CM Chandrababu: గ్యాస్ కనెక్షన్ల నుంచి సౌర విద్యుత్ వరకు.. కుప్పంలో సంక్షేమ కార్యక్రమాలు శుభారంభం
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:15 PM
CM Chandrababu: స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే రూ.125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి.

చిత్తూరు, జులై 2: కుప్పంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు (బుధవారం) బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న సీఎంకు జిల్లా, కుప్పం నియోజకవర్గ నేతలు, కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆపై కుప్పంలో పలు కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం.. శాంతిపురం మండలం తుంశి వద్ద ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిలో ఇప్పటికే రూ.125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి.
పూర్తైన పనులు ఇవే..
రూ.47 కోట్లతో 30 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. రూ. 42.5 కోట్ల వ్యయంతో 46 కిలోమీటర్ల మేర సీసీ రహదారులు, 65 కిలోమీటర్ల బీటీ రోడ్లు పూర్తి అయ్యాయి. అలాగే తాగునీటి సరఫరా నిమిత్తం రూ.8.97 కోట్లతో పనులు పూర్తి అవగా.. గోకులం షెడ్లు రూ.7.63, వీధిదీపాలు రూ.3.7 కోట్లు, రూ.1.64 కోట్లతో పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యింది.
చెత్త సేకరణకు ఎలక్ట్రిక్ ఆటోల ప్రారంభం
1000 మంది మహిళా లబ్దిదారులకు కొత్తగా గ్యాస్ కనెక్షన్లను, 3041 మంది లబ్దిదారులకు కొత్తగా పెన్షన్లను ముఖ్యమంత్రి అందజేశారు. 7,488 ఎస్సీ ఎస్టీ గృహాలకు రూ.21.80 కోట్ల వ్యయంతో పీఎం సూర్యఘర్ యోజన కింద సోలార్ రూఫ్ టాప్ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి నాటికల్లా సోలార్ ప్యానళ్లు ఏర్పాటు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. అలాగే కుప్పం నియోజకవర్గంలో చెత్త సేకరణకు 130 ఎలక్ట్రిక్ ఆటోలను సీఎం ప్రారంభించారు. ఇంటింటి చెత్త సేకరణకు ఎలక్ట్రిక్ ఆటోలను వినియోగిస్తున్న తొలి నియోజకవర్గంగా కుప్పం అవతరించనుంది. కామన్ ట్రీట్మెంట్ సెంటర్లో చెత్తను రీసైకిల్ చేయటం ద్వారా జీరో ల్యాండ్ ఫిల్ పాలసీ అమలు చేస్తున్న నియోజకవర్గంగా కుప్పం నిలువనుంది.
వ్యవసాయ ఫీడర్లకు సౌర విద్యుత్
అలాగే పేటీఎం సంస్థ సీఎస్ఆర్ నిధులతో అడ్వాన్స్ లైఫ్ సపోర్టు అంబులెన్సులను సీఎం ప్రారంభించారు. 400 అంగన్వాడీ కేంద్రాల్లో కేర్ అండ్ గ్రో కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టారు. పీఎం కుసుమ్ పథకం కింద రూ.564 కోట్లతో వ్యవసాయ ఫీడర్లకు సౌర విద్యుత్ అందేలా కార్యాచరణ రూపొందించారు. దీని ద్వారా 32,106 వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ అందనుంది. కుప్పంలో టూరిజం అభివృద్ధికి తోడ్పడనున్న లీ కంఫర్ట్ 3 స్టార్ రిసార్ట్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. 1387 మంది దివ్యాంగులకు ఉపకరణాలను అందజేశారు. అలాగే 400 మంది డ్వాక్రా మహిళలకు ఈ -సైకిళ్లు సీఎం చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
పవన్ కల్యాణ్పై కేసు.. పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News