Share News

Kalli Tanda Soldier: అగ్నివీరా అమర్‌రహే

ABN , Publish Date - May 11 , 2025 | 03:45 AM

జమ్ముకశ్మీర్‌లో పోరాడుతూ అమరుడైన అగ్నివీర్‌ మురళీనాయక్‌ పార్థివదేహం స్వగ్రామం కళ్లితండాకు తరలించారు.మంత్రి సవిత, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌ తదితరులు నేడు అధికార లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

Kalli Tanda Soldier: అగ్నివీరా అమర్‌రహే

  • స్వగ్రామానికి మురళీనాయక్‌ పార్థివదేహం

  • మంత్రి సవిత, మహారాష్ట్ర మంత్రి నివాళి

  • దారి పొడవునా భారీగా తరలివచ్చిన జనం

  • నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

  • తల్లిదండ్రులకు అప్పగించిన సైనికాధికారులు

  • బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి కళ్లి తండాకు

  • హాజరుకానున్న కిషన్‌ రెడ్డి, పవన్‌, లోకేశ్‌

పుట్టపర్తి/బెంగళూరు, మే 10(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌ సైనికులతో పోరాడుతూ జమ్ముకశ్మీర్‌లో అమరుడైన అగ్నివీర్‌ జవాన్‌ మురళీనాయక్‌ పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. బెంగళూరు ఎయిర్‌పోర్టు నుంచి శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లి తండాకు తీసుకొచ్చారు. సైనికాధికారులు మురళీనాయక్‌ పార్థివదేహాన్ని ఆయన తల్లిదండ్రులు శ్రీరామనాయక్‌, జ్యోతిబాయికి అప్పగించారు. ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న మురళీనాయక్‌ గురువారం అర్ధరాత్రి రాజౌరి సెక్టార్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో ఆయన పార్థివదేహాన్ని బెంగళూరు ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సవిత, మహారాష్ట్ర నుంచి మంత్రి ఉదయ్‌ సామంత్‌ విమానాశ్రయంలో మురళీ నాయక్‌ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కర్ణాటక తరఫున దేవనహళ్లి తహసీల్దారు హాజరయ్యారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి రాష్ట్ర సరిహద్దు దాకా జీరో ట్రాఫిక్‌ మార్గం ఏర్పాటు చేసి పార్థివదేహాన్ని ఆర్మీ వాహన కాన్వాయ్‌లో తరలించారు. కాన్వాయ్‌ వెంట మంత్రి సవిత వచ్చారు.


దారి పొడవునా ఘన నివాళి

మధ్యాహ్నం రెండు గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద ప్రారంభమైన ర్యాలీ రాత్రి 9.30 గంటల వరకూ కొనసాగింది. దారి పొడవునా జనం పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులు అర్పించారు. జాతీయ జెండాలు చేతబూని వాహనాలపై పూలు చల్లారు. యువకులు జాతీయ జెండాలతో బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. కర్ణాటకలో చిక్కబళ్లాపుర, బాగేపల్లి తదితర ప్రాంతాల్లో జై జవాన్‌, మురళీనాయక్‌ అమర్‌రహే అంటూ ప్రజలు నినదించారు. బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డి సహా వందలాది మంది తరలివచ్చి నివాళులు అర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా సరిహద్దులో కొడికొండ చెక్‌పోస్టు వద్ద హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్‌, ఎంఎస్‌ రాజు, పరిటాల సునీత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్‌ సురేంద్ర, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, వేలాది మంది జనం కన్నీటి నివాళులు అర్పించారు.

మహారాష్ట్రలో మురళి విగ్రహం

మురళీనాయక్‌ విగ్రహాన్ని మహారాష్ట్రలో ఏర్పాటు చేయడానికి శివసేన పార్టీ తరఫున ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆ రాష్ట్ర మంత్రి ఉదయ్‌ సామంత్‌ తెలిపారు. కళ్లి తండాలో మురళీనాయక్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మురళీనాయక్‌ తల్లిదండ్రులు శ్రీరామనాయక్‌, జ్యోతిబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. వీడియో కాల్‌తో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేతో మాట్లాడించారు. జవాన్‌ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని, మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. మురళీనాయక్‌ మహారాష్ట్రలో జన్మించినందున తమ రాష్ట్రంలో విగ్రహం పెట్టడానికి ప్రయత్నిస్తామని ఉదయ్‌ సామంత్‌ అన్నారు.


నేడు అంత్యక్రియలు

మురళీనాయక్‌ అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామం కళ్లితండాలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తారు. కలెక్టర్‌ చేతన్‌, ఎస్పీ రత్న, ఆర్డీఓ సువర్ణ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున జనం రానున్న నేపథ్యంలో ఎస్పీ రత్న ఆధ్వర్యంలో 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరజవాన్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్‌, అనిత, అనగాని సత్యప్రసాద్‌, సవిత, సత్యకుమార్‌ యాదవ్‌ తదితరులు హాజరవుతారు.

Updated Date - May 11 , 2025 | 06:44 AM