AP Teacher Transfer 2025: త్వరలో 46 వేల మంది టీచర్లకు తప్పనిసరి బదిలీ
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:36 AM
ఆంధ్రప్రదేశ్లో 46 వేల పైగా టీచర్లకు తప్పనిసరి బదిలీ ప్రారంభమైంది. 9,607 కొత్త మోడల్ ప్రైమరీ స్కూల్లలో హెచ్ఎంల నియామకాలు జరుగుతున్నాయి.

స్కూల్ అసిస్టెంట్లు 23,113.. ఎస్జీటీలు 23 వేల మందికి తప్పనిసరి కోటా కింద స్థానచలనం
రిక్వెస్ట్ బదిలీలకు మరో 39 వేల మంది దరఖాస్తు
1872 మంది ప్రైమరీ స్కూళ్ల హెచ్ఎంల బదిలీ
అమరావతి, జూన్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయులు బదిలీ అవుతున్నారు. ఎనిమిది విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఈ ఒక్క కోటాలోనే 46 వేలమందికి పైగా టీచర్లు బదిలీ కాబోతున్నారు. వీరు కాకుండా రిక్వెస్ట్ విధానంలో ఎంతమంది బదిలీ అవుతారనేది త్వరలో తెలుస్తుంది. రెండేళ్లు దాటిన వారు రిక్వెస్ట్ బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. పాఠశాల విద్యా శాఖ ఇటీవల బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. బదిలీల కోసం 43,033 మంది స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోగా, వీరిలో 23,113 మంది తప్పనిసరిగా బదిలీ కావాలి. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్లు 42,248 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో సుమారు 23 వేలమంది తప్పనిసరిగా బదిలీ కావాలి. మొత్తంగా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు కలిపి 46,113 మంది తప్పనిసరిగా బదిలీ అవుతారు. మరో 39 వేలమంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సెలింగ్ అనంతరం వారిలో ఎంతమంది బదిలీ అవుతారో తెలుస్తుంది.
9,607 మోడల్ ప్రైమరీ స్కూళ్లు
రాష్ట్రంలో కొత్తగా 9,607 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రాథమిక స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా అప్గ్రేడ్ చేశారు. ఈ పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్ను ఇస్తారు. ఆ పాఠశాలలకు హెచ్ఎంలను నియమించడంలో కొంత గందరగోళం ఏర్పడింది. సోమవారం నియామకపు ఆర్డర్లు జనరేట్ చేశారు. మూడు విధానాల్లో 9,607 మంది హెచ్ఎంలను నియమిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా 3,532 మంది ఉన్నారు. వారిలో 1,872 మంది ఇప్పుడు బదిలీ అయ్యారు. మిగులు స్కూల్ అసిస్టెంట్ల నుంచి 4,693 మందిని మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా నియమించారు. 1,382 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి హెచ్ఎంలుగా నియమిస్తున్నారు. ఎవరైనా స్కూల్ అసిస్టెంట్లు మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా వెళ్లేందుకు అంగీకరించకపోతే ఆ ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. గ్రేడ్-2 హెచ్ఎంల బదిలీలకు 2,058 మంది దరఖాస్తు చేసుకోగా 1,495 మంది బదిలీ అయ్యారు. 1,373 మంది స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్-2 హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించి పోస్టింగ్లు ఇచ్చారు.