Ravi Srinivas: సిర్పూర్ కాంగ్రెస్ ఇన్చార్జి రావి శ్రీనివా్సపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Jun 30 , 2025 | 06:25 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రావి శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది.

కుట్ర చేసి సస్పెండ్ చేయించారు
మంత్రి సీతక్క ఒత్తిడితోనే సస్పెన్షన్: శ్రీనివాస్
కాగజ్నగర్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి రావి శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీనివాస్ను ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం ప్రకటించింది. శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కపై విమర్శలు చేశారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేశారని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఇటీవల టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ(డీఏసీ)కి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీఏసీ చైర్మన్ శ్రీనివా్సకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నెల 28లోపు వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
శ్రీనివాస్ నుంచి సరైన వివరణ రాకపోవడంతో పార్టీ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. అయితే, తనపై కుట్ర చేసి పార్టీ నుంచి సస్పెం డ్ చేశారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క పీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకొచ్చి సస్పెండ్ చేయించారని ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సస్పెన్షన్ తనపై ఎటువంటి ప్రభా వం చూపబోదని, తాను నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తిని అని చెప్పారు.