Share News

Banakacherla Project: బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్

ABN , Publish Date - Jun 06 , 2025 | 03:06 PM

గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జలవిధానానికి విరుద్ధమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించదని తేల్చి చెప్పారు.

Banakacherla Project: బనకచర్లపై ఘాటుగా స్పందించిన మంత్రి ఉత్తమ్
TG Minister Uttam Kumar Reddy

హైదరాబాద్, జూన్ 06: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్‌పై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పందించారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బనకచర్లతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, సెంట్రల్ వాటర్ కమిషన్, అపెక్స్ కౌన్సిల్ నిబంధనలకు బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి విరుద్ధమని స్పష్టం చేశారు. అంతేకాదు.. అంతర్రాష్ట్ర జల విధానానికి సైతం ఈ ప్రాజెక్ట్ విరుద్ధమన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని ఆయన పునరుద్ఘాటించారు.


ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఈ బనకచర్ల ప్రాజెక్ట్ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు వేర్వేరుగా లేఖల ద్వారా వివరించామని ఆయన గుర్తు చేశారు. అయితే తమకు ఏపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. ఒక వేళ వస్తే అన్ని నిబంధనలను పరిశీలిస్తామంటూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గత నెలలో లేఖ ద్వారా స్పష్టం చేశారని వివరించారు.


అలాగే ఈ అంశంపై చట్టప్రకారం ముందుకు వెళ్తామని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తమకు హామీ ఇచ్చారన్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో ఏపీ ఉల్లంఘనలను పూర్తిగా సదరు లేఖల్లో సమగ్రంగా వివరించామని చెప్పారు. ఇక కేంద్రం చట్ట విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తుందని అయితే తాము అనుకోవడం లేదన్నాని చెప్పారు. తెలంగాణకు అన్యాయం జరిగితే.. తాము ఎంత వరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. హక్కుల కోసం తెలంగాణ ప్రభుత్వం రాజీ లేని పోరాటం చేస్తుందన్నారు. ఈ అంశంలో వెనక్కి తగ్గేదే లేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంలో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు జోక్యం చేసుకుని కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.


కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరుగుతుంటే గత పదేళ్లుగా బిఆర్ఎస్ పార్టీ సహకరించిందని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వాటా 724 టీఎంసీ.. ఏపీకి వెళితే.. విభజన అనంతరం బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1,254 టీఎంసీల కృష్ణ జలాలు ఏపీకి తరలించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో వృథా ఖర్చు చేయకుంటే.. కృష్ణా ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు.


తుమ్మిడిహట్టి దగ్గర కాకుండా.. మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా రూ. 68 వేల కోట్లు కాళేశ్వరం నిర్మాణానికి అదనపు ఖర్చు అయ్యిందన్నారు. కృష్ణా జలాల అంశంలో తెలంగాణకు అన్యాయం చేసింది బిఆర్ఎస్ పార్టీ కాదా? అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. 512 టీఎంసీ ఏపీకి.. తెలంగాణకు 299 టీఎంసీ కేటాయించాలంటూ సంతకం పెట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం కదా ? అని ఆయన సూటిగా ఆ పార్టీ నేతలను నిలదీశారు. బీఆర్ఎస్ నేతలు అప్పుడు మోసం చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారంటూ ఆ పార్టీ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు.

ఈ వార్తలు కూడా చదవండి..

రెచ్చిపోయిన కామాంధులు.. బాలికపై సామూహిక అత్యాచారం

చినాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై సీఎం చంద్రబాబు ట్వీట్

For Telangana News And Telugu News

Updated Date - Jun 06 , 2025 | 05:21 PM