KCR: కవితపై కేసీఆర్ నారాజ్!
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:01 AM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా కేసీఆరే తనకు ఏకైక నాయకుడని కవిత అంటున్నా.. గులాబీ బాస్ నుంచి ఆమెకు పిలుపు రాకపోవడానికి కారణం అదేనా..

పది రోజులైనా రాని పిలుపు
ఎవరేం చెప్పినా స్పందించని గులాబీ బాస్
పార్టీకి దూరం.. జాగృతితో ముందుకు
అనే వ్యూహంతో కవిత అడుగులు
ఆమె కార్యక్రమాల కట్టడి బాటలో పార్టీ
నేతలతో పాటు కార్యకర్తలూ జాగృతికి దూరం
బీఆర్ఎస్, జాగృతి మధ్య స్పష్టమైన విభజన
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన కూతురు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? కేసీఆరే తనకు ఏకైక నాయకుడని కవిత అంటున్నా.. గులాబీ బాస్ నుంచి ఆమెకు పిలుపు రాకపోవడానికి కారణం అదేనా? అంటే విశ్వసనీయ సమాచారం ప్రకారం అవుననే సమాధానమే వస్తోంది. గత కొద్దిరోజులుగా కవిత వ్యవహరిస్తున్న తీరు పట్ల కేసీఆర్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు తాను రాసిన లేఖను లీక్ చేసిన వారెవరో తేల్చాలని కవిత కోరుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కేసీఆర్కు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినా.. ఆయన మాత్రం ఈ పరిణామాలను ఒక కొలిక్కి తెచ్చే ఆలోచనలో లేరని అంటున్నారు. ‘‘కేసీఆర్కు ఎవరి మీదనైనా కోపం వస్తే ఇక అంతే. కలిసేది ఉండదు. ఇప్పుడు కవిత విషయంలోనూ ఆయన కోపంగానే ఉన్నారు, అందుకే ఆమెను పిలిచి మాట్లాడలేదు’’ అని బీఆర్ఎస్ నేత ఒకరు అన్నారు. వాస్తవానికి కవిత లేఖ బహిర్గతమై పది రోజులైంది. తొలి రెండు, మూడు రోజుల్లో కేసీఆర్ దీనిపై ఏమైనా స్పందిస్తారా? లేదంటే ఆమెను ఫామ్హౌ్సకు పిలిచి మాట్లాడతారా? అన్న చర్చ జరిగింది. కవిత కూడా తండ్రి నుంచి పిలుపొస్తే వెళ్దామనే ఉద్దేశంతో ఉన్నారని అప్పట్లో జాగృతి వర్గాలు పేర్కొన్నాయి. కానీ, కొన్ని విషయాలను ఆమె బహిరంగంగా లేవనెత్తడంతో ఆమెను పిలిచేందుకు కేసీఆర్ ప్రస్తుతానికి సానుకూలంగా లేరని అంటున్నారు. మరోవైపు ఎంపీ దామోదర్రావు, లీగల్ సెల్ అధ్యక్షుడు గండ్ర మోహన్రావు.. కవిత నివాసానికి వెళ్లి ఆమెతో చర్చలు జరపగా.. ఎందుకెళ్లారని వారిలో ఒకరిని కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలిసింది. అంటే.. వారంతట వారే చొరవ తీసుకుని వెళ్లారు తప్ప.. కేసీఆర్ పంపలేదని సమాచారం.
ఎవరేం చెప్పినా స్పందించని కేసీఆర్!
కవిత విషయాన్ని తన వద్ద ఎవరైనా ప్రస్తావించినా, ఏం చెప్పినా వినడం తప్ప.. దానిపై కేసీఆర్ ఏమీ స్పందించడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. తన నాయకత్వాన్ని కవిత సమర్థిస్తున్నా.. పార్టీ, కుటుంబ వ్యవహారాలను బహిర్గతం చేశారనే అసంతృప్తితో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె విషయంలో పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దని కూడా కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. జాగృతి వేదికగా కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కూడా బీఆర్ఎస్ క్యాడర్ వెళ్లకుండా పార్టీ అంతర్గత ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఇందిరాపార్కు వద్ద జరిగిన నిరసన కార్యక్రమానికి పార్టీ కింది స్థాయి కార్యకర్తలు కూడా ఎవరూ వెళ్లలేదు. తెలంగాణ జాగృతి మద్దతుదారులు మాత్రమే అందులో పాల్గొన్నారు. జాగృతి జెండాలు మాత్రమే కనిపించాయి. గతంలో పలు సందర్భాల్లో జాగృతి తరఫున కవిత కార్యక్రమాలు చేపట్టినప్పుడు పార్టీ కార్యకర్తలు కూడా కొందరు హాజరయ్యేవారు. ఆ కార్యక్రమం పార్టీకి చెందినదిగానే భావించేవారు. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ వేరు, జాగృతి వేరు అన్న భావన నెలకొందని రెండు వర్గాలూ అంటున్నాయి.
కవిత అడుగులు ఎటువైపు?
కవిత తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ప్రస్తుతానికి తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలనే నిర్ణయంతోనే ఉన్నారని సమాచారం. తండ్రి నుంచి పిలుపు వచ్చినా, రాకున్నా.. తన పని తాను జాగృతి ద్వారా చేసుకుపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన కార్యక్రమాల్లో జాగృతి జెండాలు, బ్యానర్లు తప్ప.. బీఆర్ఎ్సకు సంబంధించినవి ఎక్కడా లేకుండా చూసుకుంటున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలతోనే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ హాజరు కాకపోయినా.. కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోగలిగామని జాగృతి నేతలు అన్నారు. దీనిని బట్టి చూస్తే బీఆర్ఎ్సలో స్పష్టమైన విభజన వచ్చినట్లు కనిపిస్తోంది. కవిత సాంకేతికంగా గులాబీ పార్టీలో కొనసాగుతున్నా.. వ్యవహారాలు మాత్రం ఎవరికివారే యమునా తీరే అన్న రీతిలోనే నడుస్తున్నాయి. ఏదైనా ఒక కీలక పరిణామం జరిగే వరకు పరిస్థితి ఇదే రీతిలో ఉండే అవకాశాలున్నాయి.
ఇవీ చదవండి:
రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..
జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి