Share News

Miss World Contestants: హైదరాబాద్‌ ఆతిథ్యం అదుర్స్‌

ABN , Publish Date - May 14 , 2025 | 03:28 AM

తెలంగాణ రాష్ట్రం మిస్‌ వరల్డ్‌ -2025 పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేసింది. మిస్‌ వరల్డ్‌ పోటీదారులు, ప్రతినిధులు హైదరాబాద్‌ ఆతిథ్యంతో మైమరిపోగా, ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని చెప్పారు.

Miss World Contestants: హైదరాబాద్‌ ఆతిథ్యం అదుర్స్‌

  • అందాల భామలకు చౌమహల్లా ప్యాలెస్‌ లో ప్రభుత్వ విందు

  • మిస్‌వరల్డ్‌ పోటీదారులను మైమరిపించిన తెలంగాణ రుచులు

  • కుటుంబసమేతంగా విచ్చేసిన సీఎం రేవంత్‌

  • హాజరైన మంత్రులు, సినీ నటుడు నాగార్జున

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): మిస్‌ వరల్డ్‌ -2025 పోటీదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ఘుమఘుమలాడే హైదరాబాద్‌ ప్రత్యేక వంటకాలను ఆరగించిన వివిధ దేశాల సుందరీమణులు, ప్రతినిధులు.. హైదరాబాద్‌ ఆతిథ్యం అదుర్స్‌ అన్నారు. హైదరాబాద్‌ ఆతిథ్యం, తెలంగాణ ప్రజల ఆదరణ తమను మైమరిపించిందని, ఈ పర్యటనను జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని పలువురు పేర్కొన్నారు. ఇక, ‘తెలంగాణ.. జరూర్‌ ఆనా’ నినాదాన్ని తమ దేశంలో వినిపిస్తామని చెప్పారు. మిస్‌వరల్డ్‌ పోటీదారులకు, ఆయా దేశాల ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలె్‌సలో మంగళవారం సాయంత్రం స్వాగత విందు ఏర్పాటు చేసింది. చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్‌ అనంతరం మిస్‌వరల్డ్‌ ప్రతినిధులు షాపింగ్‌ ముగించుకుని సమీపంలోని చౌమహల్లా ప్యాలె్‌సకు చేరుకున్నారు. వారందరికీ ప్యాలెస్‌ ప్రధాన ద్వారం వద్ద షెహనాయ్‌ సంగీతంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్యాలె్‌సలో హైదరాబాద్‌తో పాటు చార్మినార్‌, చౌమహల్లా ప్యాలెస్‌ తదితర చారిత్రాత్మక నిర్మాణాలు, కట్టడాలపై మిస్‌వరల్డ్‌ పోటీదారులకు వీడియో ప్రజంటేషన్‌ ఏర్పాటు చేశారు. నిజాం హయాంలో వినియోగించిన గద్దె ఇతర రాజ సంహాసనం, నిజాం పాలకులు వినియోగించిన వస్తు సామగ్రిని ప్యాలె్‌సలోని దర్బార్‌ హాల్‌లో ఉంచగా వాటిని అందాల భామలు పరిశీలించారు. 300 ఏళ్ల క్రితం అప్పటి హైదరాబాద్‌ అస్‌ఫజాహి పాలకులు నిర్మించిన నాలుగు ప్యాలె స్‌ల చరిత్ర (చౌమహల్లా) ప్రాశస్త్యాన్ని పర్యాటక శాఖ గైడ్లు వారికి వివరించారు. నిజాం పాలకులు, వారి కుటుంబసభ్యుల ఫొటోలను మిస్‌ వరల్డ్‌ పోటీదారులు, ప్రతినిధులు ఆసక్తిగా తిలకించారు. చౌమహల్లా ప్యాలెస్‌ అద్భుతమని ఈ సందర్భంగా పలువురు పోటీదారులు పేర్కొన్నారు. ఇక, చౌమహల్లా ప్యాలె్‌సలో జరిగిన ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు.


అలాగే, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ కూడా విందులో పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, సినీ నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేశ్‌ బాబు, మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా ప్రైజ్కోవా, వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో హిందూ, ముస్లిం సామరస్యత తనకు బాగా నచ్చిందని నమీబియా ప్రతినిధి పేర్కొన్నారు. ఇక, మిస్‌వరల్డ్‌ పోటీకి ఆతిథ్యం ఇవ్వడం వల్ల హైదరాబాద్‌ ప్రపంచ పటంలో నిలుస్తుందని నాగార్జున అన్నారు. ప లువురు పోటీదారులతో ఆయన మాట్లాడారు.

కళకళలాడిన చౌమహల్లా ప్యాలెస్‌

హైదరాబాద్‌లోని చౌమహల్లా ప్యాలెస్‌ దశాబ్దాల తర్వాత మంగళవారం కళకళలాడింది. హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత ప్రాభవం కోల్పోయిన చౌమహల్లా ప్యాలెస్‌.. మళ్లీ ఇన్నాళ్లకు మిస్‌ వరల్డ్‌ పోటీల వల్ల సందడిగా కనిపించింది. మిస్‌ వరల్డ్‌ పోటీదారులకు విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్యాలె్‌సకు మరమ్మతులు చేయించడంతోపాటు రంగులు కూడా వేయించింది. ఇక, విద్యుత్‌ దీపాల అలంకరణతో భవనం మెరిసిపోగా ప్యాలెస్‌కు పూర్వ వైభవం వచ్చినట్టు అయింది.

Updated Date - May 14 , 2025 | 03:28 AM