Hyderabad Development: హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - May 05 , 2025 | 04:26 AM
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఓల్డ్సిటీ మెట్రో, ఫ్లైఓవర్లు, ఎస్టీపీలు, మిస్ వరల్డ్ ఏర్పాట్లపై సమీక్షించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు

ఓల్డ్సిటీ మెట్రో వేగవంతానికి అదనపు నిధులిస్తాం
ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ
అన్నిశాఖల సమన్వయంతో సక్సెస్ చేస్తాం: సీఎస్
హైదరాబాద్ సిటీ, మే 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన రాజధాని నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. సీఎ్సగా బాధ్యతలు చేపట్టాక ఆయన హైదరాబాద్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రామకృష్ణారావు మాట్లాడుతూ సీఎం రేవంత్ ఆదేశాల మేరకే నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఓల్డ్సిటీ మెట్రో రైలు మార్గ నిర్మాణ పనుల వేగవంతానికి అదనపు నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్డీపీ) ద్వారా జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న ఫ్లైఓవర్, ఇతర మౌలిక సదుపాయాల పనుల్లో వేగం పెంచాలని అధికారులను రామకృష్ణారావు ఆదేశించారు. జలమండలి నిర్మిస్తున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ)ను త్వరలో అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోపాటు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తొలుత బంజారాహిల్స్లోని జీవీకే మాల్ వద్ద రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని రామకృష్ణారావు పరిశీలించారు. అటుపై ఓల్డ్ సిటీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకూ 7.5 కి.మీ పొడవునా చేపట్టిన మైట్రోరైలు కారిడార్ విస్తరణ పనులను పరిశీలించారు. ఈ మార్గంలో గల సుమారు 105 మతపరమైన, చారిత్రక, ఇతర సున్నితమైన కట్టడాలకు హాని కలుగకుండా కూల్చివేతలు చేపట్టినట్లు సీఎస్కు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. మైట్రోరైల్ ప్రాజెక్టు రెండోదశలో పార్ట్-బీ కారిడార్లకు త్వరలోనే ఆమోదం లభిస్తుందని సీఎస్ చెప్పారు. హెచ్ఎండీఏ నిధులతో హుస్సేనీ ఆలంలోని ఖుర్షీద్ ఝా దేవిడీ హెరిటేజ్ భవన కన్వరేషన్ పునరుద్ధరణ, మరమ్మత్తుతోపాటు ఫలక్నుమాలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ), ఫలక్నుమా ఫ్లైఓవర్ నుంచి నల్లగొండ ఫ్లై ఓవర్ పనులతోపాటు ముసారాం బాగ్ వద్ద వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. అంబర్పేటలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ చేపట్టిన 212.5 ఎమ్మెల్డీ సివరేజి ట్రీట్మెంట్ ప్లాంట్ (సీటీపీ) నిర్మాణ పనులను తనిఖీ చేశారు.