Share News

Massive Theft: కర్నూలు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారంటే..

ABN , Publish Date - Jun 13 , 2025 | 11:21 AM

కర్నూలు జిల్లాలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లల్లో దోపిడీ చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. అందిన కాడికి దోచుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో భారీ చోరీ జరిగింది.

Massive Theft: కర్నూలు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారంటే..
Massive Theft in Kurnool District

కర్నూలు: జిల్లాలో దొంగలు (Thieves) మరోసారి రెచ్చిపోయారు. తాళం వేసిన ఇళ్లల్లో దోపిడీ చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. అందిన కాడికి దోచుకుని ఉడాయిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని (Kurnool District) తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో భారీ చోరీ జరిగింది. వజ్రాల వ్యాపారస్తుడు పార్థసారథి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 30 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ. 5 లక్షల నగదు అపహరించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రాల వ్యాపారస్తుడు పార్థసారథి తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లాడు. దర్శనం పూర్తి అయిన తర్వాత తన ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడేసి ఉన్నాయి. అనుమానం వచ్చి ఇంట్లోని బీరువాను పరిశీలించాడు. బీరువా తలుపులు పగులగొట్టి అందులో ఉన్న విలువైన 30 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ. 5 లక్షల నగదు మాయం అయ్యాయి. దీంతో వెంటనే పోలీసులకు వజ్రాల వ్యాపారస్తుడు పార్థసారథి ఫిర్యాదు చేశాడు.


పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలు ఎంతో వ్యూహాత్మకంగా ఈ చోరీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని దొంగలు అంచనా వేసి ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. రోజురోజుకూ దొంగతనాలు పెరిగిపోతున్నప్పటికీ, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ చోరీకి ముందు కూడా తుగ్గలి మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో దొంగతనాలు జరిగాయి.


కానీ ఇప్పటివరకు ఆ కేసుల్లో దొంగలు ఎవరూ దొరకలేదు. జొన్నగిరిలో ఇప్పడు జరిగిన చోరీ కూడా ఆ ముఠానే చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పాత దొంగతనం కేసులను పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు. గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తాళంవేసి బయటకు వెళ్తే సీసీ కెమెరాలు, అలారం లాంటి భద్రతా పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే గ్రామాల్లో పోలీసులు గస్తీ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇద్దరి ప్రాణం తీసిన విష వాయువు

జూలై 15 నుంచి లెక్చరర్‌ పోస్టులకు పరీక్షలు

Read latest AP News And Telugu News

Updated Date - Jun 13 , 2025 | 11:31 AM