Condolences: మాగంటి మృతి పట్ల ప్రముఖుల సంతాపం
ABN , Publish Date - Jun 08 , 2025 | 08:53 AM
Condolences: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అన్నారు.

Hyderabad: బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Senior Leader), జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) మృతిపట్ల ప్రముఖులు సంతాపం (Tribute) వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు (CM Chandrababu) మాట్లాడుతూ.. ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అన్నారు. గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైందని, ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా పని చేశారని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచిన గోపీనాథ్ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, మాగంటి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు..
ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. గోపినాథ్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మాగంటి కింది స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అని.. ఎమ్మెల్యేగా ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియజేశారు.
తీవ్ర విచారం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. గోపీనాథ్ గుండెపోటుతో కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల తలలో నాలుకగా మారారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. మాగంటి కుటుంబ సభ్యులకు, కార్యకర్తలకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కిషన్ రెడ్డి ప్రకటించారు.
మాగంటి మరణం అత్యంత బాధాకరం..
బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం అత్యంత బాధాకరమని.. ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నానని, మాగంటి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గోపీనాథ్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని.. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన జీవితం ఆదర్శమని అన్నారు. గోపీనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని హరీష్ రావు అన్నారు.
కాగా బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారు జామున మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. మరికాసేపట్లో మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలించనున్నారు.
ఇవి కూడా చదవండి:
మాగంటి మృతి పట్ల కేసీఆర్ సంతాపం..
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి
For More AP News and Telugu News