Share News

Mahesh Kumar Goud: ఈటెల వ్యాఖ్యలు వ్యక్తిగతమా? బీజేపీ విధానమా?.. టీపీపీసీ చీఫ్ సూటి ప్రశ్న

ABN , Publish Date - Jun 06 , 2025 | 04:15 PM

Mahesh Kumar Goud: కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని... వేల కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో ప్రధాని సహా పలువురు అనేక సార్లు ఆరోపణలు చేశారని మహేష్ కుమార్ గుర్తుచేశారు. కానీ ఈటెల అందుకు భిన్నంగా కమిషన్ ఎదుట ఇచ్చిన వివరణను చూస్తే కేసీఆర్‌తో కుమ్మక్కైనట్లు స్పష్టమైందని ఆరోపించారు.

Mahesh Kumar Goud: ఈటెల వ్యాఖ్యలు వ్యక్తిగతమా? బీజేపీ విధానమా?.. టీపీపీసీ చీఫ్ సూటి ప్రశ్న
TPCC Chief Mahesh Kumar Goud

హైదరాబాద్, జూన్ 6: కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ (BJP MP Etela Rajender) చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి విచారణ అనంతరం ఈటెల వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ తప్పేమీ లేదన్నట్లుగా, అంతా కేబినెట్ నిర్ణయం మేరకే జరిగిందని బుకాయిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ధిక మంత్రిగా ఉన్న వ్యక్తి ప్రాజెక్టు నిధులతో తనకు సంబంధమే లేదని అనడం హాస్యాస్పదమని వ్యాఖ్యలు చేశారు. దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కోడై కూసిందన్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని... వేల కోట్ల అవినీతి జరిగిందంటూ గతంలో అనేక సార్లు ప్రధాని సహా పలువురు ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. కానీ ఈటెల అందుకు భిన్నంగా ఈరోజు కమిషన్ ఎదుట ఇచ్చిన వివరణను చూస్తే కేసీఆర్‌తో కుమ్మక్కైనట్లు స్పష్టమైందన్నారు. కాళేశ్వరంలో ఈటెలకు కూడా వాటాలు ముట్టినందునే కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై పల్లెత్తు మాట కూడా విచారణ కమిషన్ ఎదుట ఎందుకు చెప్పలేదని ఈటెలను ప్రశ్నించారు. ప్రజలు, రైతుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను పెంచినట్లు ఈటెల చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. ఈటెల ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నట్లుందని అన్నారు. కేసీఆర్‌ను కాపాడేందుకు పూర్తిగా వకాల్తా పుచ్చుకుని వివరణ ఇచ్చినట్లు ఎంపీ మాటల ద్వారా కన్పిస్తోందన్నారు.


పక్కా ప్రీ ప్లాన్ ప్రకారం కేసీఆర్, హరీష్ రావు, ఈటెల కూడబలుక్కుని ఒక్కటే సమాధానాలు చెప్పాలని, అవినీతి జరగలేదని బుకాయించేందుకు సిద్ధమై వచ్చి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల వ్యాఖ్యలు చూస్తుంటే హరీష్ రావుతో ఆయన రహస్యంగా భేటీ అయ్యారని తాను చెప్పిన మాటలు నిజమని తేలిందన్నారు. టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రాజెక్టు కట్టారని చెబుతున్నారన్నారు. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని మొత్తుకున్న బీజేపీ నాయకులు ఇప్పుడ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌తో బీజేపీకి ఉన్న లోపాయికారి ఒప్పందం మేరకే కేసీఆర్‌ను కాపాడేందుకు ఈటెలతో వివరణ ఇప్పించారా అని నిలదీశారు. దీనిపై బీజేపీ నాయకత్వం సమాధానం చెప్పాలన్నారు. లేదంటే ప్రధాని సహా బీజేపీ పెద్దలకు కూడా వాటాలు ముట్టినట్లే అని.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలంతా భావించాల్సి వస్తుందన్నారు.


‘కాళేశ్వరం విషయంలో బీజేపీ తన పంథా మార్చుకుందా? ఈటెల ఇచ్చిన వివరణ ఆయన సొంతమా? లేక బీజేపీ విధానమా? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీజేపీ చెబుతుంటే... అసలు అవినీతే జరగలేదని మాట్లాడుతున్న ఈటెలపై చర్యలు తీసుకునే దమ్ముందా? కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించేందుకు సిద్ధమా?’ అంటూ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.


ఇవి కూడా చదవండి

మెడపై తుపాకీ పెట్టినా నిజాలే చెబుతా.. కమిషన్ విచారణపై ఈటెల

ఉత్తమ్ ఏం చెప్పినా అబద్ధమే.. హరీష్ ఆగ్రహం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 06 , 2025 | 05:04 PM