Share News

Chandrababu: ఇక ఉపేక్షించను

ABN , Publish Date - Jun 13 , 2025 | 03:28 AM

రౌడీయిజం చేసి పెత్తనం చేయాలనుకునే వారి ఆటలు సాగనివ్వను.. ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు. ఇకపై ఉపేక్షించను. బీకేర్‌ఫుల్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు.

Chandrababu: ఇక ఉపేక్షించను

  • రౌడీమూకతో రైతులకు పరామర్శా?

  • జగన్‌పై ముఖ్యమంత్రి ఆగ్రహం

  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోను

  • ఇప్పటి వరకూ నా మంచితనమే చూశారు

  • రౌడీయిజం చేసేవారి ఆటలిక సాగనివ్వను

  • రాక్షసుల్లా రాష్ట్రాన్ని నాశనం చేసే కుట్ర

  • 11 సీట్లకు పరిమితం చేసినా బుద్ధి రాలేదు

  • వేశ్యల రాజధాని అన్నవారి ఇళ్లలో ఆడవాళ్లు లేరా?

  • ఎంత కొవ్వెక్కితే ఇలాంటి మాటలొస్తాయి?

  • ‘తల్లికి వందనం’ కింద ఒక్క రోజే 10 వేల కోట్లు

  • దేశంలో మరే రాష్ట్రమూ సంక్షేమంలో మన దరిదాపుల్లో లేదు: సీఎం చంద్రబాబు

  • రైతుల పరామర్శకు 10-15 వేల మందితో బలప్రదర్శనగా వెళ్లి రౌడీయిజం చేస్తారా? రౌడీమూకలతో వెళ్లి రైతులను పరామర్శిస్తారా?

  • ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చాలక.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక.. రాక్షసుల మాదిరిగా రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారు.

  • కష్టాలు వచ్చినప్పుడు కాడికింద పడేయడం నా నైజం కాదు. విధ్వంస రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపించడాన్ని ఓ యజ్ఞంలా భావించి ముందుకెళ్తున్నాం.

    -సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): ‘రౌడీయిజం చేసి పెత్తనం చేయాలనుకునే వారి ఆటలు సాగనివ్వను.. ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు. ఇకపై ఉపేక్షించను. బీకేర్‌ఫుల్‌’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో రౌడీమూకలతో వెళ్లి రైతులను పరామర్శించిన జగన్‌పై మండిపడ్డారు. ప్రజాభద్రతకు, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వారికి బుద్ధి రాలేదన్నారు. సమస్యలను అధిగమించేందుకు తాము ప్రయత్నిస్తుంటే రాక్షసుల మాదిరి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, శాంతిభద్రతల సమస్య సృష్టించి ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారని, నేరాలు, ఘోరాలు చేసే వారికి అండగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘవిద్రోహ శక్తులకు అండగా ఉండే వారికి ప్రజలు ఎందుకు మద్దతివ్వాలని ప్రశ్నించారు.


‘దేశంలో ఎక్కడైనా వైసీపీ లాంటి నేర మనస్తత్వంతో కూడిన రాజకీయ పార్టీని చూశారా? సొంత బాబాయిని చంపి.. అప్పటి సీఎంగా ఉన్న నా చేతిలో కత్తిపెట్టే ధైర్యం వచ్చిందంటే.. వారు ఎలాంటి నేరమనస్తత్వం కలిగి ఉన్నారో అర్థమవుతుంది. నింద వేసి దానిని నమ్మించడానికి పేపర్‌ను, టీవీని అడ్డం పెట్టుకున్నారు’ అని దుయ్యబట్టారు. ‘దేవతల రాజధాని అమరావతి.. ప్రజారాజధాని అమరావతి.. అలాంటి దాన్ని వేశ్యల రాజధాని అంటారా.. ఇలాంటి మాటలనేవారి ఇళ్లలో ఆడవాళ్లు లేరా.. అలాంటి మాటలు వింటే రక్తం మరగదా.. ఎంత కొవ్వెక్కితే ఇలాంటి మాటలు వస్తాయి? అమరావతిపై చేసిన మురికి వ్యాఖ్యలను పక్కదారి పట్టించేందుకే పొదిలి వెళ్లి గొడవ చేశారు. మహిళలపై దాడి చేశారు’ అని విరుచుకుపడ్డారు. వైసీపీ వారు యువతను గంజాయికి బానిసల్ని చేస్తే.. తాము 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

సంక్షేమంలో మనమే టాప్‌!

