Buddha Venkanna: విషపురుగు.. అందుకే దూరం పెట్టిన చంద్రబాబు
ABN , Publish Date - May 11 , 2025 | 06:36 PM
Buddha Venkanna: గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహరంలో వైఎస్ జగన్ను తప్పించే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. ఈ కుంభకోణంతో వైఎస్ జగన్కు సంబంధం లేదంటే పదేళ్ల పిల్లోడు సైతం నమ్మడని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

విజయవాడ, మే 11: జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని చేస్తున్న ఆరోపణలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో బుద్దా వెంకన్న విలేకర్లతో మాట్లాడుతూ.. కేశినేని నాని వంటి విషపురుగు పార్టీలో ఉండకూడదనే సీఎం నారా చంద్రబాబు నాయుడు దూరం పెట్టారన్నారు. కేశినేని నాని వంటి వారికి సీఎం చంద్రబాబు రాజకీయ భిక్ష పెట్టారని గుర్తు చేశారు. అతనికి ఆ విశ్వాసం లేకుండా చంద్రబాబుపైనే విమర్శలు చేశారని తెలిపారు.
టీడీపీ ఎంపీగా ఉంటూనే.. వైఎస్ జగన్కు కోవర్టుగా పని చేసిన వ్యక్తి కేశినేని నాని అని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ మాఫియాపై సిట్ విచారణ చేపట్టిందని.. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూత్రధారిగా మొత్తం వ్యవహారం నడిచిందని సిట్ నిర్ధారించిందని ఆయన గుర్తు చేశారు. దీంతో ఈ కేసు వైఎస్ జగన్ మెడకు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కొత్త నాటకాలు ప్రారంభించాడంటూ వైఎస్ జగన్పై బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. కేశినేని నానీని అడ్డం పెట్టుకుని.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఈడీకి ఫిర్యాదు చేసినట్లు హడావుడి చేశారన్నారు. మద్యం కుంభకోణంతో కేశినేని చిన్నీకి సంబంధం లేకపోయినా ఉద్దేశ పూర్వకంగా అతని పేరును తెస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలో పెద్ద హోటల్ నిర్మించాలని బ్యాంకుల నుంచి రూ. ఎనిమిదిన్నర కోట్లు కేశినేని నానితోపాటు అతని భార్య అప్పు తీసుకున్నారన్నారు. కేశినేని హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఉన్న రికార్డులు కూడా తాను చూపిస్తామని తెలిపారు. ఈ సంస్థకు డైరెక్టర్లుగా కేశినేని నాని, పావని,హేమా చౌదరి ఉన్నారని వివరించారు. అయితే నాని కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా తప్పుకుని అతని వద్ద పని చేసే రాము,హేమంత్లను డైరెక్టర్లుగా చేశారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదాహరణగా వివరించారు.
ఇప్పుడు ఆ హోటల్స్ మీద వచ్చే ఆదాయాన్ని కేశినేని నాని తింటున్నాడన్నారు. బ్యాంకుకు తీసుకున్న అప్పు మాత్రం చెల్లించకుండా తప్పుకుంటున్నాంటూ కేశినేని నానిపై మండిపడ్డారు. నాని కుటుంబ సభ్యులు బయటకు వెళ్లి.. జీతగాళ్లను డైరెక్టర్లుగా ఎందుకు చేశారో చెప్పాలంటూ ఈ సందర్భంగా కేశినేని నానిని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ను మద్యం కేసు నుంచి బయట పడేయాలనే కేశినేని నాని ఈ విధంగా అబద్దాలను చెబుతున్నారని విమర్శించారు.
ప్రస్తుతం లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతున్న కేశినేని నాని 2019-24 మధ్య ఎందుకు నోరు విప్పలేదంటూ మండిపడ్డారు. కేశినేని నానీ అనే వాడు టీడీపీలో ఉంటూ తనను అనేక ఇబ్బందులు పెట్టాడన్నారు. కానీ సీఎం చంద్రబాబు మాత్రం తనపై నమ్మకంతో.. తనకు అండగా నిలిచారన్నారు. నేడు సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా బురద జల్లడం వైసీపీకి సహజంగా మారిందన్నారు.
లిక్కర్ స్కాంలో కసిరెడ్డి, కేశినేని చిన్నికి సంబందం ఉందని ఈడీకి ఇచ్చిన లేఖలో కేశినేని నాని రాశారని గుర్తు చేశారు. మరి ఈ వ్యవహారం నడిపిన జగన్ పేరు ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. జగన్కు తెలియకుండా లిక్కర్ స్కాం జరిగిందంటే పదేళ్ల పిల్లాడు కూడా నమ్మడన్నారు.
కేవలం టీడీపీ పరువు తీయడమే లక్ష్యంగా కేశినేని నాని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ వెనక ఉండి..కేశినేని నానీతో నాటకాలు ఆడిస్తున్నారని అర్థమవుతుందన్నారు. మనిషి పుట్టక పుట్టి.. ఎటువంటి ఎఫెక్షన్స్, ఎమోషన్స్ లేని వ్యక్తి కేశినేని నాని అని ఆయన అభివర్ణించారు. దొంగ డాక్యుమెంట్లు, దొంగ అగ్రిమెంట్లు చేసుకుని బ్యాంకులనే మోసం చేసిన చరిత్ర కేశినేని నానీదని ఆయన పేర్కొన్నారు.
ఈడీ, సీబీఐకి కేశినేని నానీ అవినీతి గురించి లేఖలు రాసి.. ఆధారాలతో సహా అందిస్తానని స్పష్టం చేశారు. కేశినేని నానీ అనే వాడు 1 నుంచి 10 వరకు పెద్ద ఛీటర్ అని ఆయన అభివర్ణించారు. నేను అన్నీ ఆధారాలతోనే నేడు మాట్లాడుతున్నానని.. అందుకే దమ్ముతో చెబుతున్నానన్నారు. నీకు దమ్ముంటే.. ఆధారాలతో సహా బయట పెట్టి మాట్లాడాలంటూ కేశినేని నానీని ఈ సందర్భంగా బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: మరికొద్ది గంటల్లో హాట్ లైన్ చర్చలు.. రంగం సిద్ధం..
Operation Sindoor: పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన
Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్నాథ్ సింగ్
For Andhrapradesh news and Telugu News