Share News

NEET 2025 Results: అత్యధిక మార్కులు 686

ABN , Publish Date - Jun 15 , 2025 | 03:58 AM

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్‌ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ప్రతిసారీ టాపర్లలో నిలిచే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి టాప్‌-10లో ఒక్కరు కూడా చోటు దక్కించుకోలేకపోయారు.

NEET 2025 Results: అత్యధిక మార్కులు 686

  • ఈసారి నీట్‌ కఠినం.. తగ్గిన మార్కులు, ఉత్తీర్ణుల సంఖ్య

  • తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిరాశే.. టాప్‌-20లో ఇద్దరే.. టాప్‌-100లో 11 మంది

  • రాజస్థాన్‌ విద్యార్థి మహేశ్‌కుమార్‌కు టాప్‌ ర్యాంకు

  • హైదరాబాద్‌ విద్యార్థి కాకర్ల జీవన్‌ సాయికుమార్‌

  • 18వ ర్యాంకుతో దక్షిణాది రాష్ట్రాల్లోనే టాపర్‌

  • 19వ ర్యాంక్‌ సాధించిన ఏపీ విద్యార్థి కార్తీక్‌రామ్‌ కిరీటి

  • టాప్‌ ర్యాంకుల్లో బాలురు.. ఉత్తీర్ణతలో బాలికలు ముందు

  • జనరల్‌ కటాఫ్‌ 144 మార్కులు

రోజుకు 14 గంటల పాటు చదివా.. ‘ఆంధ్రజ్యోతి’తో జీవన్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్‌ పరీక్ష ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ప్రతిసారీ టాపర్లలో నిలిచే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈసారి టాప్‌-10లో ఒక్కరు కూడా చోటు దక్కించుకోలేకపోయారు. టాప్‌-20లో ఇద్దరే నిలవగా.. టాప్‌-100లో మాత్రం 11 మందికి ర్యాంకులు వచ్చాయి. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) శనివారం నీట్‌ ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 22.76 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 22.09 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 12.36 లక్షల మంది (56 శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే 79,322 మంది తక్కువ. ఈసారి నీట్‌ పరీక్ష కఠినంగా ఉండటం, ముఖ్యంగా ఫిజిక్స్‌ ప్రశ్నలు మరింత కఠినంగా రావ డంతో.. విద్యార్థులకు మార్కులు, ఉత్తీర్ణులైన వారి సంఖ్య తగ్గాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో నీట్‌లో టాపర్లకు గరిష్టంగా 720 వరకు కూడా మార్కులు రాగా.. ఈసారి టాప్‌ మార్కులు 686కే పరిమితం కావడం గమనార్హం. నీట్‌లో రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌కుమార్‌ మొదటి ర్యాంకు (99.9999547 పర్సంటైల్‌తో), మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్‌ రెండో ర్యాంకు (99.9999095 పర్సంటైల్‌), మహారాష్ట్రకు చెందిన క్రిషాంగ్‌ జోషి మూడో ర్యాంకు (99.9998189 పర్సంటైల్‌), ఢిల్లీకి చెందిన మృణాల్‌ కిశోర్‌ ఝా 4వ (99.9998189 పర్సంటైల్‌), ఢిల్లీకే చెందిన అవికా అగర్వాల్‌ 5వ ర్యాంకు (99.9996832 పర్సంటైల్‌) సాధించారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగంలో 56,000 ఎంబీబీఎస్‌ సీట్లు, ప్రైవేటు రంగంలో 52,000 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. డెంటల్‌, ఆయుర్వేదం, యునాని, సిద్ధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా నీట్‌ ర్యాంకులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈసారి జనరల్‌ క్యాటగిరీలో 144, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 113, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి 127 మార్కులను కటా్‌ఫగా నిర్ణయించారు.


గురుకుల విద్యార్థుల సత్తా..

తెలంగాణ ఎస్టీ గిరిజన గురుకుల విద్యార్థులు 538 మంది నీట్‌కు హాజరుకాగా.. వారిలో 306 మంది అర్హత సాధించినట్లు ఆ సంస్థ కార్యదర్శి సీతాలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. 8 మంది విద్యార్థులు ఎస్టీ కేటగిరీలో 2వేలలోపు ర్యాంకులు సాధించారని, 62 మంది 7వేల లోపు ర్యాంకులు సాధించారని వివరించారు. ఇక ఎస్సీ గురుకుల విద్యార్థులు కూడా నీట్‌లో మంచి ఫలితాలు సాధించారని ఆ సంస్థ కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు.

టాప్‌-100లో తెలుగు విద్యార్థులు 11 మంది..

నీట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మంది టాప్‌-100లో నిలిచారు. ఇందులో తెలంగాణ వారు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌ వారు ఆరుగురు ఉన్నారు. హైదరాబాద్‌ విద్యార్థి కాకర్ల జీవన్‌ సాయికుమార్‌ 18వ ర్యాంకుతో దక్షిణాది రాష్ట్రాల్లోనే టాపర్‌గా నిలిచాడు. తెలంగాణకు చెందిన షణ్ముఖ నిశాంత్‌ అక్షింతల 37వ ర్యాంకు, మంగరి వరుణ్‌ 46, యండ్రపాటి షణ్ముఖ్‌ 48, బిదిషా మాజీ 95వ ర్యాంకు సాధించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డి.కార్తీక్‌రామ్‌ కిరీటి 19వ ర్యాంకు, కె.మోహిత్‌శ్రీరామ్‌ 56వ, డి.సూర్యచరణ్‌ 59వ, పి.అవినాష్‌ 64వ, వై.సమీర్‌కుమార్‌ 70వ, టి.శివమణిదీప్‌ 92వ ర్యాంకు సాధించారు.