ఎన్టీఆర్‌ భరోసా పేరుతో 2024-25కి రూ.34వేల కోట్ల పింఛన్లు పంపిణీ చేశాం. ఏడాదికి రూ.34వేల కోట్లను ఓ సంక్షేమ పథకానికి ఖర్చు చేస్తున్నది దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇది దేశ చరిత్రలోనే రికార్డు. రూ.3వేలు ఉన్న పింఛన్‌ను ఒకేసారి 4వేలకు పెంచాం. సంవత్సరానికి ఇంత చొప్పున పెంచుకుంటూ పోతామనేది మా సిద్ధాంతం కాదు. ఏ రాష్ట్రమూ సంక్షేమంలో మన దరిదాపుల్లో లేదు. గతంలో పెన్షన్లు పంచేందుకే వలంటీర్లను తీసుకొచ్చారు. వారు లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయలేమన్నారు. కానీ మేం అధికారంలోకి రాగానే 1వ తేదీనే గౌరవప్రదంగా పింఛనుదారులు ఎక్కడుంటే అక్కడకు వెళ్లి పెన్షన్లు ఇస్తున్నాం. 1వ తేదీ సెలవైతే ముందు రోజే ఇస్తున్నాం. పింఛన్ల పంపిణీపై ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో 85 నుంచి 90 శాతం సంతృప్తి స్థాయి వస్తోంది. 67 లక్షల మంది పిల్లలకు రూ.10వేల కోట్లు ఒకేరోజు ఇచ్చిన రికార్డు ఏరాష్ట్రానికీ లేదు. ‘తల్లికి వందనం’ డబ్బులను పేదరికం నుంచి బయటకు వచ్చేందుకు వినియోగించుకోవాలి. ఎప్పటికీ ప్రభుత్వాలపై ఆధారపడే పరిస్థితి రాకూడదనేది నా ఆశ.


బటన్‌ నొక్కుతున్నామని మభ్యపెట్టారు

అన్నదాతా సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో రూ.14వేలు ఇస్తామని చెప్పాం. కేంద్రం ఈ నెల 20న రూ.6వేలు వేస్తుంది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వేస్తుంది. మేం రూ.14వేలు ఇస్తుంటే వైసీపీ వాళ్లురూ.7,500 ఇచ్చేవారు. మేం అదనంగా రూ.6,500 ఇస్తున్నాం. బటన్‌ నొక్కుతున్నానని ప్రజలను మభ్యపెట్టిన వైసీపీ కన్నా మేమిచ్చే సంక్షేమమే మిన్న. వారి హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేశారు. మద్యనిషేధం అన్నవారే మద్యం ఆదాయాన్ని 25ఏళ్లకు తాకట్టు పెట్టారు. అప్పులు తెచ్చారు. ఎమ్మార్వో ఆఫీసులు తాకట్టు పెట్టారు. 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. 94 కేంద్ర పథకాలను అటకెక్కించారు. ఆర్థిక వ్యవస్థను నీరుగార్చారు. ఈ పరిస్థితిని మా ప్రభుత్వం చక్కదిద్దుకుంటూ వస్తోంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులున్నా అధిగమించే ప్రయత్నాలు చేస్తుంటే.. రాక్షసులు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. ఏడాదిలో ఎన్నో పథకాలు వైసీపీ కన్నా మిన్నగా అమలుచేశాం. సుపరిపాలనలో ఇది తొలి అడుగు మాత్రమే.

చేతల్లో చేసి చూపించాం..

ఎన్నికల ప్రచార సమయంలో అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయేకి రెండు కళ్లని చెప్పాను. ఆ మాటను అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో నూటికి నూరుపాళ్లూ అమలు చేస్తూ ముందుకెళ్తున్నాం. మేం అధికారంలోకి వచ్చాక.. చాలామంది.. పూర్తిగా విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడినపెట్టగలరా అని ప్రశ్నించారు. కానీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపించడాన్ని ఓ యజ్ఞంలా భావించి ముందుకెళ్తున్నాం. సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి దాన్ని అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పాం. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించాం.

Updated Date - Jun 13 , 2025 | 05:31 AM