Kolikapudi Srinivasa Rao: పోలీసులు గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారు.. కొలికపూడి ఫైర్
ABN , Publish Date - Jul 23 , 2025 | 09:27 AM
తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ ఒక బ్యాచ్నీ పెట్టుకొని గంజాయి అమ్మే, కొనే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. తిరువూరు స్టేషన్లో ఎస్ఐ ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లు చేస్తున్నాడని పూర్తి ఆధారాలు తాను చూపిస్తానని ఎమ్మెల్యే కొలికపూడి చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ ఒక బ్యాచ్నీ పెట్టుకొని గంజాయి అమ్మే, కొనే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (MLA Kolikapudi Srinivasa Rao) ఆరోపణలు చేశారు. తిరువూరు స్టేషన్లో ఎస్ఐ ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లకి పాల్పడుతున్నాడని పూర్తి ఆధారాలు తాను చూపిస్తానని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఎస్ఐ సత్యనారాయణ ఒక వ్యక్తినీ గంజాయి అమ్ముతున్నాడని స్టేషన్కి పిలిపించారని.. మరో వ్యక్తి ద్వారా డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. ఎస్ఐకి బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు బంగారం తాకట్టు పెట్టి లక్షన్నర డబ్బులు ఎస్ఐ సత్యనారాయణకి ఇచ్చారని తెలిపారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.
అసలు ఏమైందంటే..
కాగా, ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. అయితే ఈ గొడవలో చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తపై దాడికి అదే పార్టీకి చెందిన కందిమల్ల సాయి సుమిత్ , పానుగంటి వెంకట్, మరో నలుగురు వ్యక్తులు దాడికి యత్నించారు. తనపై దాడి నుంచి తప్పించుకునే యత్నంలో సాయి సుమిత్పై సీసాతో టీడీపీ కార్యకర్త చల్లపల్లి రామకృష్ణ గాయపరిచాడు. సాయి సుమిత్ ఫిర్యాదు మేరకు రామకృష్ణపై 307 కేసు నమోదు చేశారు తిరువూరు పోలీసులు. రామకృష్ణ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆయన తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మిలను స్టేషన్కు తీసుకువచ్చారు పోలీసులు. నిన్న(మంగళవారం) రాత్రి 10 గంటలు దాటిన తర్వాత కూడా రామకృష్ణ తల్లి, సోదరుడిని స్టేషన్లోనే ఉంచారు. ఈ విషయంలో పోలీస్లపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రామకృష్ణ ఇంటిపై దాడికి వచ్చిన సాయి సుమిత్పై కేసు ఎందుకు నమోదు చేయలేదని పోలీస్లని ఎమ్మెల్యే కొలికపూడి ప్రశ్నించారు. దాడికి యత్నించిన వారిని విడిచిపెట్టి ఆత్మరక్షణ కోసం దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టడం అమానుషమని అన్నారు. దాడి జరిగితే కేసులు నమోదు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ సాయిసుమిత్ వెనుక కొందరు ఉండి ఎస్ఐ కేవీజీవీ సత్యనారాయణపై ఒత్తిడి తెచ్చి అన్యాయంగా అక్రమ కేసులు బనాయించడం దారుణమని మండిపడ్డారు. తిరువూరు పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని. ఇది సరైన విధానం కాదని ఎమ్మెల్యే కొలికపూడి చెప్పుకొచ్చారు. గంజాయి విక్రయించాలంటూ తమ కుమారుడిని ప్రోత్సహిస్తూనే అక్రమ కేసుల్లో బనాయించారని ఎమ్మెల్యే ముందు ఓ బాధితుడు తండ్రి వాపోయాడు. రామకృష్ణపై దాడి చేసిన వారిని స్టేషన్కి పిలిపించాలని అంతవరకు కదిలేది లేదని స్టేషన్లోనే కూర్చుంటానని ఎమ్మెల్యే కొలికపూడి హెచ్చరించారు. గత నెల రోజుల క్రితం ఇదే రామకృష్ణపై గంజాయి బ్యాచ్ దాడి చేస్తే ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మోహన్బాబు కేసులో తీర్పు రిజర్వ్
టీటీడీలో అన్యమత ఉద్యోగుల లెక్క తేలుస్తాం
Read latest AP News And Telugu News