Forest Department: కుంకీలొస్తున్నాయ్
ABN , Publish Date - May 20 , 2025 | 03:46 AM
చిత్తూరు జిల్లాలో అడవి ఏనుగుల దాడులను నియంత్రించేందుకు కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రాబోతున్నాయి. ఇవి పలమనేరులో ఏర్పాటు చేసిన 50 ఎకరాల ఎలిఫెంట్ క్యాంపులో శిక్షణతో కూడిన చర్యలకు ఉపయోగపడతాయి.

రేపు కర్ణాటక నుంచి రాష్ట్రానికి
సిద్దరామయ్య, పవన్ సమక్షంలో ఆరు అప్పగింత
చిత్తూరు జిల్లా పలమనేరులో ఎలిఫెంట్ క్యాంపు
50 ఎకరాల్లో ఏనుగుల కోసం సౌకర్యాలు
రాష్ట్రంలో ఎక్కడ గజరాజులు దాడిచేసినా ఈ కుంకీలతోనే పరిష్కారం
గత ఆగస్టులోనే కర్ణాటకతో ఒప్పందం
(చిత్తూరు-ఆంధ్రజ్యోతి)
పంట పొలాలపై దాడి చేసే ఏనుగులను తరిమికొట్టడానికి కుంకీ ఏనుగులు రాష్ట్రానికి వస్తున్నాయి. బుధవారం కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగుల్ని చిత్తూరు జిల్లాకు తీసుకురానున్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో వాటిని అప్పగించనున్నారు. కర్ణాటక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది ఆగస్టులో కుంకీ ఏనుగులు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరడం, ఆ రాష్ట్రం అంగీకరించడం తెలిసిందే. అప్పట్లో కర్ణాటక ప్రభుత్వంతో పవన్ కల్యాణ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఆరు కుంకీ ఏనుగుల్ని రాష్ట్రానికి కేటాయించారు. బుధవారం సాయంత్రాని కి పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు చేరుకుంటా యి. 22న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 4 కుంకీలను పలమనేరులోని క్యాంపునకు, 2 తిరుపతిలోని జూ పార్కుకు కేటాయిస్తారు.
50 ఎకరాల్లో ఎలిఫెంట్ క్యాంపు
కుంకీ ఏనుగుల కోసం చిత్తూరు జిల్లాలోని పలమనేరు సమీపంలో ముసళ్లమడుగు ఎలిఫెంట్ క్యాంపును సిద్ధం చేశారు. ఈ క్యాంపు కోసం 50 ఎకరాల్ని కేటాయించగా.. ప్రస్తుతం 20 ఎకరాల్ని వాడుకున్నారు. ఇక్కడ 4 కుంకీ ఏనుగులకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలిఫెంట్ బాత్, వాటర్ టబ్, షెడ్లు, కిచెన్, మావిటి క్వార్టర్స్, రోడ్లు, విద్యుత్, సోలార్, సహజ నీళ్ల కుంట, వాటర్ ట్యాంకు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఏనుగుల ఆరోగ్యం కోసం పశువుల ఆస్పత్రి, వైద్యుల కోసం ప్రతిపాదన పెట్టారు. మావిటీలు ఒకరు కేరళ, మరొకరు తమిళనాడుకు చెందినవారు ఉండగా, ఆరుగురు స్థానిక మావిటీలున్నారు. వారందరికీ క్వార్టర్స్ను కూడా నిర్మించారు. కర్ణాటక నుంచి కుంకీలు వచ్చాక వాటి ని ఈ ప్రాంతానికి అలవాటు పడేలా చేసేందుకు కర్ణాటక నుంచి ఇద్దరు మావిటీలు వచ్చి నెల రోజు లు ఉంటారు. కాగా, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని ననియాలలో రెండు కుంకీ ఏనుగులు ఏళ్లుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇదే తొలి కుంకీ ఏనుగుల కేంద్రంగా ఉండేది. కానీ ఆ రెండు ఏనుగుల వయసు 60 ఏళ్లు దాటడంతో అవి అడవి ఏనుగుల్ని తరమడంలో ఉపయోగపడడం లేదు.
కుంకీలు ఎందుకంటే..
పంట పొలాలపై అడవి పందులు, నక్కలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులు దాడి చేస్తుంటాయి. వాటిని రైతులు తరిమికొడుతుంటారు. అయితే ఏనుగుల గుంపు అందుకు భిన్నం. గజరాజుల గుంపు దండెత్తిందంటే.. గ్రామాలు హడలిపోతాయి. ఏనుగు లు విరుచుకుపడి పంటల్ని నాశనం చేస్తుంటాయి. మనుషుల్ని తొక్కి చంపేస్తుంటాయి. ఈ పరిస్థితి ముఖ్యంగా చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మ న్యం జిల్లాల్లో అధికంగా ఉంది. అలాంటి గజరాజుల్ని కూడా కుంకీ ఏనుగులు వణికిస్తాయి. కర్ణాటక నుం చి వాటిని మన రాష్ట్రానికి తీసుకురావడానికి డిప్యూ టీ సీఎం పవన్ కృషి చేశారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి కూడా కుంకీ ఏనుగులు కేటాయించాలని పలుమార్లు అసెంబ్లీలో మాట్లాడారు. చిత్తూ రు జిల్లాలో అడవి ఏనుగులతో ప్రాణ, పంట నష్టా లు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఏడాదికి కనీ సం ఇద్దరు ప్రాణాలు వదులుతున్నారు. ఏటా 5వేల హెక్టార్లలో పంట నష్టం జరుగుతోంది. ప్రతి రోజూ జిల్లాలోని ఏదో ఓ ప్రాంతంలో పంటల్ని నాశనం చేస్తూనే ఉన్నాయి.
కుంకీల ప్రత్యేకత ఇదీ
కుంకీలు పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన ఏనుగులు. సాధారణ ఏనుగుల్నే కుంకీలుగా ఎంపిక చేసి కొన్ని నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఎక్కడైనా ఏనుగుల గుంపు దాడికి దిగినప్పుడు కుంకీలను రంగంలోకి దింపుతారు. ఏనుగుల్ని తరిమికొట్టడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. ఏనుగుల గుంపును అడవిలోకి తిరిగి పంపించేంత వరకు విశ్రమించవు.