Share News

Nellore Quartz scam: క్వార్ట్జ్‌ కేసులో కాకాణి అరెస్టు

ABN , Publish Date - May 26 , 2025 | 03:32 AM

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాణిని బెంగళూరు శివార్లలో పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయనపై ఎస్టీల బెదిరింపులు, ఫోర్జరీ కేసులు కూడా ఉన్నట్లు తెలిసింది.

Nellore Quartz scam: క్వార్ట్జ్‌ కేసులో కాకాణి అరెస్టు

  • బెంగళూరు శివార్లలో పట్టివేత!

  • 2 నెలలుగా పరారీలో మాజీ మంత్రి

  • క్వార్ట్జ్‌ అక్రమ రవాణాతోపాటు ఎస్టీలను బెదిరించిన కేసులోనూ నిందితుడు

  • ముందస్తు బెయిల్‌ కోసం శతవిధాలా యత్నం.. సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు

  • ఆయన కోసం 4 రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు.. లుక్‌ అవుట్‌ నోటీసు కూడా జారీ

  • నెల్లూరుకు తరలింపు.. నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం

నెల్లూరు, మే 25 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్‌లో అక్రమంగా కార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరక్కుండా రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను ఆదివారం బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు. ఆయన కోసం నెల్లూరు జిల్లా పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో గాలించారు. విమానాశ్రయాలకు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలించాయి. ఎట్టకేలకు ఆదివారం బెంగళూరు శివార్లలో ఆయన దొరికిపోయారు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా పరిధిలోని క్వార్ట్జ్‌ ఖనిజాన్ని ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా కొల్లగొట్టారు. ఆ క్రమంలో మంత్రి హోదాలో కాకాణి కూడా తన నియోజకవర్గం పరిధిలోని పొదలకూరులో మైన్‌ను అక్రమించుకుని రూ.వందల కోట్ల ఖనిజాన్ని అక్రమంగా తరలించారని టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. అప్పల్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక సోమిరెడ్డి, టీడీపీ నాయకులు అప్పట్లో చేసిన ఫిర్యాదుల్లో కదలిక వచ్చింది. ఈ దోపిడీపై విచారణ జరిపిన అధికారులు సుమారు రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్‌ను అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. 10 మందిపై మార్చి 24న కేసు నమోదు చేశారు. కాకాణిని ఏ-4గా చేర్చారు.


విచారణకు డుమ్మా..

ఈ కేసులో విచారణకు హాజరు కావాలని మార్చి 25న నెల్లూరు పోలీసులు కాకాణికి నోటీసులు ఇచ్చారు. అయితే అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నెల్లూరు నివాసంలో ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఇంటి గోడకు నోటీసులు అంటించి వచ్చారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా వెళ్లారు. అక్కడ కూడా ఎవరూ లేకపోవడంతో రెండో నోటీసును కూడా గేటుకు అంటించి వెనుతిరిగారు. ఇదే సమయంలో ఆయన కోసం పోలీసులు ఆయన బంధువుల ఇళ్లవద్దకు వెళ్లారు. ఎక్కడా కనిపించకపోవడంతో మూడో నోటీసును మళ్లీ ఆయన ఇంటి గోడకు అతికించి వచ్చారు. కాకాణి పరారీలో ఉన్నారని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్టులకు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు. కాకాణిని పట్టుకోవడం కోసం నాలుగు ప్రత్యేక బృందాలను నియమించారు.


బెయిల్‌ కోసం శత విధాలా ప్రయత్నం

ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం కాకాణి శత విధాలా ప్రయత్నించారు. హైకోర్టు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తనపై ఉన్న కేసులను ఆయన దాచిపెట్టడంపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ నెల 16న బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేయడంతో పాటు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో న్యాయపరంగా కాకాణికి ఉన్న అన్నిదారులు మూసుకుపోయాయి. పోలీసులు గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశారు. 2 నెలల పాటు కాకాణి ఎక్కడెక్కడో తిరుగుతున్నా పోలీసులు గుర్తించలేని విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నట్లు సమాచారం. ఫోన్‌లో మాట్లాడినా ఎక్కడ నుంచి మాట్లాడుతున్నాడో లోకేషన్‌ తెలియకుండా విపిన్‌ యాప్‌, కంప్యూటర్‌లో డ్యాంగిల్‌ను కాకాణి ఉపయోగించడంతో ఆయన లోకేషన్‌ గుర్తించడం కష్టతరమైందని పోలీసు వర్గాల తెలిపాయి. ఎట్టకేలకు ఆదివారం సాయంత్రం కాకాణిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రి నుంచే నగరంలోని ఆయన నివాసం, వైసీపీ జిల్లా, నగర కార్యాలయాల వద్ద పటిష్ఠ నిఘా ఉంచారు. సోమవారం ఆయన్ను జిల్లాకు తీసుకొస్తారన్న సమాచారం రావడంతో నగరంలోని ప్రధాన కూడళ్లతోపాటు కోర్టు ప్రాంగణాన్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకోనున్నట్లు సమాచారం.

కాకాణికి కష్టకాలమే..

కాకాణి మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లు తెలుస్తోంది. క్వార్ట్జ్‌ తవ్వకాలు జరిపే క్రమంలో క్వారీ కింద కాపురం ఉంటున్న పల్లెలను ఖాళీ చేయించడం, ఆ సందర్భంగా ఎస్టీలను భయబ్రాంతులకు గురిచేశారన్న అభియోగాలతో ఆయనపై అట్రాసిటీ కేసు నమోదైంది. సర్వేపల్లి రిజర్వాయర్‌ నుంచి రూ.కోట్ల విలువైన గ్రావెల్‌ కొల్లగొట్టే క్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి పర్మిట్లు పొందారు. ఈ కేసులో కూడా కాకాణి నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసును సిట్‌ దర్యాప్తు చేస్తోంది. ఇది కూడా ఆయన మెడకు గుదిబండగా మారుతుందేమోనని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

Updated Date - May 26 , 2025 | 03:33 AM