Share News

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కీలక చర్చ

ABN , Publish Date - Mar 17 , 2025 | 03:56 PM

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ..  ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కీలక చర్చ
AP Cabinet Meeting

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో ఇవాళ(సోమవారం) ప్రత్యేక కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులపై చర్చ జరుగుతోంది. మొత్తం 20 అంశాల అజెండాగా ఈ సమావేశంలో మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. SIPBలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు కేబినెట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నివేదికపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వైఎస్సార్ తాడిగడప పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీ టీచర్స్ ట్రాన్స్‌ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.


సీఆర్డీఏ ఆధారిటీలో అమోదించిన 37,702 కోట్ల టెండర్లకు గానూ ప‌నులు చేప‌ట్టేందుకు కేబినెట్ అమోదం తెల‌ప‌నుంది. కేబినెట్ అమోదంతో టెండ‌ర్లు ద‌క్కించుకున్న సంస్థ‌ల‌కు సీఆర్డీఏ లెట‌ర్ ఆఫ్ అగ్రిమెంట్లను ప్రభుత్వం జారీ చేయ‌నుంది. ప్రస్తుతం సీఆర్డీఏ చేపట్టనున్న రూ.22,607 కోట్ల విలువైన 22 పనులకు సంబంధించి కేబినెట్ ఈ సమావేశంలో ఆమోదం తెల‌ప‌నుంది. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ.15081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రిమండలి ఆమోదించనుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయిoపులకు అమోదం తెలిపే అవకాశం ఉంది. 4వ ఎస్ఐపీబీ మీటింగ్ అమోదం తెలిపిన అంశాలపై కేబినెట్లో చర్చ అనంతరం వాటికి అమోదం తెలపనుంది. 10 సంస్థల ద్వారా వచ్చే రూ. 1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెల‌ప‌నుంది. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట - రూ.1,742 కోట్ల పెట్టుబడులకు అమోదం తెల‌ప‌నుంది.


దాల్మియా సిమెంట్ సంస్థ‌ కడప జిల్లాలో రూ.2,883 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ‌ విశాఖపట్నం న‌గ‌రంలో రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్వెష‌న్ సెంట‌ర్ ఏర్పాటుకు అమోదించనుంది. సత్యవీడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ శ్రీసిటీలో, రూ. 25,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.58,469 కోట్ల పెట్టుబడులకు అమోదించనుంది. బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.1,175 కోట్లు పెట్టుబ‌డుల‌కు అమోదం తెల‌ప‌నుంది. ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్ కంపెనీ అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో రూ.22,000 కోట్ల పెట్టుబడులకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.


ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అన్నమయ్య, కడప జిల్లాల్లో రూ.8,240 కోట్లు పెట్టుబ‌డుల‌కు కేబినెట్‌ అమోదం తెల‌ప‌నుంది. మేఫెయిర్ బీచ్ రిసార్ట్స్, కన్వెన్షన్ సంస్థ రూ. 400 కోట్ల పెట్టుబడులకు అమోదించనుంది. ఒబేరేయ్ విలాస్ రిసార్ట్ రూ. 250 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ పెట్టుబడుల ద్వారా 80 వేల మందికి ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు... ముందుగా 26 జిల్లాల్లో ఏర్పాటుకు కేబినెట్‌ అమోదించనుంది . నెల రోజుల్లో రాష్ట్రంలో ఐదు చోట్ల 5 రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసేలా మంత్రి మండలి నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న ప‌లు బిల్లుల‌కు కేబినెట్ అమోదం తెల‌ప‌నుంది. ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన సవరణ బిల్లుకు కూడా కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

TTD decision: వారికి గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ.. ఇకపై

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

Cooperative banks corruption: సహకార బ్యాంకుల్లో అవినీతిపై అచ్చెన్న సమాధానం ఇదీ..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 17 , 2025 | 05:15 PM