Share News

K Kavitha: పార్టీ మీ జాగీరా?

ABN , Publish Date - May 26 , 2025 | 04:25 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు.. ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ వ్యవహారం, కేసీఆర్‌ చుట్టూ దయ్యాలున్నాయన్న ఆమె వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజురోజుకూ మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి.

K Kavitha: పార్టీ మీ జాగీరా?

  • మీరేమైనా గుత్త పట్టారా?.. అక్కకు హక్కులు లేవా?

  • కవితకు మద్దతుగా సోషల్‌ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టులు

  • కవితకు మద్దతుగా సోషల్‌ మీడియాలో ఆమె సన్నిహితుల పోస్టులు

  • కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శనాస్త్రాలు

  • కుట్రలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నలు

  • ‘వుయ్‌ స్టాండ్‌ విత్‌ కవితక్క’ పేరుతో సర్క్యులేట్‌

  • చివరన ‘జై తెలంగాణ.. జై కేసీఆర్‌’ నినాదం

  • రెండు రోజులైనా కేసీఆర్‌ నుంచి రాని పిలుపు!

  • అధినేత నిర్ణయంపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ

  • కేసీఆర్‌తో కేటీఆర్‌ భేటీపై ఆసక్తికర చర్చ

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు.. ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ వ్యవహారం, కేసీఆర్‌ చుట్టూ దయ్యాలున్నాయన్న ఆమె వ్యాఖ్యలు ఆ పార్టీలో రోజురోజుకూ మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి. కవితకు మద్దతుగా వాట్సాప్‌, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పోస్టులు ఆమెకు వ్యతిరేకంగా కూడా వస్తున్నాయి. అయితే ఆదివారం.. కవితకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు పెట్టిన పోస్టు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ ఆ పోస్టు ఉంది. పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలన్న కేటీఆర్‌.. పార్టీకి వ్యతిరేకంగా బహిర్గతంగా మాట్లాడిందెవరో చెప్పాలని అందులో పేర్కొన్నారు. కవిత రాసిన లేఖను ఎవరు బహిర్గతం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనపై కుట్రలు జరుగుతున్నాయని, పార్టీ స్పందించాలని కవిత అన్నప్పుడు కేటీఆర్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ప్రజాస్వామ్యయుతమైన పార్టీ అని, అందరికీ స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన కేటీఆర్‌.. సమన్యాయం ఎందుకు పాటించడం లేదని నిలదీశారు.


కేటీఆర్‌పై, హరీశ్‌రావుపై ఆరోపణలు వస్తే కేసులు వేసేందుకు ముందుండే పార్టీ.. కవిత విషయంలో ఎందుకు అంటీముట్టనట్లు వ్యవహరించిందని ప్రశ్నించారు. పెద్దవారిపై జరుగుతున్న కుట్రలపైనే స్పందించకపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితేంటని నిలదీశారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మీకు ఎలాంటి బాధ్యతలు లేవా? అని ఆ పోస్టులో ప్రశ్నించారు. పార్టీలో కుట్రలు చేసేవారిని, అంతర్గత విషయాలను బహిర్గతం చేసేవారిని వదిలి.. లేఖ రాసిన వారిని, కుట్రలు ఎదుర్కొంటున్న వారిని అనడంలో కేటీఆర్‌ ఉద్దేశమేంటో చెప్పాలన్నారు. ‘‘కేటీఆర్‌ చాలా హుషారుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ ఏమైనా మీ జాగీరా? గుత్త పట్టారా? అక్కకు హక్కులు లేవా?’’ అని నిలదీశారు. ఈ పోస్టును ఉద్యమకారులు, కవితకు అత్యంత సన్నిహితులైన వారందరికీ పంపించారు. ‘తెలంగాణ విత్‌ కవితక్క’, ‘వియ్‌ స్టాండ్‌ విత్‌ కవితక్క’ పేరుతో సర్క్యులేట్‌ చేశారు. చివరిగా ‘జై తెలంగాణ.. జై కేసీఆర్‌’ నినాదంతో ముగించారు. కాగా, ఈ పోస్టుపై కూడా బీఆర్‌ఎస్‌ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.


కవిత ప్రమేయం లేకుండా, ఆమె అనుమతి లేకుండా పోస్టు చేసే ధైర్యం అత్యంత సన్నిహితులు చేయబోరని అంటున్నారు. మరోవైపు కవిత ధోరణి, వ్యవహరశైలి చూస్తుంటే.. పార్టీలో ఇక కొనసాగలేరేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మాత్రం కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని చెబుతున్నారు. తాను రాసిన లేఖపై కవిత స్పష్టత ఇచ్చి రెండు రోజులైనా.. ఈ అంశంపై పార్టీ అధినేత కేసీఆర్‌ ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఈ పరిణామాలు ఎటువైపునకు దారి తీస్తాయోనని గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అసలు కవితను కేసీఆర్‌ పిలిచి మాట్లాడతారా? లేదా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ శ్రేణుల్లో ఈ ఆసక్తి ఎక్కువగా పెరుగుతోంది. అయితే ‘సామాజిక తెలంగాణ రావాలి’ అంటూ కవిత గతంలో చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్‌ కొంత ఆగ్రహంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా విషయంలో తనతో విభేదిస్తే కేసీఆర్‌కు నచ్చదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అటువంటి వ్యక్తుల ముఖం చూడటానికి కూడా ఇష్టపడరని అంటున్నారు. ప్రస్తుతం కవితకు కూడా బహుశా అదే పరిస్థితి ఉండవచ్చని చెబుతున్నారు.


కొన్ని సందర్భాల్లో కేసీఆర్‌ వేచిచూసే ధోరణి అవలంబిస్తుంటారని, తొందరపడి స్పందించరని అంటుంటారు. స్పందిస్తే వారికి అనవసర ప్రచారం కల్పించినట్లు అవుతుందని, వారిని ప్రజల్లో పెద్దవాళ్లను చేశామన్న భావన కలుగుతుందన్న ధోరణిలో కేసీఆర్‌ ఉంటారని చెబుతుంటారు. మరోవైపు శనివారం ఎర్రవల్లి ఫామ్‌హౌ్‌సలో కేసీఆర్‌తో ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీ అయ్యారు. మధ్యాహ్నం అక్కడికి వెళ్లిన కేటీఆర్‌.. సాయంత్రం వరకు కేసీఆర్‌తోనే ఉన్నారు. ఆ సందర్భంలో పార్టీలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలకు తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటి పరువు రచ్చకెక్కడంతో డ్యామేజ్‌ కంట్రోల్‌ ఎలా చేస్తారా.. అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. కవిత అంశంపై ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్‌ పెట్టకపోతే అనవసరంగా విపక్షాలకు ఆయుధాలను ఇచ్చినట్లవుతుందని పార్టీ సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. త్వరగా డ్యామేజ్‌ కంట్రోల్‌ చేయకుంటే మున్ముందు ఈ అంశాన్ని అధికార, విపక్షాలు సీరియల్‌గా సాగదీసే అవకాశం ఉందని అంటున్నారు.


ఇవి కూడా చదవండి

Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్

ponnam prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం

Updated Date - May 26 , 2025 | 05:56 AM