YS Jagan: తెనాలిలో వైఎస్ జగన్ పర్యటనపై నిరసనలు
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:14 PM
గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి నిరసనల సెగ తగిలింది. జగన్కు అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ దళిత, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి

గుంటూరు: గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jaganmohan Reddy) ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన కోసం స్థానిక కేడర్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే జగన్కు మాత్రం నిరసనల రూపంలో ఊహించని షాక్ తగిలింది. జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. తెనాలి మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్ను జగన్ పరామర్శించలేదని... రౌడీషీటర్లకు మద్దతుగా నిలవడం దారుణమంటూ దళిత, ప్రజాసంఘాలు నినాదాలు చేశాయి. తెనాలిలో జగన్కు నిరసనల సెగ తగలడంతో వైసీపీ నేతలు డైలామాలో పడ్డారు.
అలాగే ఐతానగర్ సెంటర్లో జగన్ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జగన్ గో బ్యాక్ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. తెనాలిలో ఎర్ర బడి వద్ద జగన్ కాన్వాయ్ను ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. దళితులపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా అంటూ నిరసన వ్యక్తం చేశారు. హత్యలు చేసిన వారిని, రౌడీషీట్లు ఉన్నవారిని, పోలీసులను కొట్టిన వారిని జగన్మోహన్రెడ్డి ఎలా పరామర్శిస్తారని ఎమ్మార్పీఎస్ నేతలు నిలదీశారు. నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. అయితే రోడ్డు మీదకు వస్తున్న దళిత సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. తెనాలిలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో తెనాలిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెద్దిరెడ్డి పిటిషన్పై కౌంటర్ వేయండి
For More AP News and Telugu News