Hyderabad: విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్..
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:25 AM
పుట్టి పెరిగిన పల్లెల్లో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకొన్న ప్రజలు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యంగా కోడి పందేలను చూసేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగరవాసులు కనుమ ముగియగానే తిరుగుముఖం పట్టారు.

4.కి.మీ మేర నిలిచిపోయిన వాహనాలు
చిట్యాల రైల్వే బ్రిడ్జి వద్ద ఇరికిన కంటైనర్
ఏపీ నుంచి హైదరాబాద్కు ప్రజల రాక
నగరంవైపు రోడ్లపై వాహనాల బారులు
బీబీనగర్, చౌటుప్పల్ టౌన్, కేతేపల్లి, కోదాడ రూరల్, చిట్యాల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పుట్టి పెరిగిన పల్లెల్లో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకొన్న ప్రజలు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ముఖ్యంగా కోడి పందేలను చూసేందుకు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిన నగరవాసులు కనుమ ముగియగానే తిరుగుముఖం పట్టారు. ఫలితంగా ఏపీ నుంచి హైదరాబాద్ వైపు రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, కార్లు ఇతర ప్రైవేటు వాహనాలు, బైక్ల వరదతో రద్దీ నెలకొంది. దీన్ని ఆసరగా చేసుకొని ప్రైవేటు బస్సులు, ఇతర వాహనదారులు ప్రయాణికులను అడ్డగోలుగా దోచుకుంటున్నారు. సాధారణ రోజుల్లో చార్జీలకన్నా మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. గురువారం ఉమ్మడి నల్లగొండ జిల్లా కోదాడ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల దాకా హైదరాబాద్కు ఆర్టీసీ నుంచి ఒక్క బస్సూ లేదని ప్రయాణికులు వాపోయారు. సాధారణ రోజుల్లో కోదాడ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రైవేటు వాహనదారులు ఒక్కొక్కరి నుంచి రూ.350 చార్జీ చేస్తారు.
ఇప్పుడేమో రద్దీని ఆసరాగా చేసుకొని రూ.700నుంచి రూ.1000దాకా వసూలు చేస్తున్నారు. 65వ నంబర్ జాతీయ రహదారి, ఉమ్మడి నల్లగొండ జిల్లా చిట్యాల శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద కంటైనర్ ఇరుక్కుపోయింది. ఫలితంగా రోడ్డుకు ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. అరగంటపాటు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు క్రేన్ సాయంతో వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఇక ఏపీ నుంచి హైదరాబాద్వైపు జాతీయ రహదార్లపై రద్దీ నివారణకు టోల్గేట్ల వద్ద ప్రత్యేక చర్యలు చేపట్టారు. నల్లగొండ జిల్లాలోని గూడూరు, పంతంగి, కొర్లపహాడ్ టోల్ప్లాజాల మీదుగా గురువారం లక్ష వాహనాలు హైదరాబాద్కు వెళ్లాయి. గూడూరు టోల్ప్లాజా వద్ద రద్దీని నివారించేందుకు 100 అడుగుల దూరంలోనే ఫాస్టాగ్ స్కాన్ అయ్యేలా సాంకేతికపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ టోల్ప్లాజాలో మొత్తం 12గేట్లు కాగా, హైదరాబాద్ వైపు ఎనిమిది, వరంగల్ వైపు నాలుగు గేట్ల నుంచి వాహనాలను పంపుతున్నారు.
సాధారణ రోజుల్లో 20వేల వాహనాలు ప్రయాణిస్తే గురువారం 23వేల వాహనాలు వెళ్లాయి. ఇక్కడ బైక్ల మీద వస్తున్నవారికి పోలీసు సిబ్బంది డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చౌటుప్పల్లోని 65వ నంబరు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ దృష్ట్యా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినట్టు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. హైవేపై 200మంది పోలీసులను నియమించినట్లు, రెండు పెట్రోలింగ్ వాహనాలను 24 గంటలు తిప్పుతున్నామని ఏసీపీ తెలిపారు. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజా వద్ద 16 గేట్లు కాగా హైదరాబాద్ వైపు 12గేట్ల నుంచి విజయవాడ వైపు నాలుగు గేట్ల నుంచి వాహనాలను అనుమతిస్తున్నారు. సాధారణ రోజుల్లో 20వేల వాహనాలు వెళుతుండగా, గురువారం అదనంగా 10వేల వాహనాలు వెళ్లాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ప్లాజాలోని 12టోల్ వసూలు కౌంటర్లలో వాహనాల రద్దీకి అనుగుణంగా కౌంటర్లు కేటాయించారు. ఇక్కడ సాధారణ రోజుల్లో 17వేల వాహనాలు వెళుతుండగా, గురువారం 50వేల వాహనాలు వెళ్లాయి.