CM Chandrababu: కొల్లేరుకు మానవీయ పరిష్కారం
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:06 AM
కోల్లేరు సరస్సును పరిరక్షిస్తూ, అక్కడున్న స్థానికుల హక్కులను కాపాడటం ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య దృష్ట్యా ఉన్నది. కోర్టు, కేంద్ర ఆదేశాలు, స్థానిక పరిస్థితులను గమనించి మానవీయ పరిష్కారం కోరారు.

సరస్సును పరిరక్షిస్తూనే స్థానికులకూ న్యాయం
జిరాయితీ, డీపట్టా రైతుల హక్కులు కాపాడాలి
ఎమ్మెల్యేలు, అధికారులతో చంద్రబాబు సమీక్ష
అమరావతి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): పర్యావరణానికి దోహదపడుతున్న కొల్లేరు సరస్సును పరిరక్షిస్తూనే, ఆప్రాంత ప్రజల సమస్యలనూ మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొల్లేరుపై కోర్టు తీర్పులు, నిబంధనలు, కేంద్ర సంస్థల ఆదేశాలు, స్థానిక పరిస్థితులు, పర్యావరణం, కాంటూరు అంశాలపై ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులతో సోమవారం అమరావతి సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కొల్లేరు సమస్యను సీఎం దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు. ’కొల్లేరు పరిధిలో మూడు లక్షల మంది ఉన్నారు. కొల్లేరు కాంటూరు పరిధి అంశంలో చాలాకాలంగా వీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి సమస్య పరిష్కారం కోసం 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. నేషనల్ వైల్డ్లైఫ్ బోర్డు 20వేల ఎకరాల జిరాయితీ, డీ పట్టా భూములను కొల్లేరు పరిధి నుంచి మినహాయించి, కొత్త సరిహద్దులు నిర్ధారించాలని 2018లో చెప్పింది. ఆ మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి(సీఈసీ) సిఫారసు చేసింది.
అయితే కొందరు అభ్యంతరాలు చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు’’ అని వారు సీఎంకు తెలిపారు. ఉప్పుటేరులో ఆక్రమణలు తొలగించాలని, పూడికతీసి, ఆక్రమణలు తొలగించి, నీరు సముద్రంలోకి వెళ్లేలా చేయాలని సూచించారు. ఔట్లెట్లు పూర్తిగా క్లియర్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, పచ్చమట్ల ధర్మరాజు, చింతమనేని ప్రభాకర్, అధికారులు పాల్గొన్నారు.