అభినవ అన్నమయ్య గరిమెళ్ల అస్తమయం
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:32 AM
అభినవ అన్నమయ్యగా కీర్తినందుకున్న టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్(76) ఇక లేరు. తిరుపతి భవానీనగర్లో నివాసం ఉంటున్న ఆయన ఆదివారం సాయం త్రం గుండెపోటుతో కన్నుమూశారు.

టీటీడీ ఆస్థాన విద్వాంసుడు బాలకృష్ణ ప్రసాద్ తుదిశ్వాస
తిరుపతి/అమరావతి/యాదగిరిగుట్ట, మార్చి 9(ఆంధ్రజ్యోతి): అభినవ అన్నమయ్యగా కీర్తినందుకున్న టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్(76) ఇక లేరు. తిరుపతి భవానీనగర్లో నివాసం ఉంటున్న ఆయన ఆదివారం సాయం త్రం గుండెపోటుతో కన్నుమూశారు. ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ప్రఖ్యాతి గాంచిన గరిమెళ్ల 600కు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచి వెలుగులోకి తెచ్చారు. 6వేలకు పైగా కచేరీలు చేశారు. ప్రత్యేకించి ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’, ‘జగడపు చనువుల జాజర’, ‘తిరువీధుల మెరసీ దేవదేవుడు’, ‘సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట’, ‘ఇతడొకడే సర్వేశ్వరుడు’, ‘నమో నారాయణాయ నమో’ వంటి కీర్తనలు ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చాయి. సంప్రదాయ కర్ణాటక సంగీతంతో పాటు లలిత సంగీతం, జానపద సంగీతంలోనూ ఆయన సుప్రసిద్ధులు. సిలికానాంధ్ర సంస్థ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన లక్ష గళార్చనలో బాలకృష్ణ ప్రసాద్ ప్రధాన గాయకులు. ఆ కార్యక్రమం గిన్నిస్ బుక్లో నమోదైంది. 1948లో రాజమండ్రిలో కృష్ణవేణి, నరసింహరావు దంపతులకు గరిమెళ్ల జన్మించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్.జానకి ఈయనకు స్వయాన పిన్ని. మృదంగ విద్వాంసులైన తండ్రి నుంచి సంగీతం పట్ల మక్కువ పెంచుకున్నారు. 1978లో టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టులో గాయకుడిగా చేరిన ఆయన 2006లో ఉద్యోగ విరమణ పొందారు. 2012 నుంచి 2023వరకూ టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా కొనసాగారు. కామకోటి పీఠం, అహోబిల మఠం ఆస్థాన సంగీత విద్వాంసులుగా సేవలు అందించారు. తెలుగునాట సంకీర్తనా యజ్ఞ ప్రక్రియను తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత గరిమెళ్లకే దక్కుతుంది. 2020లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతోపాటు అపర అన్నమయ్య, అన్నమాచార్య సంకీర్తనా మహతి బిరుదులు స్వీకరించారు.
సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. 1978 నుంచి 2006 వరకు టీటీడీలో ఆస్థాన గాయకుడిగా 600కు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గరిమెళ్ల మరణం సంప్రదాయ సంగీత ప్రపంచానికి తీరని లోటని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
యాదగిరిగుట్టతో అనుబంధం
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతంతో గరిమెళ్లకు ఎనలేని అనుబంధం ఉంది. ఈ నెల 6న నిర్వహించిన యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. సింహ వాహన సేవలో పాల్గొన్నారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారని తెలియడంతో సంగీతప్రియులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..
TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here