KCR: నీటి నిల్వ నిర్ణయం అధికారులదే
ABN , Publish Date - Jun 12 , 2025 | 03:18 AM
కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం అధికారులదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్కు తెలిపారు. పంప్హౌస్ హెడ్కు తాకేంతవరకు నీటిని వారే నిల్వ చేశారని చెప్పారు.

పంప్హౌస్ హెడ్కు తాకేంతవరకు నీటిని వారే నిల్వ చేశారు.. నేను ఆదేశాలివ్వలేదు
ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు రూ.280 కోట్ల నిధులు విడుదల చేశాం
వినియోగించే అధికారాలనూ వారికే ఇచ్చాం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం క్యాబినెట్దే
స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనదే.. నిధుల సమీకరణకే ఇరిగేషన్ కార్పొరేషన్
ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో రుణాలు చెల్లించాలనుకున్నాం
వివిధ కారణాల వల్ల సాధ్యం కాలేదు.. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్
మాజీ సీఎంపై కమిషన్ ప్రశ్నల వర్షం.. బహిరంగ విచారణపై కేసీఆర్ అభ్యంతరం
ముఖాముఖి విచారించిన జస్టిస్ ఘోష్.. 50 నిమిషాలపాటు కొనసాగిన విచారణ
హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్ర జ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలన్న నిర్ణయం అధికారులదేనని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్కు తెలిపారు. పంప్హౌస్ హెడ్కు తాకేంతవరకు నీటిని వారే నిల్వ చేశారని చెప్పారు. నీటి నిల్వకు తాను ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం తమ ప్రభుత్వ హయాంలో రూ.280 కోట్ల నిధులు విడుదల చేశామని, వాటిని వినియోగించే అధికారం కూడా అధికారులకు దఖలు పరిచామని వెల్లడించారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం నాటి మంత్రివర్గం తీసుకుందని, ప్రభుత్వ ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టామన్నారు. బ్యారేజీల కోసం స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికంగానే జరిగిందని తెలిపారు. కాళేశ్వరం నిర్మాణం కోసం నిధులు సమీకరించేందుకే ఇరిగేషన్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశామని, ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో ఆ రుణాలను తిరిగి చెల్లించాలనుకున్నామని వివరించారు. కానీ, వివిధ కారణాల వల్ల అది సాధ్యం కాలేదన్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ బుధవారం హాజరయ్యారు. అయితే విచారణకు ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓపెన్ కోర్టులో కేసీఆర్ను విచారించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేయగా.. తనకు తీవ్రంగా జలుబు ఉందని, గుంపులో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఓపెన్ కోర్టు విచారణ వద్దని చెప్పడంతో కమిషన్ అందుకు అంగీకరించింది. అప్పటిదాకా ఓపెన్ కోర్టులో కూర్చున్నవారందరితోపాటు కేసీఆర్కు తోడుగా వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయటికి పంపించింది. అనంతరం ముఖాముఖి విధానంలో కేసీఆర్ను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ 50 నిమిషాల పాటు కొనసాగింది. విచారణ సందర్భంగా ‘కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార’ పేరుతో ఇటీవల హరీశ్రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆంగ్ల ప్రతిని కమిషన్కు కేసీఆర్ అందజేశారు.
కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణ నిర్ణయం ఎవరిది? తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు ఏ కారణాలతో కట్టారు?
