GV Reddyః ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం
ABN , Publish Date - Jan 23 , 2025 | 07:07 PM
GV Reddyః ఏపీఎస్ ఎఫ్ఎల్ ప్లాన్లను రివైజ్ చేస్తామని ఏపీఎస్ ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వీలైనంత తక్కువ ధరకు ఫైబర్ నెట్ను ప్రజలకు అందిస్తామని అన్నారు..

విజయవాడ: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్నీ పెట్టుబడులు వస్తున్నాయని ఏపీఎస్ ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి ఉద్ఘాటించారు. తండ్రి సీఎం అయినప్పటికీ మంత్రి నారా లోకేష్ సొంత కాళ్లపై నిలబడి ఎదిగారని తెలిపారు. విద్యా మంత్రిగా ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని చెప్పారు. ఏపీఎస్ ఎఫ్ఎల్కు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. సిస్కో, సహా పలు సంస్థలు ఫైబర్ నెట్లో పెట్టుబడులు పెట్టేందుకు మందుకు వచ్చాయని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఫైబర్ నెట్లో ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా , అక్రమంగా నియమించారని ఆరోపించారు. ఏపీఎస్ ఎఫ్ఎల్లో మరో 200 మందిని ఉద్యోగులను తొలగించామని చెప్పారు.
ఇప్పటి వరకు తొలగించిన ఉద్యోగుల సంఖ్య 600 కు చేరిందని అన్నారు. పారదర్శక విధానంలో ఉద్యోగాల నియామకాలు చేస్తామని స్పష్టం చేశారు. జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి సమర్థత, అర్హత ఉన్నవారికే ఉద్యోగాలిస్తామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో కొందరు కేబుల్ ఆపరేటర్లపై రూ.100 కోట్లు పెనాల్టీలు వేశారని అన్నారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా రూ. 100 కోట్ల పెనాల్టీలను మాఫీ చేస్తున్నామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో వినియోగదారులకు రెంటల్ పేరిట బాక్స్లు ఇచ్చారని అన్నారు. ప్రతి నెల ప్రతి కనెక్షన్కు రూ.59ల చొప్పున అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. లోకేష్ జన్మదినం సందర్భంగా రెంటల్స్ వసూలు మొత్తాన్ని రద్దు చేస్తున్నామని అన్నారు.
బాధ్యులపై చర్యలు..
‘‘జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. మేము రాజకీయం కోసం అడ్డగోలు ఆరోపణలు చేయం. ఆధారాలతోనే అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. వైసీపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ను రూ. 900 కోట్ల నష్టాలు మిగిల్చి రూ.1260 కోట్లు అప్పుల పాల్జేసిందని ఆరోపించారు. ఏపీఎస్ ఎఫ్ఎల్ను అభివృద్ధి చేసేందుకు రూ.2500కోట్లు పెట్టుబడులు కావాలి .. నిధుల సమీకరణ చేస్తున్నాం. ఏపీఎస్ ఎఫ్ఎల్కు సెట్ టాప్ బాక్సులు సరఫరా చేసేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలి. పూర్తిగా పారదర్శకంగా విచారణ జరుపుతున్నాం. ఏపీఎస్ ఎఫ్ఎల్ ప్లాన్లను రివైజ్ చేస్తాం. వీలైనంత తక్కువ ధరకు ఫైబర్ నెట్ను ప్రజలకు అందిస్తాం . పేదల కోసం బేసిక్ ప్యాకేజీని తక్కువ ధరకు అందిస్తాం. ప్రైవేటు వారితో పోల్చితే సగం ధరలకే నాణ్యమైన సేవలను అందించేందుకు మేం సిద్ధం. ప్రైవేటు ఆపరేటర్ల కంటే తక్కువ ధరకే ఇంటర్నెట్తో కూడిన కేబుల్ సేవలు అందిస్తాం. తిరుమల కొండపై ఉన్న అన్ని కార్యాలయాలు, దుకాణాలు, ఇళ్లకు ఉచితంగా ఏపీ ఎస్ఎఫ్ ఎల్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం’’ అని ఏపీఎస్ ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు.