Kidney Racket Case: మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో మరో కీలక పరిణామం
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:31 AM
మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధమున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
చిత్తూరు (అన్నమయ్య జిల్లా.), నవంబరు12 (ఆంధ్రజ్యోతి): మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసు (Madanapalle Kidney Racket Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా డీసీహెచ్ఎస్(జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయ అధికారి) డాక్టర్ ఆంజనేయులు, మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఇన్చార్జిగా పనిచేస్తున్న ఆంజనేయులు కోడలు శాశ్వతి, గ్లోబల్ ఆస్పత్రి నిర్వాహకులు ఆంజనేయులు కుమారుడు డాక్టర్ అవినాశ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు మదనపల్లి పోలీసులు. ఇదివరకే కిడ్నీ రాకెట్ కేసులో ఏజెంట్లు అయిన విశాఖపట్నం ప్రాంతానికి చెందిన సత్య, పద్మ మరో వ్యక్తి సూరిబాబులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
మరోవైపు.. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మృతిచెందిన యమున తల్లి సూరమ్మ, తండ్రి నరసింగరాజులతో సహా పలువురు కుటుంబ సభ్యులు, బంధువులు మదనపల్లికి చేరుకున్నారు. తల్లిదండ్రులు, బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు మదనపల్లి టూ టౌన్ పోలీసులు.
మృతిచెందిన యమున మృతదేహం తిరుపతి నుంచి మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే. మదనపల్లి ప్రభుత్వాస్పత్రి మార్చురీలో యమున మృతదేహం ఉంచారు. తమకు జరిగిన అన్యాయం లాగా మరొక కుటుంబానికి జరగొద్దని యమునా తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ కేసుని సీరియస్గా విచారిస్తున్నామని.. ఏమైనా వివరాలు తెలిస్తే బాధితులు ధైర్యంగా ముందుకు రావాలని మదనపల్లి పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు.. సంచలన విషయాలు వెలుగులోకి...
వైసీపీ ర్యాలీకి అనుమతుల్లేవ్.. పోలీసుల వార్నింగ్
Read Latest AP News And Telugu News