కేసీఆర్: కాళేశ్వరం బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం రాజకీయమైనదే అయినప్పటికీ.. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) తెలిపింది. అక్కడ 165 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని లేఖ రాసింది. అందులోనూ 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు వాటా ఉందని, ఆ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టుకుంటే 63 టీఎంసీల నీరు దిగువకు రావని చెప్పింది. మరోవైపు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చలు జరుపగా... బ్యారేజీని 148 అడుగులతో కట్టడానికే అనుమతిస్తామని చెప్పారు. 152 అడుగులతో బ్యారేజీ కడితే ముంపు ఉంటుందని, ఇందుకు అంగీకరింబోమని అన్నారు. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నిర్ణయం తీసుకున్నాం. దీనికన్నా ముందు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం సాధ్యం కాదని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని హైపవర్ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై వ్యాప్కో్సతోలైడార్ సర్వే చేయించగా.. మేడిగడ్డ వద్ద 282.3 టీఎంసీల నీటి లభ్యత ఉందని అందులో 230 టీఎంసీల నీటి వినియోగానికి మేడిగడ్డ వద్ద అవకాశం ఉందని నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం మంత్రివర్గం, ప్రభుత్వం ఆమోదంతో తీసుకున్నదే. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న సీడబ్ల్యూసీ లేఖలు, మహారాష్ట్ర అభ్యంతరాలతో రీఇంజనీరింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాం. ఇది అతిపెద్ద ప్రాజెక్టు. దీని నిర్మాణంలో 4వేల మంది ఇంజనీర్లు పనిచేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును 7 లింక్లుగా ప్రతిపాదించగా.. ఒక్క తుమ్మిడిహెట్టి బ్యారేజీ తప్ప.. మిగిలిన లింకులన్నీ ప్రాణహిత-చేవెళ్లలోనివే.
బ్యారేజీల్లో నీటి నిల్వకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు?
కేసీఆర్: ఆ నిర్ణయం అధికారులదే. కన్నెపల్లి(మేడిగడ్డ) వద్ద ఉన్న పంప్హౌస్ హెడ్కు నీరు అందేదాకా, సిరిపురం(అన్నారం) పంప్హౌస్ నుంచి మోటార్లు నడవడానికి నీరు అందేదాకా, కాశిపేట(సుందిళ్ల) పంప్హౌస్ హెడ్కు నీరు తాకేంతవరకు నీటిని అధికారులే నిల్వ చేశారు. నీటి నిల్వకు ఆదేశాలు ఇవ్వలేదు.
బ్యారేజీల వైఫల్యానికి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా ఒక కారణమా?
రాష్ట్రంలో ప్రాజెక్టుల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కోసం రూ.280 కోట్ల నిధులు విడుదల చేశాం. 2020 డిసెంబరు 28న జీవో నెం.45 ద్వారా మాన్యువల్ విడుదల చేశాం. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కు సరిపడా నిధులు రాష్ట్రంలో ఉన్నాయి. వాటి వినియోగించే అధికారాలను కూడా అధికారులకు దఖలు పరిచాం. గోదావరిలో భారీగా వరద వస్తున్నందున.. కట్టే ప్రాజెక్టులు నాలుగు కాలాలపాటు ఉండాలని కాళేశ్వరం బ్యారేజీల వద్దే ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశాం. నిర్మాణ పనులు నాణ్యతతో జరుగుతున్నాయా? లేదా? అని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ) స్థాయి అధికారి పరిశీలించేలా చర్యలు తీసుకున్నాం. క్వాలిటీ కంట్రోల్ విభాగం ప్రతివారం ప్రభుత్వానికి నివేదికలు సమర్పించేది. ఆ నివేదికల్ని కమిషన్ తెప్పించుకోవాలి.
బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు నిర్ణయం ఎవరిది?
బ్యారేజీల నిర్మాణ స్థలాల మార్పు వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా తీసుకున్నదే. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టలేమని నిర్ధారణకు వచ్చిన తర్వాత గోదావరిలో ఏయే ప్రాంతాలు బ్యారేజీ నిర్మాణానికి అనుకూలమని వ్యాప్కో్సతో సర్వే చేయించాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలు బ్యారేజీల నిర్మాణానికి అనుకూలమని వ్యాప్కోస్ నివేదిక ఇచ్చింది. అంతకుముందు హైపవర్ కమిటీ కూడా దీనికి సిఫారసు చేసింది. బ్యారేజీల స్థలాల ఎంపిక పూర్తిగా సాంకేతికమైనదే.
కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశమేంటి?
భారీ ప్రాజెక్టు కావడంతో నిధులు సమీకరించుకోవడానికి కాళేశ్వరం ఇరిగేషన్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశాం. నిధులను సమీకరించడంతోపాటు నిర్మాణ సంస్థలకు నిధుల చెల్లింపు బాధ్యతలు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్నదే. ఆ కార్పొరేషన్ తీసుకునే రుణాలకు ప్రభుత్వం పూచీ ఇచ్చింది. ప్రాజెక్టు వినియోగం ద్వారా సమకూరే నిధులతో ఆ రుణాలు చెల్లించాలని అనుకున్నాం. వివిధ కారణాలతో సాధ్యం కాలేదు.
