Tragedy: మహాశివరాత్రి వేళ తెలుగు రాష్ట్రాల్లో విషాద ఘటనలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 01:52 PM
Tragedy: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యస్నానాలకు వెళ్లిన పలువురు గల్లంతవడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

తూర్పుగోదావరి, ఫిబ్రవరి 26: శివరాత్రి (Mahashivaratri) వేళ పలు చోట్ల విషాదం నెలకొంది. వేర్వేరు ఘటనల్లో స్నానాలకు వెళ్లిన సమయంలో గల్లంతై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లా (East Godavari) తాడిపూడిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఇసుక ర్యాంపులో గోదావరి నదీ స్నానానికి దిగడంతో ప్రమాదం జరిగింది. ఉదయం నుంచి ఐదుగురు యువకుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా.. ఎట్టకేలకు ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు తిరుమల శెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, అనీసెట్టి పవన్, గర్రె ఆకాష్, పడాల సాయిగా గుర్తించారు. తాడిపూడి గ్రామానికి చెందిన మొత్తం 11 మంది యువకులు నదీ స్నానానికి వెళ్లారు.
వీరంతా ఇసుకతిన్నెల మీద నడుచుకుంటూ వెళ్లి గోదావరిలో స్నానానికి దిగారు. అయితే అక్కడ పెద్ద గొయ్యి ఉండటంతో వారంతా అందులో చిక్కుకున్నారు. అయితే 11 మందిలో ఆరుగురు బయటపడగా.. ఐదుగురు మాత్రం గల్లంతయ్యారు. బయటపడిన యువకుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు వారి మృతదేహాలను వెలికితీశారు. చనిపోయిన వారంతా పదిహేడు, పద్దెనిమిది సంవత్సరాల యువకులే. ఐదుగురు యువకులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో అక్కడ విషాదఛాయలు నెలకొన్నాయి. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వర్, కొవ్వూరు ఆర్డీవో రాణి సుష్మిత పరిశీలించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు.
Indiramma Atmiya Bhrosa: ఉపాధి కూలీలకు పండగ లాంటి వార్త చెప్పిన తెలంగాణ సర్కార్
తండ్రీ, కొడుకు మృతి
అటు శ్రీశైలం ప్రాజెక్ట్ సమీపంలో లింగాలగట్టు వద్ద స్నానాలు చేసేందుకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో తండ్రీ, కొడుకు మృతి చెందగా, ఒకరిని మత్స్యకారులు కాపాడారు.
50 ఏళ్ల వ్యక్తి గల్లంతు
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేటలోనూ విషాదం నెలకొంది. గోదావరిలో మునిగి 50 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గోదావరిలో నీటి ప్రవాహం లేనపట్టికీ ఇసుక కోసం జరిగిన తవ్వకాల్లో గుంతలు ఏర్పడ్డాయి. నీటితో నిండిన గుంతల్లో భక్తులు స్నానాలు చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు పారుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా ప్రమాదాలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా అధికారులు సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం, ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక తవ్వకాల వల్ల గల్లంతైన బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహాశివరాత్రి రోజు భక్తుడు చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఇవి కూడా చదవండి...
Komatireddy Venkatreddy: వారి క్షేమం కోసం మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు
Vamsi in police custody: రెండో రోజు వంశీ విచారణ.. కీలక అంశాలపై ప్రశ్నలు
Read Latest Telangana News And Telugu News