Share News

Employee JAC: మూడు డీఏలు వెంటనే ఇవ్వండి

ABN , Publish Date - Jun 05 , 2025 | 02:39 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, సప్లిమెంటరీ బిల్లులన్నీ ఒకే దఫాలో చెల్లించాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరింది.

Employee JAC: మూడు డీఏలు వెంటనే ఇవ్వండి

  • మిగతా రెండు డీఏలు పీఆర్సీలో కలపండి

  • పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 51 శాతం ఇవ్వండి

  • సప్లిమెంటరీ బిల్లులు ఒకేదఫాలో క్లియర్‌ చేయండి

  • హెల్త్‌కార్డుల అంశాన్ని త్వరగా తేల్చండి

  • మంత్రివర్గ ఉపసంఘానికి ఉద్యోగ జేఏసీ విజ్ఞప్తి

  • పదవీ విరమణ వయసు పెంపు వద్దన్న నేతలు

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 51 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని, సప్లిమెంటరీ బిల్లులన్నీ ఒకే దఫాలో చెల్లించాలని ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరింది. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలలో వెంటనే మూడు డీఏలు విడుదల చేయాలని, మిగతా రెండింటిని పీఆర్సీలో కలిపి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఉద్యోగుల హెల్త్‌కార్డులు, సాధారణ బదిలీలు సహా తాము కోరుతున్న 57 అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. పదవీ విరమణ వయసు పెంచే ప్రతిపాదన ఏదైనా ఉంటే విరమించుకోవాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో భేటీ అయింది. ఇందులో ఉప సంఘం సభ్యులైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, అధికారుల త్రిసభ్య కమిటీ సభ్యులు నవీన్‌ మిట్టల్‌, లోకేశ్‌కుమార్‌, కృష్ణ భాస్కర్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మహేశ్‌దత్‌ ఎక్కా, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ మారం జగదీశ్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, పీఆర్టీయూ నేత దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్లపై విస్తృతంగా చర్చించారు.


ఏదైనా తీపి కబురు చెబుతారా?

సమావేశం ప్రారంభం కాగానే.. ‘ఏదైనా తీపి కబురు చెబుతారా?’ అని జేఏసీ ప్రతినిధులు మంత్రివర్గ ఉప సంఘాన్ని అడిగారు. డిమాండ్ల పరిష్కారం కోసం ముందుకొచ్చి, సమావేశం ఏర్పాటు చేయడమే తీపి కబురని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ.. తాము ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి, నివేదికను సిద్ధం చేశామని, ఉద్యోగుల డిమాండ్లను మంత్రివర్గ ఉప సంఘానికి వివరించామని తెలిపారు. అనంతరం మారం జగదీశ్‌, ఏలూరి శ్రీనివాసరావు, దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. మొదటి పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను అమలు చేశారే తప్ప, రెండో పీఆర్సీ మాటే ఎత్తడం లేదని చెప్పారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శివశంకర్‌ నేతృత్వంలోని వేతన సవరణ సంఘానికి తాము పలు రకాల విజ్ఞప్తులు చేశామని వివరించారు. ముఖ్యంగా 51 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్‌ చేస్తోందని, దీనిపై క్యాబినెట్‌ భేటీలో చర్చించి, ఆమోదించాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి రూ.13 వేలకోట్ల మేర సప్లిమెంటరీ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, రిటైర్మెంట్‌ ప్రయోజనాలను కూడా విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. ఉద్యోగుల పిల్లల పెళ్లిళ్లు, గృహ నిర్మాణ బిల్లులను ఆపడం వల్ల వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. గతంలో నెలకు రూ.500 కోట్ల చొప్పున క్లియర్‌ చేస్తామని చెప్పారని, అది సరిగా అమలు కావడం లేదని.. సప్లిమెంటరీ బిల్లులన్నీ ఒకే దఫాలో క్లియర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల హెల్త్‌కార్డుల సమస్య ఇప్పటికీ పరిష్కారం కావడం లేదని.. ఆరోగ్య పథకం కార్పస్‌ ఫండ్‌కు కాంట్రిబ్యూషన్‌ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదని పేర్కొన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎ్‌స)ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) అమలు చేయాలని కోరారు. సాధారణ బదిలీలు చేపట్టాలన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఏడాది పాటు పెంచుతామన్న వార్తలు వస్తున్నాయని.. దీనివల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, పదోన్నతులు పొందాల్సినవారు నష్టపోతారని వివరించారు. ఇలాంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ఒకవేళ పదవీ విరమణ వయసు పెంచితే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.


నేటి క్యాబినెట్‌ సమావేశంలో నివేదిక ఇస్తాం: భట్టి విక్రమార్క

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలతో నివేదికను గురువారం జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో నివేదిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఉద్యోగ సంఘాల జేఏసీతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ ఉప సంఘాన్ని, అధికారుల కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపాలని మంత్రుల కమిటీకి సూచించారని చెప్పారు. కొన్నేళ్లుగా ఉద్యోగులు, ఇతర వర్గాల బిల్లులు పేరుకుపోవడంతో ఒకేసారి క్లియర్‌ చేయలేకపోయామని భట్టి వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ ఆదాయం, వ్యయం వంటివన్నీ సమన్వయం చేసుకుంటూనే, ఉద్యోగ వ్యవస్థకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వివరించారు. ఒకవైపు ప్రజలకు, మరోవైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా ఎలా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతోనే క్యాబినెట్‌ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యామని చెప్పారు. అధికారుల కమిటీ, ఆర్థిక శాఖ, ఇతర అధికారులతో చర్చించి ఒక నివేదికను రూపొందించి.. గురువారం క్యాబినెట్‌ సమావేశంలో సమర్పించి, సమస్యలకు పరిష్కారం కనుగొంటామని తెలిపారు.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 02:39 AM