పది మందిలో ఎందుకని..!
కాళేశ్వరం విచారణలో ఇప్పటిదాకా 114 మంది కోర్టు విట్నె్స(సీడబ్ల్యూ)గా హాజరుకాగా... వారినందరినీ ఓపెన్కోర్టులో కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అయితే కేసీఆర్ విషయంలో మాత్రం ముఖాముఖి విచారణ కే కమిషన్ అంగీకారం తెలిపింది. తొలుత ఓపెన్కోర్టు కావడంతో 20 మందికి పైగా జర్నలిస్టులు, 10 మంది దాకా అధికారులు, 9 మంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అయితే దాదాపు 40 మంది ముందు విచారణ ఎదుర్కోవడం ఇష్టంలేకే ముఖాముఖి విచారణను కేసీఆర్ కోరినట్లు సమాచారం. జ్వరంతోపాటు జలుబు ఉండటంతో ఎక్కువ మంది ఉన్న సమూహంలో ఇబ్బందికరంగా ఉంటుందని కేసీఆర్ కోరడంతో ముఖాముఖి విచారణకు కమిషన్ అంగీకారం తెలిపింది. ఇక 114వ కోర్టు విట్నె్సగా హాజరైన మాజీ మంత్రి టి.హరీశ్రావు మొత్తం 22 ప్రశ్నలకు 18 నిమిషాల్లో జవాబులు చెప్పగా... కేసీఆర్ మాత్రం ఐదారు ప్రశ్నలకు 50 నిమిషాలు తీసుకోవడం గమనార్హం.
ముగ్గురూ ముగ్గురే!
కాళేశ్వరం కమిషన్ ముందు 113వ కోర్టు విట్నె్సగా హాజరైనన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఏ జవాబులు చెప్పారో... 114వ కోర్టు విట్నె్సగా హాజరైన టి.హరీశ్రావు దాదాపుగా అవే సమాధానాలు చెప్పారు. తాజాగా కేసీఆర్ కూడా అవే జవాబులు చెప్పడంతో ముగ్గురూ ముగ్గురేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురికీ కమిషన్ ఏకకాలంలో నోటీసులు పంపగా.. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న కేసీఆర్, 6న ఈటల రాజేందర్, 9న హరీశ్రావు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆరోగ్యం బాగాలేనందున తాను 5వ తేదీన విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ కమిషన్కు నివేదించుకున్నారు. దీంతో 11వ తేదీన రావాలని కమిషన్ తదుపరి నోటీసులు పంపించింది. కానీ, ఈటల రాజేందర్, హరీశ్రావును విచారించాకే.. తాను విచారణకు హాజరు కావాలని కేసీఆర్ వేసిన ఎత్తుగడలో భాగంగానే ఇది జరిగిందని అంటున్నారు. కాగా, క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కావడానికి ముందు కేసీఆర్తో కమిషన్ ప్రమాణం చేయించింది. ఈ సందర్భంగా ఆయన ‘భగవంతుడిపై ప్రమాణం చేసి... నేను చెప్పేవన్నీ నిజాలే. నిజం తప్ప మరేమీ కాదు’ అని అన్నారు.
తొలిసారి కమిషన్ ముందుకు
కేసీఆర్ తొమ్మిదినరేళ్లపాటు సీఎంగా ఉండగా... రెండు ద శాబ్దాల కాలంలో ఒక కమిషన్ ముందు కేసీఆర్ హాజరుకావడం ఇదే తొలిసారి. కాగా, కేసీఆర్కు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో బుధవారం బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్కే భవన్కు తరలివచ్చాయి. దాంతో పోలీసులు ఉదయం 7 గంటల నుంచే అక్కడ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. విచారణ మొదలైనప్పటి నుంచి కేసీఆర్ కమిషన్ కార్యాలయం నుంచి వెళ్లేదాకా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ... నిరసన తెలిపారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ బీఆర్కే భవన్ ముందు నిరసనలకు నాయకత్వం వహించగా.. మాజీ మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి కేసీఆర్ వెంట ఉన్నారు.
ఇవి కూడా చదవండి
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
ఎస్ఎస్ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..