Share News

TGSRTC Strike: మంత్రి పొన్నం చర్చలు సఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా..

ABN , Publish Date - May 06 , 2025 | 03:30 PM

TGSRTC Strike Postponed : ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి జరగాల్సిన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది.

TGSRTC Strike: మంత్రి పొన్నం చర్చలు సఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా..
Minister Ponnam Prabhakar

TGSRTC Strike Postponed : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె (RTC Strike) వాయిదా పడింది. రేపటి నుంచి సమ్మె చేయాలని నిశ్చయించుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులతో రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జేఏసీ నేతల డిమాండ్లను సమ్మతి తెలపడంతో ప్రస్తుతానికి సమ్మె విరమించుకున్నట్లు వారు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో లోకేశ్ కుమార్‌, కృష్ణభాస్కర్‌, నవీన్‌ మిత్తల్‌ ఉంటారు. కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా పరిష్కారం చూపాలని సర్కార్ ఆదేశాలిచ్చింది.


తమ డిమాండ్లను తీర్చకపోతే ఈ నెల మే 7వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వెంటనే ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పుంజుకుంటున్న ఆర్టీసీని సమ్మె ద్వారా దెబ్బతీయవద్దని కోరింది. అలా కాకుండా మొండిగా సమ్మెకు దిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు చేయడం నిషేధం. ఇదిలా ఉంటే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉద్యోగులతో జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. తమ డిమాండ్లకు మంత్రి సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగ సంఘాలు సమ్మెను వాయిదా వేసుకున్నాయి.


ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె వాయిదా వేస్తున్నట్లు సచివాలయం మీడియా పాయింట్ వద్ద వెల్లడించారు. ప్రభుత్వంతో సుధీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమయ్యామని ప్రకటించారు. పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావులతో అనేక అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ యూనియన్ లపై ఆంక్షల తొలగింపు, అన్ని కేటగిరీల్లో ఖాళీ భర్తీ, గుర్తింపు ఎన్నికల నిర్వహణ, కారుణ్య నియామకాలు , ఉద్యోగ భద్రతపై సర్క్యూలర్, నేరుగా ఆర్టీసీకే ఎలక్ట్రిక్ బస్సులు, 2025 నుంచి రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపులు, 2017లో రిటైర్ అయిన వారికి వేతన సవరణ ప్రకారం బెనిఫిట్స్ వంటి డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే 2019 లో సమ్మె కాలంలో ఉద్యోగులపై వేసిన పోలీస్ కేసులను మాఫీ, ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం చేయాలని కోరినట్లు వెల్లడించారు. తమ అని డిమాండ్లను విడతల వారీగా పరిష్కరిస్తామని సర్కార్ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.


Read Also: Minister Ponguleti: తెలంగాణ అప్పులకు కారణమిదే.. మంత్రి పొంగులేటి హాట్ కామెంట్స్

Saraswati Pushkaralu: ఈ నెల 15 నుంచి సరస్వతి పుష్కరాలు

BRS: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్..

Updated Date - May 06 , 2025 | 04:04 PM