Telangana Road Projects: రూ.60,799 కోట్లతో కొత్త రోడ్లు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:36 AM
తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో తెలంగాణ బహుళజాతి సంస్థల కేంద్రంగా మారబోతోందని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 8: రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి సర్కార్ (Telangana Govt) శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.60,799 కోట్లతో రోడ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిధుల మంజూరు సర్కార్ ఆమోద ముద్ర వేసింది. రహదారుల నిర్మాణానికి నిధుల మంజూరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు (Deputy CM Bhatti Vikramarka) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ధన్యవాదాలు తెలియజేశారు.

తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని రికార్డుగా అభివర్ణించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో తెలంగాణ బహుళజాతి సంస్థల కేంద్రంగా మారబోతోందని తెలిపారు. హైదరాబాద్ – విజయవాడ హైవే విస్తరణకు రూ.10,400 కోట్లు కేటాయించడం జరిగిందని... దీనిని ఎనిమిది లైన్లుగా మార్పు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి రూ.36,000 కోట్లు మంజూరు అయ్యిందని.. ఇది రాష్ట్రానికి గేమ్చేంజర్ ప్రాజెక్ట్ అని వెల్లడించారు.
రహదారులు లేని గ్రామాల్లో కొత్త రోడ్లు, సింగిల్ రోడ్ల స్థానంలో డబుల్ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. హెచ్ఏఎమ్ ప్రాజెక్ట్ కోసం రూ. 11,399 కోట్లు కేటాయించడం జరిగిందని.. ఇందు కోసం త్వరలోనే టెండర్లను పిలువనున్నట్లు చెప్పారు. మన్ననూరు – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ 52 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి రూ. 8,000 కోట్లు కేటాయించడం జరిగిందని... అలాగే ఫ్యూచర్ సిటీ– అమరావతి – బందరు పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూ.20,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో పెళ్లి కారు బీభత్సం.. ముగ్గురు స్పాట్డెడ్
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన..
Read Latest Telangana News And Telugu News