Share News

2024-25 Budget: ప్రభుత్వ వ్యయం 2.12 లక్షల కోట్లు

ABN , Publish Date - May 17 , 2025 | 05:13 AM

రాబడుల్లో ఆశించిన పురోగతి లేకపోయినా, కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు పూర్తి స్థాయిలో రాకపోయినా, పన్నేతర రాబడి లక్ష్యాన్ని చేరుకోకపోయినా..

2024-25 Budget: ప్రభుత్వ వ్యయం 2.12 లక్షల కోట్లు

2024-25లో అంచనా వ్యయంలో 83.64 శాతం.. 2023-24 కంటే 1.37 శాతం తగ్గిన ఖర్చు

  • 2022-23తో పోలిస్తే 5.63 శాతం అధికం

  • ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2.91 లక్షల కోట్లు

  • రాబడులు, కేంద్ర గ్రాంట్లలో లేని పురోగతి

  • పెనుభారంగా మారిన వడ్డీ చెల్లింపులు

  • సర్కారుకు కలిసిరాని పన్నేతర రాబడి

  • 108 శాతంతో మూలధన వ్యయం భేష్‌

  • మార్చి నివేదిక విడుదల చేసిన ‘కాగ్‌’

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): రాబడుల్లో ఆశించిన పురోగతి లేకపోయినా, కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్లు పూర్తి స్థాయిలో రాకపోయినా, పన్నేతర రాబడి లక్ష్యాన్ని చేరుకోకపోయినా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పద్దుల కింద రూ.2,12,796.27 కోట్లను వ్యయం చేసింది. ప్రతిపాదిత వ్యయం రూ.2,54,431.31 కోట్లలో ఇది 83.64ు కావడం గమనార్హం. అంతకుముందు 2023-24లో చేసిన 85.01ు వ్యయం కంటే కొంత తక్కువగా నమోదైనా.. బీఆర్‌ఎస్‌ హయాం నాటి ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే 5.63ు అధిక వ్యయం నమోదైంది. ఈమేరకు రాష్ట్ర ఆదాయ వ్యయాలపై ‘కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)’ శుక్రవారం విడుదల చేసిన మార్చి నివేదికలో వివరాలను వెల్లడించింది. మార్చితో ముగిసిన 2024-25ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం చేసిన మొత్తం వ్యయాలు, సాధించిన రాబడులను వివరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2,91,159 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే రుణాలు, అడ్వాన్సులు, ఆర్థిక లోటును మినహాయించి రూ.2,54,431.31 కోట్లను వ్యయం చేస్తామని ప్రకటించింది. కానీ,పలు కారణాలతో రూ.2,12,796.27 కోట్లను మాత్రమే వ్యయం చేయగలిగింది.


అప్పులకు వడ్డీలతో పెనుభారం..

పథకాలు, ఇతర కార్యక్రమాల కింద రూ. 1,35,289.45 కోట్లను వ్యయం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోగా.. సంవత్సరాంతానికి రూ. 79,193.85 కోట్లు.. అంటే 58.54 శాతాన్ని మాత్రమే ఖర్చు చేయగలిగింది. తెచ్చిన అప్పులపై వడ్డీలు చెల్లించడం ప్రభుత్వానికి పెనుభారంగా పరిణమించినట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. వడ్డీ చెల్లింపుల కింద సంవత్సరానికిగాను రూ.17,729.77 కోట్లను వ్యయం చేయగలమని ప్రభుత్వం అంచనా వేయగా... అది కాస్తా రూ.26,688.27 కోట్లకు చేరడం గమనార్హం. అంటే... అంచనా వ్యయం కంటే ఎక్కువ మొత్తంలో వడ్డీల కింద చెల్లించాల్సి వచ్చింది. ఇక ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులు కూడా అంచనా కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ పద్దు కింద రూ.40,041.79 కోట్లను అంచనా వేయగా.. మార్చి నాటికి రూ.42,245.51 కోట్లు (105.50ు) చెల్లించాల్సి వచ్చింది. రిటైర్డు ఉద్యోగుల పెన్షన్లు కూడా భారంగానే తయారయ్యాయి. దీని కింద రూ.11,641.38 కోట్లు అంచనా వేయగా.. మార్చి నాటికి ప్రభుత్వం రూ.16,950.17 కోట్లు (145.60ు) చెల్లించింది. అంటే పెన్షన్ల చెల్లింపుల కోసం అంచనా వేసిన సొమ్ము ఏమాత్రం సరిపోలేదని, ఏకంగా 150 శాతం మేర వ్యయం చేయాల్సి వచ్చిందని అర్థమవుతోంది. పథకాల సబ్సిడీల కింద రూ.16,242.42 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేయగా... రూ.11,508.94 కోట్లు (70.86ు) మాత్రమే ఖర్చయ్యాయి.


