మోదీ ఒరిజినల్ బీసీ: ఆర్.కృష్ణయ్య
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:33 AM
ప్రధాని మోదీ ఒరిజినల్ బీసీ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మోదీ బీసీ కాదంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య తప్పని పేర్కొన్నారు.

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ ఒరిజినల్ బీసీ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. మోదీ బీసీ కాదంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్య తప్పని పేర్కొన్నారు. బీసీల్లో రెండు రకాలు ఉంటారని, మోదీ చేతివృత్తులవారికి(గాండ్ల) సంబంధించినవారని వివరించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన శాస్త్రీయంగా లేదని ఆరోపించారు. ఏ లెక్కన చూసినా రాష్ట్ర జనాభా 4 కోట్లపైబడి ఉంటుందని, ప్రభుత్వం మాత్రం 3.55కోట్లు జనాభానే చూపించిందని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందన్నారు.