ప్రతిభ చూపిన విద్యార్థులు..

హైదరాబాద్‌ వైద్యుడు వంశీకృష్ణ కుమారుడు మంగరి వరుణ్‌ నీట్‌లో జాతీయస్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. తండ్రి ప్రోత్సాహంతో మంచి స్థానంలో నిలిచానని, ఢిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ చేస్తానని తెలిపారు. జాతీయస్థాయిలో 48వ ర్యాంకు (ఓబీసీ కేటగిరీలో 11) సాధించిన యండ్రపాటి షణ్ముఖ్‌ హనుమకొండకు చెందిన శ్యాంసుందర్‌- రజనీ దంపతుల కుమారుడు. మంచి ర్యాంకు సాధించడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం వైద్యుడు తూము రామకృష్ణ, నవ్య దంపతుల కుమార్తె వెన్నెల 307వ ర్యాంకు సాధించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ర్యాంకు సాధించగలిగానని, ఎంబీబీఎస్‌ చేసి ప్రజలకు సేవ చేస్తానని ఆమె చెప్పారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజపల్లి తండాకు చెందిన అజ్మీరా అశుతోష్‌ నీట్‌ ఎస్టీ కోటాలో 32వ ర్యాంకు (జనరల్‌ 5,422) సాధించారు. అశుతోష్‌ తల్లిదండ్రులు శాంత-లింగం ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు. వికారాబాద్‌ జిల్లా తాండూరు ఉపాధ్యాయుడు లక్ష్మీకాంతరావు-విద్యారాణి దంపతుల కుమారుడు హరీశ్‌ గౌతమ్‌ జాతీయ స్థాయిలో 660వ ర్యాంకు సాధించారు.


ర్యాంకుల్లో తక్కువ.. ఉత్తీర్ణతలో ఎక్కువ..

అమ్మాయిలు ఈసారి తక్కువ మందే టాప్‌ ర్యాంకులు సాధించారు. కానీ మొత్తంగా ఉతీర్ణుల సంఖ్యలో ఎక్కువగా నిలిచారు. టాప్‌-20లో ఇద్దరు, టాప్‌-50లో ఐదుగురు అమ్మాయిలే ర్యాంకులు సాధించారు. అదే ఉత్తీర్ణుల్లో అమ్మాయిలు 7,22,462 మందిఉండగా.. అబ్బాయిలు 5,14,063 మాత్రమే. మహిళా కేటగిరీలో హైదరాబాద్‌ అమ్మాయి బిదిషా మాజీ13వ స్థానం (జనరల్‌ 95), బ్రాహ్మణి రెండ్ల 17వ స్థానం (జనరల్‌ 108) సాధించారు. ఢిల్లీకి చెందిన అవికా అగర్వాల్‌ జాతీయస్థాయిలో 5వ ర్యాంకుతో మహిళల్లో టాపర్‌గా నిలిచారు. ఢిల్లీకే చెందిన ఆషి సింగ్‌ 12వ ర్యాంకుతో రెండో స్థానంలో ఉన్నారు. మహిళల టాప్‌-20 ర్యాంకుల్లో ఢిల్లీ అమ్మాయిలు అత్యధికంగా 8 మంది, మహారాష్ట్ర నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు.

ఎన్ని మార్కులకు

ఏ ర్యాంకు..?

ఏ ర్యాంకు సాధించిన

వరకు మార్కులు

50,000 502

1,00,000 464

1.50,000 433

2,00,000 105

2,50,000 380

3,00.000 357

3,50,000 336

4,00,000 316

4,50,000 298

5,00,000 281

ఎందరు అభ్యర్థులకు

ఎన్ని మార్కులు?

మార్కులు అభ్యర్థుల సంఖ్య

144- 200 3,03,040

201- 250 1,98,346

251- 300 1,57,952

301- 350 1,26,935

351- 400 1,05,578

401- 450 88,239

451- 500 69,503

501- 550 39,521

551- 600 1,0658

601- 650 1,259

651- 686 73

కేటగిరీల వారీగా తెలుగు రాష్ట్రాల ర్యాంకులు..

  • ఓబీసీ క్యాటగిరీలో జాతీయ స్థాయిలో హైదరాబాద్‌కు చెందిన మంగరి వరుణ్‌ 10వ స్థానంలో (జనరల్‌ 46) నిలిచారు.

  • ఎస్సీ క్యాటగిరీలో తెలంగాణకు చెందిన రెడ్డిమల్ల శ్రీశాంత్‌ 3వ స్థానం (జనరల్‌ 147), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కరుమంచి విక్రాంత్‌ 9వ స్థానం(జనరల్‌ 262)లో నిలిచారు.

  • ఎస్టీ విభాగంలో తెలంగాణకు చెందిన పూజారి హాసిని 3వ స్థానం (జనరల్‌-377), బానోత్‌ ధీరజ్‌ కుమార్‌ 8వ స్థానం (జనరల్‌-1178), అజ్మీరా అశుతోష్‌ 32వ స్థానంలో (జనరల్‌ 5,422) నిలిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 03:58 AM