పన్ను రాబడి తగ్గినట్లే..

పన్ను రాబడి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ పద్దు కింద ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.1,64,397.64 కోట్లు వస్తాయని సర్కారు అంచనా వేసింది. కానీ, సంవత్సరాంతానికల్లా రూ.1,36,283.47 కోట్లు (82.90ు) మాత్రమే సమకూరాయి. ఇందులో ప్రధానంగా స్టాంపులు-రిజిస్ట్రేషన్ల రాబడి దెబ్బకొట్టింది. దీని కింద రూ.18,228.82 కోట్లను అంచనా వేస్తే.. రూ.8,473.21 కోట్లు(46.48ు) మాత్రమే సమకూరాయి. జీఎ్‌సటీ కింద రూ.58,594.91 కోట్ల అంచనాకుగాను రూ.50,343.46 కోట్లు(85.92ు), అమ్మకం పన్ను కింద రూ.33,449.21 కోట్లకుగాను రూ.31,815.89 కోటు ్ల(95.12ు), రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాల కింద రూ.25,617.53 కోట్లకుగాను రూ.18,603.66 కోట్లు (72.62ు), కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో వాటా కింద రూ.18,384.19 కోట్లకు గాను రూ.19,149.89 కోట్లు(104.16ు) సమకూరాయి. ఇతర పన్నులు, సుంకాల కింద రూ.10,111.78 కోట్లను అంచనా వేయగా... రూ.7,896.41 కోట్లు(78.09ు) వచ్చాయి. మార్కెట్‌ అప్పుల కింద రూ.49,255.41 కోట్లు తీసుకుంటామని అంచనా వేయగా.. మార్చి నాటికి ప్రభుత్వం రూ.48,322.20 కోట్ల (98.11ు) అప్పులు తీసుకున్నట్లు కాగ్‌ వెల్లడించింది.


కేంద్ర గ్రాంట్లలో మళ్లీ దెబ్బే!

కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, కాంట్రిబ్యూషన్ల విషయంలో రాష్ట్రానికి మళ్లీ ఎదురుదెబ్బే తగిలింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పరిస్థితి. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యాశకు పోకుండా, ఆచితూచి కేంద్ర గ్రాంట్లను అంచనా వేసింది. ఈ పద్దు కింద కేంద్రం నుంచి రూ.21,636.15 కోట్లు వస్తాయని అంచనా వేస్తే.. మార్చి నాటికి వచ్చింది రూ.7,913.08 కోట్లు మాత్రమే. అంటే కేవలం 36.57 శాతం నిధులు మాత్రమే సమకూరాయి. కనీసం మార్చిలోనైనా ఎక్కువ నిధులు వస్తాయనుకుంటే.. ఎప్పటిలాగే రూ.1,903 కోట్లు వచ్చాయి.


మూలధన వ్యయం భేష్‌

మూలధన వ్యయం విషయంలో ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. సాగునీటి పారుదల ప్రాజెక్టులు, భవనాలు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ మూలధన వ్యయాన్ని వినియోగిస్తారు. దీని కింద 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.33,486.50 కోట్ల ను వ్యయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఏకంగా రూ.36,209.53 కోట్లను వ్యయం చేసింది. ఇదిప్రతిపాదిత వ్యయంలో 108.13 శాతం కావడం గమనార్హం. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తూనే కొత్తగా యంగ్‌ ఇండి యా సమీకృత గురుకుల విద్యాలయాలకు నూతన భవనాలు నిర్మిస్తున్నందున.. మూలధన వ్యయం ఆశించిన స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.


పన్నేతర రాబడీ కలిసి రాలేదు

పన్నేతర రాబడి కూడా ప్రభుత్వానికి కలిసి రాలేదు. దీని కింద రూ.35,208.44 కోట్లు అంచనా వేయగా.. రూ.23,607.77కోట్లు (67.05ు) మాత్రమే వచ్చాయి. అయితే పన్నేతర రాబడి కింద మిగతా నెలల కంటే అధికంగా ఒక్క మార్చిలోనే ఏకంగా రూ.17,535.79 కోట్లు వచ్చినట్లు కాగ్‌ నివేదిక పేర్కొనడం గమనార్హం

Updated Date - May 17 , 2025 | 05:13 AM