Osmania Hospital: కాసుల కోసం కేస్ షీట్లనే మార్చేస్తున్నారుగా..
ABN , Publish Date - Jun 07 , 2025 | 09:51 AM
ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. కాసుల కోసం కక్కుర్తిపడిన సిబ్బంది కేస్ షీట్లను మార్చివేస్తున్నారు. అలాగే.. అనుమానాస్పద మృతిని సాధారణ మరణంగా మార్చేశారనే విమర్శలొస్తుండగా రూ. 8 వేలు తీసుకొని మృతదేహం అప్పగించానే ఆరోపణలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

- ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం
- అనుమానాస్పద మృతిని సాధారణ మరణంగా మార్చేసిన వైనం
- రూ. 8 వేలు తీసుకొని మృతదేహం అప్పగింత
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital) సిబ్బంది కాసుల కోసం కేస్ షీట్లనే మార్చేస్తున్నారు. వైద్యులనే బురిడీ కొట్టించి కొత్త కేస్ షీట్లతో కమీషన్ల కోసం మృతదేహాలను బయటకు పంపించే కార్యక్రమానికి తెర తీశారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ ప్రాంతానికి చెందిన కమ్లురాం కచ్లం(50) మహబూబ్నగర్ జిల్లాకు వలస వచ్చి కూలీపని చేసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం మెదడులో రక్తస్రావం కావడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. మేస్త్రీలు వెంటనే అతడిని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు చేశారు. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఈనెల 5వ తేదీ మధ్యాహ్నం ఉస్మానియా వైద్యులు పరీక్షలు నిర్వహించి మెడికో లీగల్ కేస్(ఎమ్మెల్సీ నంబర్: 19597)గా ఏఎంసీలో అడ్మిట్ చేసుకొని చికిత్సలు ప్రారంభించారు. రక్తస్రావం ఎక్కుగా ఉండడంతో సాయంత్రం 5.34 గంటల సమయంలో కమ్లూరాం కచ్లం మృతి చెందాడు. ఎమ్మెల్సీ కేసు కావడంతో మార్చురీకి తరలించి శవ పరీక్షలు నిర్వహించిన తరువాత మృతదేహాన్ని అప్పగిస్తామని వైద్యులు చెప్పారు.
ఆందోళనకు గురైన మేస్త్రీలు అక్కడే కాంట్రాక్ట్ ప్రాతిపాదికన విధులు నిర్వహిస్తున్న భాగ్యలక్ష్మిని సంప్రదించారు. పోస్టుమార్టం చేయకుండా మృతదేహం అప్పగించేలా చూస్తానని వారితో ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 8 వేలు ఇస్తే మృతదేహం అప్పగించడంతోపాటు అంబులెన్స్ మాట్లాడతానని చెప్పింది. మృతదేహాన్ని ఛత్తీ్సగఢ్ తరలించేందుకు రూ. 40 వేలకు మాట్లాడుకున్నట్లు సమాచారం.
నాన్ ఎమ్మెల్సీ కేసుగా మార్పు
డబ్బులు చేతికి అందిన వెంటనే భాగ్యలక్ష్మి ఓపీ రిజిస్ట్రేషన్ వద్దకు వెళ్లి ఓపీ చీటీ తీసుకుంది. అత్యవసర విభాగంలోని వైద్యుల వద్దకు వెళ్లి కమ్లురాం కచ్లం(50)కు అడ్మిషన్ రాయించుకొని రూం నెంబర్ 104లో అడ్మిషన్ చేయించింది. రెండు నిమిషాల అనంతరం అతడు మృతిచెందినట్లు కేస్ షీట్పై రాయించింది. పాత కేస్ షీట్ను దాచి కొత్త కేస్ షీట్ ఆధారంగా మృతదేహాన్ని మేస్త్రీలకు అప్పగించినట్లు సంతకాలు తీసుకుంది.
అనంతరం మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్లో ఎక్కించి ఆస్పత్రి నుంచి పంపించేశారు. అరగంట తరువాత ఎమ్మెల్సీ(మెడికో లీగల్ కేస్)కు సంబంధించిన కేస్షీట్ లభించడంతో అనుమానం వచ్చి హెల్త్ ఇన్స్పెక్టర్, సూపర్వైజర్లు ఆరా తీయగా ఎమ్మెల్సీ కేసును నాన్ ఎమ్మెల్సీగా మార్చి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు తేలింది. డ్యూటీలో ఉన్న ఆర్ఎంఓ డాక్టర్ విజయ్ భాస్కర్ వెంటనే మేస్త్రీలకు ఫోన్ చేయించి అంబులెన్స్ను వెనక్కి రప్పించారు.
మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. అఫ్జల్గంజ్ పోలీసులను పిలిపించి విచారణ చేపట్టారు. భాగ్యలక్ష్మిని విధుల నుంచి తొలగించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్కు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కమిటీ ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని అప్పగించేందుకు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
Read Latest Telangana News and National News