Cabinet Decision: ఉద్యోగులకు 2 డీఏలు
ABN , Publish Date - Jun 06 , 2025 | 02:42 AM
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక కరువు భత్యాన్ని(డీఏ) వెంటనే, మరొక డీఏను వచ్చే ఏప్రిల్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఒకటి ఇప్పుడు.. మరొకటి వచ్చే ఏడాది ఏప్రిల్లో
ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ట్రస్ట్
బిల్లుల క్లియరెన్స్కు ప్రతి నెలా 700 కోట్లు
రిటైర్డు ఉద్యోగులను మళ్లీ తీసుకోం
ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ పేరు
స్వయం సంఘాల బీమా సొమ్ము స్త్రీ నిధికి
రూ.33,194 కోట్లతో రోడ్ల అభివృద్ధి
మెట్రో రెండో దశకు రూ.19,579 కోట్లు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు
వివరాలు వెల్లడించిన భట్టి, పొంగులేటి
5 గంటల పాటు సాగిన క్యాబినెట్ భేటీ
హైదరాబాద్, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు డీఏలు ఇవ్వాలని నిర్ణయించింది. ఒక కరువు భత్యాన్ని(డీఏ) వెంటనే, మరొక డీఏను వచ్చే ఏప్రిల్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9.30 గంటల వరకు కొనసాగింది. ఐదు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉద్యోగ సంఘాల డిమాండ్లతో పాటు పలు అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు తెలియజేశారు. ఉద్యోగుల డిమాండ్లపై మే 6న ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ నివేదికను సమర్పించిందని తెలిపారు. ఉద్యోగులు ఇచ్చిన 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం.. అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదించగా, మరికొన్నింటిని పరిశీలనకు స్వీకరించిందని వెల్లడించారు. ప్రధానంగా డీఏ గురించి ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ఈ డీఏల చెల్లింపు వల్ల ప్రభుత్వంపై పడే ఆర్థిక భారాన్ని లెక్కించి, రెండు డీఏలు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2023 జనవరి 1 నుంచి బకాయి ఉన్న డీఏల్లో ఒకదాన్ని వెంటనే చెల్లిస్తామన్నారు. అప్పటి నుంచి బకాయి పడిన సొమ్మును 28 వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపారు. మరో డీఏను వచ్చే ఏప్రిల్లో ప్రకటించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
మరికొన్ని నిర్ణయాలు మంత్రుల మాటల్లోనే..
ఉద్యోగులు హెల్త్ కార్డులు ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ పథకం కోసం ప్రతి ఉద్యోగి రూ.500 చొప్పున ఇవ్వాలని, ఏడాది పాటు వాళ్లు జమ చేసిన సొమ్ముకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని నిర్ణయించాం. ఇందుకోసం ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తాం. దానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. అధికారులు, ఉద్యోగుల నుంచి కొంత మంది చొప్పున ట్రస్టులో సభ్యులుగా ఉంటారు. ఉద్యోగులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా.. ఈ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తారు.
గత ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులను పెండింగ్లో పెట్టింది. ఈ బిల్లులను క్లియర్ చేయడానికి ప్రతి నెలా రూ.700 కోట్లు తగ్గకుండా చెల్లించాలని నిర్ణయించాం. బిల్లుల బకాయిలను నెలవారీగా క్లియర్ చేస్తారు.
ఉద్యోగ సమస్యల పరిష్కారానికి జాయింట్ స్టేట్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని, ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం.
జీవో 317లో ఇంకా కొన్ని విభాగాలను చేర్చాలని నిర్ణయం తీసుకున్నాం.
సచివాలయంలో ఉద్యోగుల కోటా 12.5 శాతం ఉండాలని కోరారు. దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. దానిని కూడా ఆమోదించాం.
రిటైర్డ్ ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయించాం.
గ్రామ పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ను పంచాయతీ గ్రేడింగ్ ప్రకారం చేయాలని నిర్ణయించాం.
డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీల సమావేశాలను రెగ్యులర్గా నిర్వహించాలని కోరారు. దానికి ఆమోదం తెలిపాం.
ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారులను పాత స్థానాలకు పంపాలని నేతలు కోరారు. దానికీ సమ్మతించాం.
జిల్లా పరిషత్లకు సంబంధించి కారుణ్య నియామకాలను చేపట్టాలని నిర్ణయించాం.
నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ ప్రయోజనాలను రూ.2 లక్షలకు పెంచేందుకు సమ్మతి తెలిపింది.
ఉద్యోగుల వాహన అద్దెలను వెంటనే క్లియర్ చేయాలని, ఇచ్చే ధరను పెంచాలని నిర్ణయించాం.
రోడ్ల మరమ్మతులకు రూ.33194 కోట్లు
ఉద్యోగుల సమస్యలతో పాటు ఇతర అంశాలపైనా క్యాబినెట్ భేటీలో చర్చించాం. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో ఉన్న ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వర్సిటీకి తెలంగాణకు ఇవ్వడానికి సహకరించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని క్యాబినెట్ నిర్ణయించింది.
స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రమాద బీమా పథకం అమలు కోసం రూ.38.5 కోట్లను స్త్రీ నిధికి కేటాయించాలని నిర్ణయించాం. బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించకుండా నేరుగా స్త్రీ నిధి ద్వారా 385 మంది బాధిత కుటుంబాలకు ప్రమాద బీమా పరిహారం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
రాష్ట్రంలో ఆర్అండ్బీ, పంచాయతీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, గ్రామం నుంచి మండలానికి బీటీ రోడ్డు, మండలం నుంచి జిల్లాకు డబుల్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి నాలుగు లేన్ల రోడ్లు వేయాలని నిర్ణయించాం. ఆర్అండ్బీ పరిధిలో 5190 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ పరిధిలో 7947 కి.మీ.. మొత్తం 13137 కి.మీ. రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంచాయతీరాజ్ రోడ్లకు రూ.16,780 కోట్లు, ఆర్అండ్బీ రోడ్లకు రూ.16,414 కోట్లను వెచ్చిస్తాం. హ్యామ్ విధానంలో రెండేళ్లలో నిర్మాణంతో పాటు 15 ఏళ్ల పాటు నిర్వహణ కూడా ఏజెన్సీలకే ఇచ్చేలా నిర్ణయం జరిగింది. పార్లమెంట్ ఒక యూనిట్గా లేదా ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో జిల్లా ఒక్కో ప్యాకేజీగా విభజించి రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించాం.
రాష్ట్రంలో సన్న ధాన్యాన్ని పండించే రైతులను ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సన్నాలకు బోన్సతో రైతులకు లబ్ధి చేకూరిందని, సన్న వడ్లకు బోన్సను కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
హైదరాబాద్ సిటీలో మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించి 86.1 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణాన్ని రూ.19,579 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్తో చేపట్టాలని నిర్ణయించాం.
కారిడార్-1లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కి.మీ.; కారిడార్-2లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కి.మీ.; కారిడార్-3లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట్ వరకు 22 కి.మీ. నిర్మాణం చేయనున్నాం.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News