆయన పేరు కూడా మేమే పెట్టాం. ఆయన త్యాగానికి స్పూర్తిగా రాజధాని అమరావతిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తాం. ఏడాది లోపు పార్కు కూడా ఒకటి నిర్మాణం చేసి ప్రారంభిస్తాం. ఎంతోమంది పుట్టినా.. కొందరే చరిత్రలో మిగిలిపోతారు.. తెలుగువారి చరిత్ర ఉన్నంతవరకు పొట్టి శ్రీరాములు గుర్తుంటారు. ఆయన కృషి వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. తెలుగు భాష మాట్లాడేవారికి ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను ఈ ఏడాది మొత్తం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఏడాది పాటు చేసిన తర్వాత వచ్చే మార్చికి ముగింపు సభ పెడతాం’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
పొట్టి శ్రీరాములు కఠోర దీక్ష..
‘ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. బతికున్నప్పుడు సాధించలేనిది.. ఆయన చనిపోయి సాధించిందే.. మన తెలుగు రాష్ట్రం. పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచేవరకు అప్పుడు ఉన్న తెలుగు ప్రజలు కూడా పెద్ద ఆందోళన చేయలేదు. ఆయన చనిపోయిన తర్వాతే ప్రజల్లో ఆగ్రహం పెలుబికింది.. అందరూ బయటకు వచ్చారు. వారి ఉద్యమాన్ని చూసి నెహ్రూ వంటి వారు భయపడి పార్లమెంట్లో తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ప్రకటించారు.1953 మార్చిలో ఆంధ్రరాష్ట్రం ఏర్పడగా, అక్టోబర్ 1వ తేదీన స్వయం పాలన వచ్చింది. తెలంగాణలో కలిసిన తర్వాత కొన్నేళ్ల క్రితం మళ్లీ రాష్ట్రం విడిపోయింది. 2047లోగా దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో ఉంచుతాం. పీ3 స్పూర్తితో పేదరికాన్ని నిర్మూలిద్దాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..
Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్పై మంత్రి రామానాయుడు ఫైర్
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం
For More AP News and Telugu News