Miss World 2025: ఫైనల్స్.. అదుర్స్
ABN , Publish Date - Jun 01 , 2025 | 02:59 AM
మిస్ వరల్డ్ పోటీల ముగింపు కార్యక్రమం అదుర్స్ అనిపించింది. దాదాపు నెల రోజులుగా వివిధ రకాల పోటీలు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అందాలభామల పర్యటనలతో అలరించిన 72వ ప్రపంచ సుందరి పోటీల ముగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

ఘనంగా ప్రపంచ సుందరి ముగింపు వేడుకలు
సీఎం రేవంత్, మంత్రులు, చిరంజీవి హాజరు
హైదరాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): మిస్ వరల్డ్ పోటీల ముగింపు కార్యక్రమం అదుర్స్ అనిపించింది. దాదాపు నెల రోజులుగా వివిధ రకాల పోటీలు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అందాలభామల పర్యటనలతో అలరించిన 72వ ప్రపంచ సుందరి పోటీల ముగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శనివారం హైదరాబాద్లోని హైటెక్స్లో తుది పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల వెలుగులో.. అందాల తారల ర్యాంప్వాక్తో పోటీలు మొదలయ్యాయి. ఈ పోటీల్లో తెలంగాణ ప్రత్యేకమైన గుస్సాడి నృత్యం, గిరిజన జాతరలు, బోనాల సందడి, ఆదిలాబాద్ అడవులు, జోడేఘాట్లోని కొమురం భీమ్ మ్యూజియం, జలపాతాలు, చార్మినార్, బుద్ధవనం, చౌమహల్లా ప్యాలెస్, యాదాద్రి, రామప్ప ఆలయాలు, గోల్కొండ, పలు హస్తకళలు, చేనేత వస్త్రాల తయారీతోపాటు మరికొన్నింటిని వీడియో రూపంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ‘తెలంగాణ జరూర్ ఆనా’ లోగో అందరినీ ఆకర్షించింది. పోటీల మధ్యలో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ కట్టర్ చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది. పోటీల్లో చివరి రౌండ్ ముగిసిన అనంతరం ప్రపంచ సుందరిగా ఎంపికైన థాయ్లాండ్ భామ ఓపల్ సుచాతకు మిస్వరల్డ్ కిరీటాన్ని అలంకరించడంతో పోటీలు ముగిశాయి. సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం సరిగ్గా ముందుగా నిర్దేశించుకున్న 9.30 గంటలకే ముగిసింది. కాగా, కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సతీమణి గీతారెడ్డి, కుమార్తె నైమిషతో కలిసి హాజరవగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, టాలీవుడ్ సినీపరిశ్రమ నుంచి ప్రముఖ నటులు చిరంజీవి, విజయ్ దేవరకొండ, నిర్మాత్, ఫిల్మ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు హాజరయ్యారు.
సోనుసూద్కు ప్రపంచ మానవతావాది పురస్కారం..
ప్రముఖ నటుడు సోనుసూద్కు మిస్వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రపంచ మానవతావాది పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఈ పురస్కారాన్ని ఆయనకు ప్రముఖ నటుడు రానా అందించారు. కరోనా సమయంలో సోనుసూద్ చేసిన పలు మానవతా చర్యలకు గుర్తింపుగా ఈ అవార్డును అందించినట్టు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు ప్రకటించారు. కాగా తెలుగు సినిమా తనకు చాలా గుర్తింపునిచ్చిందని సోనుసూద్ చెప్పారు. తనకు అవార్డును అందించిన మిస్వరల్డ్ ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ‘‘వదల బొమ్మాళీ’’ అంటూ అరుంధతి సినిమాలో తాను చెప్పిన డైలాగ్ను స్టేజీపై చెప్పడంతో ప్రేక్షకులు కేకలు వేశారు.
పాసుల ప్రహసనం..
ప్రపంచ సుందరి ముగింపు పోటీలకు పర్యాటక శాఖ చాలా తక్కువ మందికే పాసులు అందించింది. మొత్తం మూడు రకాల పాసులు జారీ చేసింది. అయితే పోటీలకు ఒక్కరోజు ముందుగానైనా ఇవ్వకుండా పోటీలు ప్రారంభమయ్యే శనివారం ఉదయం నుంచే పాసులు ఇవ్వడంతో కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు సమయానికి పాసులు అందకపోవడంతో.. చాలామంది కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చారు. ఇచ్చిన పాసుల కంటే ప్రేక్షకులు ఎక్కువగా రావడంతో స్టేజీకి ముందున్న ప్రముఖుల గ్యాలరీతోపాటు వెనుకవైపున్న మరో గ్యాలరీ వద్ద చాలామంది నిలబడేపోటీలను చూడాల్సివచ్చింది. పాసులకు సరిపడా సీట్లు లేకుండా పాసులు ఎలా జారీ చేశారంటూ నిలబడిన వారంతా చర్చించుకున్నారు. కాగా, సోమవారం మిస్ వరల్డ్ విజేత.. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ కానున్నారు. అదే రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మిస్ వరల్డ్ విజేతతోపాటు ముగ్గురు ఫైనలిస్టు రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు.
ఇవి కూడా చదవండి
జగన్ ప్రభుత్వంలో రేషన్ సరుకుల అక్రమాలపై విచారణ చేశాం
ఆపరేషన్ సిందూర్పై కామెంట్లు.. లా స్టూడెంట్ అరెస్ట్..